చైనా నిర్మించాలనుకున్న కృత్రిమ దీవులు అక్కర్లేదన్న పసిఫిక్ దేశం తువాలు.. మద్దతు తైవాన్‌కేనని స్పష్టీకరణ

సముద్రమట్టంలో పెరుగుదలతో తువాలు ముంపు ముప్పును ఎదుర్కొంటోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సముద్రమట్టంలో పెరుగుదలతో తువాలు ముంపు ముప్పును ఎదుర్కొంటోంది

తువాలు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న దేశం. సముద్రమట్టంలో పెరుగుదల వల్ల ఇది ముంపు ముప్పును ఎదుర్కొంటోంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు వీలుగా కృత్రిమ దీవులను నిర్మిస్తామన్న చైనా కంపెనీల ప్రతిపాదనను తువాలు తోసిపుచ్చింది.

తువాలు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సైమన్ కోఫ్ వార్తాసంస్థ 'రాయిటర్స్'తో మాట్లాడుతూ- చైనా కంపెనీల ప్రతిపాదన తమ ప్రాంతంలో తైవాన్ ప్రాబల్యాన్ని తగ్గించే యత్నంగా తనకు అనిపించిందన్నారు.

తువాలు మద్దతు తైవాన్‌కేనని ఆయన పునరుద్ఘాటించారు.

పసిఫిక్ మహాసముద్రంలో ప్రాబల్యాన్ని మరింతగా పెంచుకొనేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ చర్యలపై అమెరికా, దాని మిత్రదేశాలు ఆందోళన చెందుతున్నాయి.

తువాలు

ఫొటో సోర్స్, Getty Images

తైవాన్‌ను సార్వభౌమ దేశంగా కేవలం 15 దేశాలే గుర్తిస్తున్నాయి. అవే తైవాన్‌తో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను నెరపుతున్నాయి.

ఇటీవలి సంవత్సరాల్లో అనేక దేశాలు తైవాన్‌కు మద్దతును ఉపసంహరించి చైనా పక్షాన చేరాయి.

తైవాన్‌ను గుర్తించే ఏ దేశంతోనూ దౌత్య సంబంధాలు నెరపబోమని చైనా హెచ్చరిస్తూ వస్తోంది.

ఇటీవలి నెలల్లో పసిఫిక్ మహాసముద్రంలోని రెండు దేశాలు కిరిబస్, సాల్మన్ ఐలాండ్స్.. తైవాన్‌కు మద్దతు ఉపసంహరించి, చైనాకు అందించాయి.

ఆర్థిక సహకారం, విమానాలు అందిస్తామనే హామీలతో కిరిబస్‌ను, సాల్మన్ ఐలాండ్స్‌ను చైనా తన వైపు తిప్పుకొందనే ఆరోపణలు ఉన్నాయి.

తువాలు విదేశీ వ్యవహారాల మంత్రి సైమన్ కోఫ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తువాలు విదేశీ వ్యవహారాల మంత్రి సైమన్ కోఫ్

మేం నలుగురం జట్టు కడతాం: సైమన్ కోఫ్

పసిఫిక్ ప్రాంతంలో మిగిలిన నాలుగు తైవాన్ మిత్రదేశాలు మార్షల్ ఐలాండ్స్, పలావ్, నరూ, తువాలు కలసికట్టుగా ఉండేలా తువాలు ఒక కూటమిని ఏర్పాటు చేస్తోందని మంత్రి సైమన్ కోఫ్ తెలిపారు.

జట్టు కట్టడం, కలసి పనిచేయడంలో ఉండే శక్తిని తాము నమ్ముతామని ఆయన రాయిటర్స్‌తో చెప్పారు. చైనా ప్రాబల్యాన్ని తమ భాగస్వామ్య దేశాలతో కలసి ఎదుర్కోగలమని వ్యాఖ్యానించారు.

తువాలులో 40 కోట్ల డాలర్లతో కృత్రిమ దీవులను నిర్మించాలన్న ప్రభుత్వ ప్రణాళిక అమలులో తోడ్పడతామని చైనా కంపెనీలు ప్రతిపాదన తెచ్చాయని సైమన్ కోఫ్ వివరించారు.

ఈ సంస్థలకు చైనా ప్రభుత్వ మద్దతు ఉందని ఆయన భావిస్తున్నారు.

చైనా రుణాల గురించి తాము చాలా వింటున్నామని మంత్రి తెలిపారు. చైనా తమ ద్వీపాలను కొని, సైనిక స్థావరాలను ఏర్పాటు చేయాలని చూస్తోందని, ఈ ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.

తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్-వెన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్-వెన్

హాంకాంగ్ మాదిరి 'ఒకే దేశం, రెండు వ్యవస్థలు' విధానం ప్రకారం వ్యవహరించాలని తైవాన్‌కు చైనా ప్రతిపాదించింది.

తైవాన్ అధ్యక్షురాలిగా త్సాయ్ ఇంగ్-వెన్ 2016లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏడు దేశాలు తైవాన్‌తో దౌత్య మితృత్వాన్ని వదులుకున్నాయి.

తైవాన్‌కు తువాలు మద్దతు జనవరిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకు కలసి వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)