రిలయన్స్ 5జీ ప్లాన్‌తో ఫేస్‌బుక్‌కు సంబంధం ఏంటి, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి పోటీ తప్పదా?

ముఖేశ్ అంబానీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనాబెల్ లియాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

రెండు నెలల్లోగా దేశంలో 5జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రవేశపెడతామని ముకేశ్ అంబానీ ఇటీవల ప్రకటించారు. 25 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.98 లక్షల కోట్లు)తో ఆయన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రణాళికను కూడా ప్రజల ముందుపెట్టింది.

మొదటగా దిల్లీ, ముంబయి లాంటి మహా నగరాల్లో హైస్పీడ్ నెట్‌వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని అంబానీ వెల్లడించారు.

డిసెంబరు 2023నాటికి దేశం మొత్తానికి ఈ సేవలను విస్తరిస్తామని ఆయన చెప్పారు.

మరోవైపు బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.

5జీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలోనే అత్యంత భారీగా

ఒకసారి రిలయన్స్ 5జీ నెట్‌వర్క్ పూర్తిగా అందుబాటులోకి వస్తే, ఇది ప్రపంచంలోనే తమదే అతిపెద్ద 5జీ నెట్‌వర్క్ అవుతుందని సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశంలో అంబానీ అన్నారు.

రిలయన్స్ అనుబంధ సంస్థ జియో నేతృత్వంలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు.

ప్రజలకు అందుబాటు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు అమెరికా టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు అంబానీ చెప్పారు. అయితే, ఎప్పుడు ఈ ఫోన్‌ను ఆవిష్కరిస్తారు? దీని ధర ఎంత ఉంటుంది? లాంటి విషయాలను ఆయన వెల్లడించలేదు.

ప్రస్తుతం భారత్‌లోని 5జీ స్మార్ట్‌ఫోన్‌లు 12,000 రూపాయల నుంచి లభిస్తున్నాయి.

5జీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లోని డిజిటల్ రంగంలో ఆధిపత్యం కోసం టెక్ దిగ్గజాలు పోటీ పడుతున్న నేపథ్యంలో రిలయన్స్ తాజా ప్రకటన చేసింది.

5జీ తరంగాలతోపాటు మొత్తంగా ఎయిర్‌వేవ్స్‌ను 19 బిలియన్ డాలర్లు (రూ.1.51 లక్షల కోట్లు)కు భారత ప్రభుత్వం ఇటీవల వేలం వేసింది. దీనిలో జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది.

మరోవైపు వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్, అదానీ డేటా నెట్‌వర్క్స్‌ కూడా బిడ్లు వేశాయి.

డ్రైవర్ లెస్ కార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధస్సు) లాంటి భవిష్యత్‌తరం టెక్నాలజీలకు 5జీ సేవలు మెరుగ్గా ఉపయోగపడతాయి.

మరోవైపు దేశాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.80 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా మార్చాలని భారత్ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల్లోనూ 5జీ కీలక పాత్ర పోషించనుంది.

5జీతో ఇంటర్నెట్ స్పీడ్‌తోపాటు అభివృద్ధి, ఉపాధి కల్పన కూడా జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత మే నెలలో చెప్పారు.

వారసుల ప్రకటన

మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలను కూడా ముకేశ్ అంబానీ ప్రకటించారు.

రిలయన్స్ రీటెయిల్ వెంచర్స్‌కు తన కుమార్తె ఈషా అంబానీ, ఎనర్జీ బిజినెస్‌కు కుమారుడు అనంత్ నేతృత్వం వహిస్తారని 65 ఏళ్ల ముఖేశ్ అంబానీ ప్రకటించారు.

తన పెద్ద కొడుకు అకాశ్‌ను ఈ ఏడాది జూన్‌లో జియోకు ఛైర్మన్‌గా ముకేశ్ అంబానీ ప్రకటించారు.

91.9 బిలియన్ డాలర్ల (రూ.7.31 లక్షల కోట్లు) సంపదతో అంబానీ ప్రపంచంలో ఏడో అత్యధిక సంపన్నుడని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది.

ఫేస్‌బుక్

ఫొటో సోర్స్, Getty Images

ఫేస్‌బుక్‌తో కలిసి ఎలా

లైను

ఇండియా బిజినెస్ కరస్పాండెంట్ అరుణోదయ్ ముఖర్జీ విశ్లేషణ

లైను

25 బిలియన్ డాలర్లతో ముఖేశ్ అంబానీ ప్రకటించిన 5జీ సేవలతో టెలికాంతోపాటు రీటెయిల్ రంగంలోనూ రిలియన్స్ పైచేయి సాధించాలని చూస్తోంది.

దీని కోసం రెండు టెక్ దిగ్గజాలు – రిలయన్స్, మెటా (ఫేస్‌బుక్) కలిసి పనిచేయబోతున్నట్లు అంబానీ వెల్లడించారు.

దేశంలోని 140 కోట్ల మంది ప్రజల్లో 50 కోట్ల మంది మెటాకు చెందిన వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ సాయంతో ‘‘ఆన్‌లైన్ రీటెయిల్’’ సేవలు ప్రారంభించాలని అంబానీ ప్రణాళికలు రచిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా షేర్ మార్కెట్‌పై పట్టు ఎలా సాధించారు

వాట్సాప్‌కు అతిపెద్ద మార్కెట్ భారత్. ‘‘వాట్సాప్ బిజినెస్’’ ప్లాట్‌ఫామ్‌ను భారత ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని ఏడాది నుంచి మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఆలోచిస్తున్నారు. దీంతో ఈ రెండు సంస్థలకూ 5జీ కలిసి వస్తుంది.

వాట్సాప్‌తో కలిసి పనిచేయడం వల్ల ఆన్‌లైన్ రీటెయిల్ సెక్టార్‌లోనూ రిలయన్స్ విస్తరిస్తుంది. మరోవైపు రిలయన్స్‌తో కలిసి పనిచేయడం ద్వారా వాట్సాప్‌కు భారత మార్కెట్‌పై మరింత పట్టు పెరుగుతుంది.

భారత రీటెయిల్ మార్కెట్ విలువ 700 బిలియన్ డాలర్లు (రూ.55.72 లక్షల కోట్లు). శరవేగంగా అభివృద్ధి చెందుతున్న, లాభాల పంట పండిస్తున్న 12,000కుపైగా స్టోర్ల చైన్‌తో ‘‘రిలయన్స్ రీటెయిల్’’ ఈ రంగంలో ఆధిపత్యం కనిపిస్తోంది.

ఇప్పుడు రిలయన్స్, మెటా కలిస్తే, ‘‘ఆన్‌లైన్ రీటెయిల్’’ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి పోటీ వస్తుంది.

లైను

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)