యాపిల్ - శాంసంగ్‌ల మధ్య ఏడేళ్ల ‘పేటెంట్ యుద్ధానికి’ తెర

యాపిల్ ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యాపిల్ ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఫోన్

మొబైల్ ఫోన్ల దిగ్గజ సంస్థలు యాపిల్, శాంసంగ్‌.. స్మార్ట్‌ఫోన్ల విషయంలో తమ మధ్య ఏడేళ్లుగా కొనసాగుతున్న ఒక పేటెంట్ వివాదాన్ని ఎట్టకేలకు పరిష్కరించుకున్నాయి.

అయితే ఈ ఒప్పందంలోని అంశాలు, విధివిధానాలను బయటపెట్టలేదు.

ఒరిజినల్ ఐఫోన్ ఫీచర్స్‌ను కాపీ చేసినందుకు గాను యాపిల్ సంస్థకు 53.9 కోట్ల డాలర్లు (దాదాపు 3,710 కోట్ల రూపాయలు) పరిహారం చెల్లించాలని శాంసంగ్‌ను అమెరికా జ్యూరీ ఆదేశించిన కొన్ని వారాలకు ఈ ఒప్పందం కుదరటం గమనార్హం.

దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ నుంచి 200 కోట్ల డాలర్లు (దాదాపు 13,764 కోట్లు రూపాయలు) పరిహారం కోరుతూ యాపిల్ సంస్థ 2011లో దావా వేయటంతో ఈ వివాదం మొదలైంది.

ఆ కేసు తర్వాత ఈ రెండు సంస్థలూ ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో పరస్పరం కేసులు వేసుకున్నాయి.

కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న యాపిల్‌కు 105 కోట్ల డాలర్లు (దాదాపు 7226 కోట్ల రూపాయలు) పరిహారం చెల్లించాలని 2012లో అమెరికా కోర్టు తీర్పు చెప్పింది. ఐఫోన్ డిజైన్‌లో భాగమైన గ్రిడ్ డిస్‌ప్లే స్క్రీన్ వంటి ఫీచర్లను కాపీ చేసినందుకు గాను ఈ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఆ తీర్పులోని కొంత భాగం మీద శాంసంగ్ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. పేటెంట్ ఉల్లంఘన కేవలం కొన్ని ఫీచర్లకే పరిమితమైనందున పరిహారం కూడా పరిమితంగా ఉండాలని వాదించింది.

ఆ కేసులో శాంసంగ్ వాదనను అంగీకరస్తూ సుప్రీంకోర్టు 2016లో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అయితే.. న్యాయమూర్తులు పేటెంట్ల మీద ఆదేశాలు ఇవ్వలేదు. దానిపై నిర్ణయాన్ని కింది కోర్టుకు వదిలిపెట్టారు.

ఈ వివాదం మీద మే నెలలో విచారణ జరిగింది. తాను కేవలం 2.8 కోట్ల డాలర్లు (సుమారు 193 కోట్ల రూపాయలు) మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వాదించిన శాంసంగ్ ఓడిపోయింది.

యాపిల్‌కు 53.9 కోట్ల డాలర్లు (దాదాపు 3,710 కోట్ల రూపాయలు) పరిహారం చెల్లించాలని జ్యూరీ తీర్పు చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)