సమంత: ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’లో వక్తగా ఆహ్వానం - ప్రెస్రివ్యూ

ఫొటో సోర్స్, INSTAGRAM/SAMANTHARUTHPRABHUOFFL
గోవాలో జరిగే ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(ఐఎఫ్ఎఫ్ఐ) కార్యక్రమానికి వక్తగా సమంతకు ఆహ్వానం అందిందంటూ సాక్షి పత్రిక తెలిపింది.
‘‘నాగ చైతన్యతో విడాకుల అనంతరం సినిమాల పరంగా సమంత మరింత వేగం పెంచారు. వరుసగా ప్రాజెక్ట్స్ సంతకం చేయడమే కాకుండా రెమ్యునరేషన్ను కూడా భారీగా పెంచారు. ఇవే కాకుండా పలు ఈవెంట్స్కు కూడా ఆమె స్పెషల్ గెస్ట్గా హాజరవుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా సామ్కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల గోవాలో జరిగే ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(ఐఎఫ్ఎఫ్ఐ) కార్యక్రమానికి స్పీకర్గా సమంతకు ఆహ్వానం అందింది.
ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్ఎఫ్ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు.
దీంతో ఈ ఈవెంట్లో స్పీకర్గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది భారత నటిగా సమంత గుర్తింపు పొందింది.
ఇక వక్తగా సమంతతో పాటు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయిను కూడా ఎంపిక చేశారు నిర్వాహకులు.
అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందింది. కాగా ఈ ఫెస్టివల్ నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంద’’ని ఈ వార్తలో రాశారు.

ఫొటో సోర్స్, iStock
విజయవాడ కేంద్రంగా వాట్సాప్లో చిన్నారులపై నీలిచిత్రాల విక్రయం
చిన్నపిల్లలతో నీలిచిత్రాలు చిత్రీకరించి.. వాటిని విక్రయిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న గుర్తుతెలియని వ్యక్తిపై దిల్లీలోని జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది.
‘‘ఓ అజ్ఞాత వ్యక్తి ఈ అంశంపై తమకు సమాచారం ఇచ్చారంటూ కమిషన్ ప్రతినిధి పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. వాటిని అంతర్జాలంలో ఏ వెబ్సైట్లలో ఉంచారు? ఏఏ లింకులతో విక్రయిస్తున్నారు? అనే వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోక్సో, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నీలిచిత్రాలను విక్రయిస్తున్న నేరస్థుడి వివరాలను తెలుసుకున్నారు. విజయవాడలో ఉన్నట్టు గుర్తించారు. నీలిచిత్రాలకు సంబంధించి అంతర్జాలంలో ఉంచిన లింకులు, వాటిని ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారన్న అంశాలపై మరింత సమాచారం సేకరిస్తున్నారు.
దిల్లీలో నివాసముంటున్న ఓ వ్యక్తికి నెలరోజుల క్రితం వాట్సప్ సందేశం వచ్చింది. తక్కువ ధరకే నీలిచిత్రాలు ముఖ్యంగా మైనర్లపై చిత్రీకరించినవి ఉన్నాయంటూ ఆ సందేశంలో వివరాలున్నాయి.
చిన్నపిల్లలపై నీలిచిత్రాల అంశంపై అవగాహన ఉన్న ఆయన ఈ విషయాన్ని జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని భావించారు.
వెంటనే తనకు సందేశం పంపిన వ్యక్తితో వాట్సప్లో మాట్లాడారు. తనకు వందల్లో నీలిచిత్రాల వీడియోలు కావాలని, రూ.2 వేలు ఇస్తానని చెప్పాడు.
అంత అవసరం లేదు... రూ.500 చాలంటూ నేరస్థుడు ఆ వ్యక్తికి బదులిచ్చాడు. ఈ మేరకు నగదు బదిలీ చేయగానే... సదరు నేరస్థుడు నాలుగువేల వీడియోలకు సంబంధించిన లింకులను పంపించాడు.
వాటిని ఆ వ్యక్తి నేరుగా జాతీయ చిన్నారుల హక్కుల కమిషన్కు పంపించాడు. సంబంధిత లింకులను పరిశీలించిన కమిషన్ అధికారులు ఐపీ చిరునామాలు హైదరాబాద్లో ఉండడంతో పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి నిందితుడిని అరెస్ట్ చేయాలని కోరార’ని పత్రిక తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కల్తీ మాంసం.. జాగ్రత్త
గడిచిన కొన్ని నెలలుగా జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు మాంసం అమ్మకాలు జరిపే షాపులపై దాడులు నిర్వహించగా..నిబంధనలు అతిక్రమించిన 139 షాపు నిర్వాహకులపై కొరఢా ఝళిపించిందని నమస్తే తెలంగాణ ఓ కథనంలో తెలిపింది.
