కశ్మీర్ అంశంపై వేరే దేశాన్ని జోక్యం చేసుకోనివ్వం - జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్తో మోదీ

భారత్, పాకిస్తాన్ మధ్య సమస్యలను తమకుతాముగానే పరిష్కరించుకోగలమని, దానికి మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు.
జీ7 సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఇద్దరు నేతలూ మీడియా సమావేశంలో మాట్లాడారు.
"ఇటీవల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీని అభినందించాను. వాణిజ్యం, సైన్యం గురించి, ఇంకా ఎన్నో అంశాలపై మాట్లాడుకున్నాం" అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.
అనంతరం మాట్లాడిన మోదీ... ఈరోజు నా మిత్రుడు, ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాధ్యక్షుడిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
"ఎప్పుడు అవకాశం దొరికినా మేం కలుస్తూనే ఉన్నాం. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. సుమారు 700 మిలియన్ ఓటర్లు గత ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలివ్వడం ప్రపంచంలోనే మొదటిసారి అనుకుంటా. ఫోన్ చేసి అభినందించినందుకు కృతజ్ఞతలు.
భారత్ అమెరికా.. ప్రజాస్వామ్య విలువలను ముందుకు తీసుకెళ్లే దేశాలు. ప్రపంచ క్షేమం కోసం కలిసి పనిచేయడం, భాగస్వామ్యం అందించడం, మా ఉమ్మడి విలువలతో మానవజాతికి, ప్రపంచాభివృద్ధికి ఉపయోగపడడం లాంటి ఎన్నో విషయాలపై చాలా లోతుగా చర్చిస్తుంటాం.
ఆర్థిక, వాణిజ్య రంగాలలో భారత్, అమెరికా చర్చలు నిరంతరం కొనసాగుతున్నాయి. చాలా అంశాల్లో మేం అమెరికా కల్పించిన సౌకర్యాలను స్వాగతిస్తున్నాం. మేం కలిసి వాణిజ్య రంగంలో ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం.
భారత సమాజం అమెరికాలో భారీ పెట్టుబడులు పెడుతోంది. అమెరికా అభివృద్ధిలో భారత సమాజం ఎంత భాగస్వామ్యం అందిస్తోందో, అమెరికా కూడా భారత సమాజానికి అంత గౌరవం, ఆదరణ ఇస్తోంది. దానికి నేను అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను" అని మోదీ వ్యాఖ్యానించారు.

కశ్మీర్ అంశంపై ఎవరేమన్నారు?
ట్రంప్ - మేం కశ్మీర్ గురించి చర్చించాం. అక్కడ పరిస్థితి అదుపులో ఉందని భారత ప్రధాని అన్నారు.
మోదీ- భారత్, పాకిస్తాన్ మధ్య ఎన్నో ద్వైపాక్షిక అంశాలున్నాయి. పాక్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఫోన్ చేశాను. పాక్ పేదరికంతో పోరాడాలి, భారత్ కూడా. భారత్-పాక్ నిరక్షరాస్యత, వ్యాధులపై కూడా పోరాడాలని చెప్పాను. పేదరికం సహా, అన్ని సమస్యలపై మనం కలిసి పోరాడదాం అని చెప్పాను. రెండు దేశాల ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేద్దాం అని చెప్పాను. అధ్యక్షుడు ట్రంప్తో కూడా ఎప్పుడూ ఈ ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుతూనే ఉన్నాను.

కశ్మీర్ అంశంలో అమెరికా జోక్యం అంగీకరిస్తారా?
మోదీ- భారత్, పాక్ మధ్య ఉన్న అన్ని సమస్యలు ద్వైపాక్షికం. అందుకే మేం ప్రపంచంలోని ఏ దేశాన్నీ దానికోసం ఇబ్బందిపెట్టం. భారత్-పాకిస్తాన్ 1947కు ముందు కలిసే ఉన్నాయి. మా రెండు దేశాలూ కలిసి మా సమస్యలపై చర్చించుకోగలం, దానికి పరిష్కారం కూడా వెతకగలమనే నమ్మకం నాకుంది.
ట్రంప్ - మా మధ్య మంచి సంబంధాలున్నాయి. కాబట్టే నేను ఇక్కడున్నా. వాళ్లు చాలా రోజుల నుంచీ అలా చర్చలు జరుపుతున్నారు. ఈ సమస్యలను వారే పరిష్కరించుకుంటారని భావిస్తున్నాను.
మోదీ మంచి ఇంగ్లిష్ మాట్లాడతారని, కానీ ఈరోజు ఎందుకో హిందీలో మాట్లాడుతున్నారు అని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించగా, మోదీ నవ్వుతూ ట్రంప్ చేతులపై గట్టిగా తట్టారు.
ఇవి కూడా చదవండి
- ఆసియాలోనూ సైనిక సూపర్ పవర్ అమెరికానేనా?
- ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతి నగర నిర్మాణం ఎంతవరకు వచ్చింది...
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు... అతి చౌక నగరాలు
- బుమ్రా సూపర్ ఇన్నింగ్స్... ఆంటిగ్వా టెస్టులో భారత్ ఘనవిజయం
- చరిత్ర సృష్టించిన పీవీ సింధు... బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం
- అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు.. కనీస వివాహ వయసులో ఈ తేడా ఎందుకు?
- భారతదేశంలో జన్మించిన పాకిస్తాన్ 'ప్రథమ మహిళ' రానా లియాకత్ అలీ
- విరేచనాలు ఎందుకు వస్తాయి? అరికట్టడం ఎలా...
- బేర్ గ్రిల్స్ నా హిందీని ఎలా అర్థం చేసుకున్నారంటే... ‘రహస్యాన్ని’ వెల్లడించిన మోదీ
- అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు.. కనీస వివాహ వయసులో ఈ తేడా ఎందుకు?
- వృద్ధాప్యాన్ని దాచుకునే ప్రయత్నం ఎందుకు చేస్తాం?
- జేమ్స్ బాండ్ చెడ్డవాడా? ఇప్పుడు మంచివాడిగా మారుతున్నాడా...
- నాజీల కాలం నాటి మానవ శరీర నిర్మాణ శాస్త్ర గ్రంథం వెనుక ఉన్న రక్తసిక్త చరిత్ర ఏంటి...
- అంతరిక్షం నుంచి తొలి నేరం... భూమ్మీద బ్యాంకు ఖాతాను హ్యాక్ చేశారని ఆరోపణలు
- అరుణ్ జైట్లీ: వాజ్పేయి తర్వాత బీజేపీలో ఉదారవాద నాయకుడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








