విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలు, ప్రతి ప్రాంతం పేరు వెనుక ఎన్నో కథలు

- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ ప్రతినిధి
పేరులో ఏముందని కొందరు, పేరులోనే అంతా ఉంటుందని మరి కొందరు... ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి.
పేరు అనేది ఒక గుర్తింపు, ఆ గుర్తింపే ఆ ప్రాంత ఉనికి. అసలు పేరు లేని ప్రాంతాల్ని గుర్తించగలమా? ఉన్న పేరు కాకుండా మరో పేరు ఊహించగలమా?
విశాఖపట్నాన్ని అలా ఎందుకు పిలుస్తారు? బెల్లానికి ఎంతో ఫేమస్ అయిన అనకాపల్లిని బెల్లంపల్లి అనవచ్చు కదా? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తుంటాయి.
పేర్లు మారవని గ్యారంటీ లేదు
ఒక్క విశాఖనే కాదు, ఏ ప్రాంతాన్నైనా ఆ పేరుతో ఎందుకు పిలుస్తారో చరిత్రలో కాస్త వెనక్కివెళ్లి తెలుసుకుంటే అర్థం అవుతుంది.
ఒక ప్రాంతానికి ఉన్న పేరు, దాని వెనుక ఉన్న చరిత్రను గమనిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.
ప్రాంతాల పేర్లు దానిని పిలవడానికి మాత్రమే కాదని, అవి ఆయా ప్రాంతాల గతం గురించి చెబుతాయని ఆ గతం ఆయా ప్రాంత ప్రజల వర్తమానం, భవిష్యత్తుకు ఆధారంగా ఉంటుందని ఆయన తెలిపారు.
"ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్రాంతాల పేర్లు, గతంలో అలా ఉండేవి కాదు. కాలక్రమంలో అవి రకరకాలుగా మారి ప్రస్తుతం ఉన్న పేర్లతో స్థిరపడ్డాయి. భవిష్యత్తులో వాటి పేర్లు మారవని కూడా గ్యారంటీ లేదు. అయితే, పేరు మారినా వాటి అసలు పేరులోని శబ్దం, చరిత్ర మాత్రం కొత్త పేరుతో కూడా అంటిపెట్టుకునే ఉంటాయి" అని సూర్యనారాయణ వివరించారు.
విశాఖ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పేర్లకు సంబంధించిన చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఆయన చెప్పారు.
"ఇప్పుడున్న పేర్ల వెనక ఎన్నో కథలు, స్థానికుల అనుభవాలు, రచనలు, ప్రాంత విశిష్టత, అక్కడి కార్యకలాపాలు ఇలా చాలా అంశాలు ఉంటాయి. వీటన్నింటిని క్రోడికరించి...వాటికి కనీస ఆధారాలు ఉండి, వాటిలో ఎక్కువ మంది అంగీకరించినవే ప్రస్తుతం ఆయా ప్రాంతాల పేర్లుగా వాడుకలో ఉన్నాయి" అని ఆయన తెలిపారు.

తూర్పుగోదావరిలో విశాఖ పేరు
విశాఖ నగరానికి ఆ పేరు ఎలా వచ్చిందో సూర్యనారాయణ వివరించారు.
"ఒకప్పుడు బెస్తపల్లెగా ఉన్న విశాఖ ఇప్పుడు మెట్రో నగర హంగులు అద్దుకుంది. విశాఖపట్నానికి మొదట వైశాఖి అని పేరు ఉండేదని కొందరు చెబుతారు. 11వ శతాబ్ధంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కుళుత్తుంగచోళుడుకి కూమార స్వామి కులదైవం. కూమారస్వామికి వైశాఖేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. వైశాఖేశ్వర పేరుతో కూమారస్వామికి సాగరం సమీపంలో గుడి కట్టించారు. కాల క్రమంలో ఆ ఆలయం సముద్ర గర్భంలో కలిసి పోయింది. ఆయన పేరు మీదుగా వైశాఖి...కాలక్రమంలో విశాఖపట్నం అయిందని చాలా మంది చెబుతారు. అయితే వీటికి ఆధారాల్లేవ్" అన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో విశాఖ పేరు మొదటిసారి ఆధారాలతో కనిపించిందని సూర్యనారాయణ చెప్పారు.
"ఇక్కడ దాక్షారామంలోని భీమేశ్వరస్వామి గుడిలోని 11వ శతాబ్దం నాటి శిలాశాసనంలో విశాఖ ప్రస్తావన ఉంది. విశాఖ నుంచి వచ్చిన ఒకాయన ఆలయంలో నిత్య దీపారాధన కోసం దానం ఇచ్చారు. దాని గురించి చెక్కిన శిలాశాసనంలో విశాఖపట్నం పేరు ఉంది. విశాఖ అనే పదం కనిపించిన తొలి శాసనం అదే. అలాగే బ్రిటిషర్లు విశాఖపట్నం అనేది సరిగా పలకలేక వైజాగపటం అనేవారు. అదే ప్రస్తుతం వైజాగ్ అయ్యింది" అని తెలిపారు.

