మోదీ: 'నా హిందీని బేర్ గ్రిల్స్ ఎలా అర్థం చేసుకున్నారంటే...' - రహస్యాన్ని వెల్లడించిన ప్రధాని

ఫొటో సోర్స్, DISCOVERY
'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో ప్రముఖ ప్రజెంటర్ బేర్ గ్రిల్స్తో తన సంభాషణలో సాంకేతిక పరిజ్ఞానం బాగా తోడ్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తనకూ, బేర్ గ్రిల్స్కూ మధ్య టెక్నాలజీ వారధిలా పనిచేసిందన్నారు.
తన హిందీని బేర్ గ్రిల్స్ ఎలా అర్థం చేసుకొన్నారో తెలుసుకోవాలని చాలా మంది అనుకొంటున్నారని ఆయన ఆదివారం 'మన్ కీ బాత్' కార్యక్రమంలో చెప్పారు.
"బేర్ గ్రిల్స్కు హిందీ తెలియదు కదా, మరి మీరిద్దరూ అంత వేగంగా ఎలా మాట్లాడుకోగలిగారు అని కొందరు అడిగారు? ఆ ఎపిసోడ్ను తర్వాత ఎడిట్ చేశారా? ఆ ఎపిసోడ్ కోసం ఎన్నిసార్లు చిత్రీకరణ చేశారు, ఎలా చేశారు అని కుతూహలంతో ప్రశ్నించారు. చాలా మంది మెదళ్లలో ఈ ప్రశ్న ఉంది" అని మోదీ ప్రస్తావించారు.
నిజానికి ఇందులో రహ్యసమేమీ లేదని, ఇప్పుడీ రహస్యాన్ని చెబుతానని, ఒక రకంగా చూస్తే ఇది రహస్యం కూడా కాదని ప్రధాని వ్యాఖ్యానించారు.
"బేర్ గ్రిల్స్తో సంభాషణలో టెక్నాలజీని బాగా వాడాం. నేను మాట్లాడిన వెనువెంటనే నా మాట హిందీలోంచి ఇంగ్లిష్లోకి అనువాదమైంది. బేర్ గ్రిల్స్ చెవికి అమర్చిన చిన్న కార్డ్లెస్ పరికరం నా మాటను ఆయనకు ఇంగ్లిష్లో వినిపించింది" అని మోదీ వివరించారు.

ఫొటో సోర్స్, DISCOVERY
సాంకేతిక పరిజ్ఞానం తమ మధ్య సమాచార వినిమయాన్ని సులభతరం చేసిందని ఆయన చెప్పారు. ఇది టెక్నాలజీ గొప్పతనమని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమం ప్రసారమైన తర్వాత చాలా మంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గురించి మాట్లాడుకొంటున్నారని ప్రధాని ప్రస్తావించారు. ప్రకృతి, వన్యప్రాణులు ఉండే ప్రదేశాలను తప్పక సందర్శించాలని సూచించారు.
ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో చిత్రీకరించిన ఈ 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' ఎపిసోడ్ ఆగస్ట్ 12న డిస్కవరీ చానల్లో ప్రసారమైంది.

ఫొటో సోర్స్, DISCOVERY
పర్యావరణ సంరక్షణ, వాతావరణ మార్పులు వంటి అంశాలపై ప్రజలు దృష్టి సారించేలా చేసేందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ప్రధాని మోదీ గతంలో చెప్పారు.
కార్యక్రమంలో భాగంగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో మోదీ, బేర్ గ్రిల్స్ చెట్లు, పుట్టల మధ్య నడుస్తూ, కొండలు ఎక్కుతూ కనిపించారు. వారిద్దరూ చాలా అంశాల గురించి మాట్లాడుకున్నారు.
మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితాలతోపాటు ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమ గురించి బేర్ గ్రిల్స్ ఆయన్ను చాలా ప్రశ్నలు వేశారు.
ఈ ఎపిసోడ్పై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ సాగింది.
ఇవి కూడా చదవండి:
- రబ్బర్ పరిశ్రమ... భయంకర రక్తచరిత్ర
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- అమెజాన్ తగలబడుతోంది.. ఈ కార్చిచ్చును ఆపేదెలా?
- భూతాపం: 'ఇకనైనా మేలుకోకుంటే మరణమే..' పర్యావరణ శాస్త్రవేత్తల తుది హెచ్చరిక
- నాజీల కాలం నాటి మానవ శరీర నిర్మాణ శాస్త్ర గ్రంథం వెనుక ఉన్న రక్తసిక్త చరిత్ర ఏంటి...
- చిదంబరం అరెస్టుకు.. తొమ్మిదేళ్ల కిందట అమిత్షా అరెస్టుకు సంబంధమేమిటి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








