న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి

వైట్ ఐలండ్ అగ్నిపర్వతంపై పొగ

ఫొటో సోర్స్, Reuters

న్యూజీలాండ్‌లో ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, సమీప ప్రాంతంలో ఉన్న సుమారు 50 మందిలో పలువురు గల్లంతైనట్లు పోలీసులు చెప్పారు.

ఇప్పటి వరకు 23 మందిని కాపాడినట్లు తెలిపారు. సహాయ చర్యలకు సంబంధించి న్యూజీలాండ్ సైన్యం పోలీసులకు సహాయపడుతోంది.

వైట్ ఐలండ్ క్రేటర్‌లోని ఈ అగ్నిపర్వతం పేలుడుకు కొద్దిసేపటి ముందు కొందరు పర్యటకులు దాని సమీపంలో నడుస్తూ కనిపించారు.

అగ్నిపర్వతం సమీపం నుంచి రక్షించిన వారిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు.

వాకారి అని స్థానికంగా పిలిచే వైట్ ఐలండ్ న్యూజీలాండ్‌లోని నార్త్ ఐలండ్ తీరానికి దూరంగా ఉండే ఒక చిన్న దీవిగా ఉండే అగ్నిపర్వతం. దేశంలో అత్యంత క్రియాశీలంగా ఉండే అగ్నిపర్వతాల్లో ఇదొకటి.

అయినప్పటికీ.. ఈ అగ్నిపర్వత దీవిని సందర్శించటానికి రోజూ పర్యటకులు వస్తుంటారు. పగటి పూట పర్యటనలతో పాటు విహంగ విహారాలు కూడా ఉంటాయి.

ఈ దీవి నుంచి వెనుదిరిగి వస్తున్న మైఖేల్ షేడ్ అనే పర్యటకుడు.. అగ్నిపర్వతం విస్ఫోటనాన్ని వీడియో తీశారు. ఈ వీడియోలో పర్వతం పైభాగాన దట్టమైన బూడిదతో నిండిన పొగ కనిపిస్తోంది.

మరి కొందరు పర్యటకులు తమను రక్షించటం కోసం ఆ దీవిలో వేచి ఉండటం కూడా కనిపించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అగ్నిపర్వత విస్ఫోటనానికి కేవలం 30 నిమిషాల ముందు తాను ఆ క్రేటర్‌ను సందర్శించానని ఆయన బీబీసీకి తెలిపారు.

''అగ్నిపర్వతం అత్యంత క్రియాశీలంగా ఉంది.. అయినా సురక్షితంగానే అనిపించింది. ఆ సమయంలో దీనిని సందర్శించే పర్యటకుల బృందాల్లో సభ్యుల సంఖ్యను తగ్గించటానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు'' అని చెప్పారు.

''మేం బోటులోకి ఎక్కి మధ్యాహ్న భోజనం చేస్తున్నాం. అందువల్ల బోటు నెమ్మదిగా ముందుకు వెళుతోంది. పది నిమిషాలు గడిచింది. అకస్మాత్తుగా ఎవరో అటువైపు చూపించారు. మేం చూశాం. నేను దిగ్భ్రాంతి చెందాను. బోటు వెను దిరిగి దీవి దగ్గరకు వెళ్లింది. అక్కడ వేచిచుస్తున్న కొంతమందిని బోటులో ఎక్కించుకుని తిరిగి బయలుదేరాం'' అని ఆయన వివరించారు.

అగ్నిపర్వతం పేలుడుకు ముందు క్రేటర్ లోపల కొంత మంది పర్యటకులు ఉండటం.. వారు ఉండగానే దట్టంగా బూడిద పొగ నల్లగా అలుముకోవటం ఒక వీడియో దృశ్యంలో కనిపించింది.

న్యూజీలాండ్ ప్రధానమంత్రి జెసిందా ఆర్డెన్.. న్యూజిలాండ్‌తో పాటు విదేశాలకు చెందిన పలువురు పర్యటకులు ఈ దీవి మీద, సమీపంలో ఉన్నారని పేర్కొన్నారు.

వైట్ ఐలండ్ అగ్నిపర్వతం
ఫొటో క్యాప్షన్, పేలుడుకు ముందు అగ్నిపర్వత ముఖద్వారం వద్ద పర్యటకులు సంచరిస్తూ కనిపించారు

‘‘అక్కడ గల్లంతైన వారి కోసం బంధుమిత్రులు చాలా ఆందోళన చెందుతుంటారని నాకు తెలుసు. వారిని రక్షించటానికి పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు’’ అని ఆమె హామీ ఇచ్చారు.

పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారని.. కానీ దట్టమైన బూడిద కురుస్తుండటం వల్ల వారు ఆ ప్రాంతానికి చేరుకోలేకపోతున్నారని చెప్పారు.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2:11 గంటలకు (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6:49 గంటలకు) విస్ఫోటనం మొదలైంది.

''పేలుడు సమయంలో ఆ దీవి మీద కానీ దీవి సమీపంలో కానీ సుమారు 100 మంది ఉన్నారని తొలుత భావించారు. అయితే ఆ సమయంలో 50 మంది కన్నా తక్కువ ఉండి ఉంటారని ఇప్పుడు అంచనా వేస్తున్నాం'' అని పోలీసులు పేర్కొన్నారు.

వైట్ ఐలండ్ అగ్నిపర్వతం

''వారిలో కొంత మందిని తీరానికి తరలించాం. అయినా ఇంకొంతమంది ఆచూకీ తెలియటం లేదని భావిస్తున్నాం'' అని చెప్పారు.

అగ్నిపర్వతం పేలుడు వల్ల సమీప ప్రాంతాల్లో బూడిద కురిసే అవకాశం ఉందని, స్థానికులు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వైట్ ఐలండ్ అగ్నిపర్వతం పేలుడు క్రియాశీలత సాధారణం కన్నా అధికంగా ఉండే దశలోకి ప్రవేశిస్తోందని.. భౌగోళిక విపత్తుల పర్యవేక్షణ వెబ్‌సైట్ జియోనెట్ డిసెంబర్ 3వ తేదీన హెచ్చరించింది. అయితే.. ప్రస్తుత క్రియాశీలత స్థాయి పర్యటకులకు నేరుగా ప్రమాదకరం కాదని కూడా పేర్కొంది.

వైట్ ఐలండ్ అగ్నిపర్వతం పలుమార్లు బద్దలైంది. ప్రస్తుత పేలుడుకు ముందు చివరిసారి 2016లో విస్ఫోటనం సంభవించింది. ఆ సమయంలో ఎవరూ గాయపడలేదు.

వీడియో క్యాప్షన్, వీడియో: అగ్ని పర్వతం లోపల ఇలా ఉంటుంది!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)