శ్రీలంక: హిందూ ఆలయాల వద్ద జంతుబలిని నిషేధించనున్న ప్రభుత్వం.. ఎందుకు?

కొలంబోలో వేల్ హిందూయిజం పండుగలో పాల్గొన్న శ్రీలంక తమిళ హిందూ భక్తురాలు

ఫొటో సోర్స్, Getty Images

హిందూ ఆలయాల వద్ద జంతువులను బలి ఇచ్చే ఆచారాన్ని నిషేధించేందుకు శ్రీలంక ప్రభుత్వం అంగీకరించింది.

హిందూ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖే ఈ ప్రతిపాదన చేసిందని, దేశంలోని చాలా హిందూ సంస్థలు మద్దతు తెలిపాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీకి తెలిపారు.

దేవుళ్లు, దేవతలకు మొక్కు చెల్లింపుగా శ్రీలంకలోని కొంతమంది హిందువులు మేకలు, గొర్రెలు, గేదె దూడలు, కోళ్లను బలి ఇస్తుంటారు.

అయితే, బౌద్ధ మతస్తులు అధికంగా ఉన్న శ్రీలంకలో.. ఈ జంతుబలి అమానవీయం అంటూ చాలా సంవత్సరాలుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

హిందూ మతంతో పాటు ముస్లిం మత పండుగల సమయంలో పలుమార్లు జంతువులు రక్తమోడి ప్రాణాలు విడుస్తుండటంపై జంతు హక్కుల కార్యకర్తలు, కొన్ని బౌద్ధ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కొలంబోలోని ఒక హిందూ దేవాలయంలో పూజలకు హాజరైన శ్రీలంక తమిళ హిందూ భక్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంక జనాభాలో హిందువులు దాదాపు 12 శాతం ఉంటారు

దీంతో చాలామంది హిందువులు జంతువులను బలివ్వటం మానుకున్నారు. అలాగే కొనసాగిస్తున్న హిందువులు మాత్రం జంతు బలులపై నిషేధం తమ మత స్వేచ్ఛను హరించటమేనని వాదిస్తున్నారు.

పురాతన కాలంగా తమ మత విశ్వాసాల్లో జంతు బలి భాగమని, కాబట్టి దీనిని కొనసాగించాల్సిందేనని అంటున్నారు.

కాగా, శ్రీలంకలో మూడో అతిపెద్ద మతమైన ముస్లింలు చేసే జంతు బలుల్ని ఈ చట్టం నిషేధిస్తున్నట్లు లేదు.

శ్రీలంకలో గత కొన్ని సంవత్సరాలుగా దారుణమైన మతపరమైన హింస చోటు చేసుకుంది. మార్చి నెలలో ముస్లింల ఊచకోతలో ముగ్గురు చనిపోయారు. ముస్లింలకు చెందిన దాదాపు 450 ఇళ్లు, షాపులు ధ్వంసమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

line

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)