తిమింగలం మాతృప్రేమ: చనిపోయిన పిల్ల తిమింగలంతో 17 రోజుల పాటు 1,600 కిలోమీటర్ల ప్రయాణం

చనిపోయిన పిల్ల తిమింగలం

ఫొటో సోర్స్, KEN BALCOMB, CENTER FOR WHALE RESEARCH

కిల్లర్ వేల్ జాతికి చెందిన ఓ తిమింగలం తను జన్మనిచ్చిన పిల్ల తిమింగలం చనిపోయాక కూడా దాని శరీరాన్ని 17 రోజుల పాటు వదిలిపెట్టలేదని పరిశోధకులు వెల్లడించారు.

కెనడాలోని వాంకోవర్ దీవి సమీపంలోని సముద్రంలో.. చనిపోయిన పిల్ల తిమింగలాన్ని తన తలతో నెట్టుకుంటూ దాదాపు 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది ఆ తల్లి తిమింగలం.

ఎట్టకేలకు 17 రోజుల తర్వాత.. చనిపోయిన పిల్లను వదిలేసిన తల్లి తిమింగలం.. తన గుంపులోని ఇతర తిమింగలాలతో కలిసి సాల్మన్ చేపల గుంపు వెంట పడిందని సెంటర్ ఫర్ వేల్ రీసెర్చ్ (సీడబ్ల్యూఆర్) తెలిపింది.

క్షీరదాలైన కిల్లర్ వేల్స్.. తమ పిల్లలు చనిపోతే వాటిని వారం రోజుల పాటు విడవకుండా అట్టిపెట్టుకోవటం సాధారణం. అయితే ‘జే39’గా గుర్తిస్తున్న ఈ కిల్లర్ వేల్ తల్లి ఈ విషయంలో కొత్త ‘రికార్డు’ సృష్టించిందని పరిశోధకులు చెప్తున్నారు.

పిల్ల తిమింగలం శరీరాన్ని నెట్టుకెళుతున్న తల్లి తిమంగలం

ఫొటో సోర్స్, DAVE ELLIFRIT, CENTER FOR WHALE RESEARCH

ఫొటో క్యాప్షన్, పిల్ల తిమింగలం శరీరాన్ని నెట్టుకెళుతున్న తల్లి తిమంగలం

మూడు వారాల విషాద పర్యటన

ఇది చనిపోయిన తన పిల్ల తిమింగలం శరీరంతో జులై 24న వాంకోవర్ దీవి తీరంలో మొదట కనిపించింది. అప్పటి నుంచి గత మూడు వారాలుగా ఈ కిల్లర్ వేల్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

పిల్ల తిమింగలం ఆ రోజే చనిపోయినట్లు భావిస్తున్నారు. దాని మృతికి కారణాలు తెలియదు.

‘‘ఆ తల్లి తిమింగలం విషాద పర్యటన ఇప్పుడు ముగిసింది. తీరం నుంచి తీసిన టెలిఫొటో డిజిటల్ చిత్రాల్లో అది శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని సీడబ్ల్యూఆర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

‘‘పిల్ల తిమింగలం మృతశరీరం.. శాలిష్ సముద్రజలాల్లో (అమెరికా - కెనడాల మధ్య సముద్రజలాలు) మునిగిపోయి అడుగుభాగానికి వెళ్లిపోయి ఉంటుంది. దానికి నెక్రోప్సీ (జంతుకళేబారాలకు చేసే శవపరీక్ష) చేసే అవకాశం పరిశోధకులకు లభించకపోవచ్చు’’ అని తెలిపింది.

పిల్ల తిమింగలం శరీరాన్ని నెట్టుకెళుతున్న తల్లి తిమంగలం

ఫొటో సోర్స్, MICHAEL WEISS, CENTER FOR WHALE RESEARCH

సదరన్ రెసిడెంట్ కిల్లర్ వేల్‌ జాతి తిమింగలాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతిగా కెనడా, అమెరికాలు పరిగణిస్తున్నాయి.

ఈ జాతి తిమింగలాలు గత 20 ఏళ్లలో జన్మనిచ్చిన పిల్లల్లో కేవలం మూడో వంతు మాత్రమే మనగలిగాయని పరిశోధనలు చెప్తున్నాయి. గత మూడేళ్లుగా ఒక్క తిమింగలం పిల్ల కూడా బతకలేదు.

ఈ తిమింగలాలు ఆహారం కోసం చినూక్ సాల్మన్ చేపలపై ఆధారపడతాయి. ఆ చేపలు ఇటీవలి కాలంలో తగ్గిపోయాయి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)