‘‘539 కిలోల కల్తీ మటన్, బీఫ్.. 2851 కిలోల మేర ఇతర కల్తీ మాంసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జరిమానాలు రూ.63,100 వసూలు చేసినట్లు వెటర్నరీ అధికారుల రికార్డుల్లో స్పష్టమవుతున్నది.
సికింద్రాబాద్, కూకట్పల్లి, ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే కల్తీ మాంసం ఎక్కువగా అమ్ముతున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. మటన్ కొనేముందు జీహెచ్ఎంసీ స్టాంపు వేసిన మాంసాన్నే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని మాంసం దుకాణాదారులు జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం ఆమోదించిన మాంసాన్నే అమ్మాలి.
అంబర్పేట, రామ్నాస్పుర, న్యూబోయిగూడ, జియాగూడ, చెంగిచర్ల స్లాటర్హౌజ్ల నుంచి తీసుకొచ్చిన మాంసాన్నే వ్యాపారులు అమ్మాలి.
ముందుగా ఈ స్లాటర్హౌజ్లో గొర్రె, మేక కానీ ఆరోగ్య స్థితిని డాక్టర్ పరీక్షిస్తారు. యాంటీమార్టం, పోస్టుమార్టం చేసిన తర్వాతనే ఆయా మాంసం తినొచ్చని నిర్ధారిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు స్టాంప్ వేసి వ్యాపారులు ఇస్తారు.
కట్ చేసిన గొర్రె, మేక తొంటిభాగంలో స్లాటర్హౌజ్, తేదీ, రిసిఫ్ట్లో సమగ్ర వివరాలతో వ్యాపారికి అందిస్తారు. సదరు వ్యాపారి ఆయా షాపు ద్వారా అమ్మకాలు జరుపుతారు.
కానీ చాలా చోట్ల కల్తీ మాంసం కొనుగోలు చేస్తున్నారు. ఒక పక్క జీహెచ్ఎంసీ విస్తృత అవగాహన కల్పిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. దీనినే అదునుగా భావిస్తూ కల్తీ వ్యాపారాన్ని కొందరు ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
చనిపోయిన, రోగాల బారిన పడిన గొర్రె, మేకలు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్న చోటనే మాంసాన్ని కొనుగోలు చేసి ఆరోగ్యంగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా స్టాంపింగ్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్లో అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- చరిత్ర: హానీమూన్ ఎప్పుడు, ఎందుకు మొదలైంది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?
- ఉత్తర కొరియాలో రహస్య ప్రాంతానికి వెళ్లిన అమెరికా యువకుడు.. ఆ తర్వాత ఏమైంది..
- ఏటా వెయ్యి కోట్ల వెట్వైప్స్ వాడి పారేస్తున్నారు.. అవి ఏమవుతున్నాయి?
- భూమిపైనే నరకాన్ని చూస్తున్న అఫ్గాన్లు.. ‘గుప్పెడు రొట్టెల పిండి కూడా దొరకట్లేదు’
- ప్రజలంతా ఆయుధాలు పట్టాలని కోరుతున్న దేశం, కారణమేంటి
- సూయజ్ కాలువను బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోకుండా అమెరికా ఎలా అడ్డుకుంది?
- ‘నా వయసువారు చూడకూడని వీడియోలు ఉంటాయి అక్కడ’
- సూర్య 'జై భీమ్' తెర వెనుక అసలు కథ ఏంటి? రియల్ హీరో ఎవరు?
- ఉత్తర్ ప్రదేశ్: మూక దాడులు, హత్యలపై విచారణల్లో న్యాయం జరుగుతోందా? బాధితులు ఏమంటున్నారు?
- ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో యుద్ధ విమానం నుంచి భారత పైలట్ పడినప్పుడు ఏమైందంటే...
- హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై కేసీఆర్ రియాక్షన్ ఇదీ..
- పసిఫిక్ మహా సముద్రంలో 'బ్లాక్ హోల్'.. దీని రహస్యం ఏంటి?
- విశాఖపట్నం లైన్మన్ హత్య కేసు: మంత్రి మేనల్లుడిపై ఆరోపణలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