ఫొటో సోర్స్, FB/gajuwaka
నగరంలో 4, మైదానాల్లో 9, మన్యంలో 2
ఇక విశాఖను 15 నియోజక వర్గాలుగా విభజించారు. వాటిలో నగర పరిధిలోని నాలుగు ప్రాంతాలు విశాఖ తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం పేరుతో ఉన్నాయి. మైదాన ప్రాంత నియోజకవర్గాల్లో భీమిలి, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, చోడవరం, మాడుగుల, పాయకరావు పేట, నర్సీపట్నం.. ఏజెన్సీలో అరకు, పాడేరు ఉన్నాయి.

మొదట గాజువాక విషయానికి వస్తే, ఇక్కడ స్టీల్ ప్లాంట్, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్తో పాటు ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన భారీ పరిశ్రమలు ఉన్నాయి.
కానీ, కొంతమంది చెబుతున్నట్లు గాజువాక నియోజకవర్గం పేరుకూ గాజులు అమ్మకాలకు ఎలాంటి సంబంధం లేదని చరిత్రకారులు ఎడ్వర్డ్ పాల్ చెప్పారు. ఆ పేరు వెనుకున్న మరో విషయం చెప్పారు.

"అది తప్పు. గాజువాకలో ఎన్నడూ గాజులు అమ్మే వ్యాపారులు ఉన్నట్లు ఆధారాలు లేవు. అయితే, 150 ఏళ్ల క్రితం ఇక్కడ మావటీలు ఎక్కువగా ఉండేవారు. ఏనుగులకు స్నానం చేయించడానికి వాళ్లు ఇక్కడున్న వాగు దగ్గరికి వచ్చేవారు. వాటిని గజం అంటారు కాబట్టి ఈ వాగును గజాల వాగు అనేవారు. అది కాలక్రమంలో గాజువాకగా స్థిరపడింది" అన్నారు.

ఫొటో సోర్స్, VMRDA
పంటల పల్లి... అనకాపల్లి
ఇక భారత్లో మునిసిపాలిటీ వ్యవస్థ వచ్చిన తర్వాత దేశంలో రెండో మున్సిపాలిటీగా గుర్తింపు పొందిన భీమునిపట్నం విషయానికి వస్తే, బౌద్ధారామాలు, బౌద్ధుల మజిలీ ప్రాంతం కావడంతో ఇది భీమిలిగా మారిందనే వాదన ఉంది. దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉందని ఎడ్వర్డ్ పాల్ చెప్పారు.
"ఈ ప్రాంతంలో బకాసురుడు జనాల్ని చంపేసి తినేస్తుంటే, భీముడు ఆ రాక్షసుడిని చంపేశాడని, అలాగే ఇక్కడ ఉన్న భీమేశ్వరాలయాన్ని కూడా భీముడే నిర్మించాడని చెప్తుంటారు. అందుకే ఈ ప్రాంతానికి భీమిలి అనే పేరు వచ్చిందంటారు. అలాగే భీమిలికి ఏకచక్రపురం అనే పేరు కూడా ఉందని కథలున్నాయి" అని ఎడ్వార్డ్ పాల్ తెలిపారు.

ఫొటో సోర్స్, fb/anakapalli
ఇక దేశంలోనే రెండో అతి పెద్ద బెల్లం మార్కెట్ అయిన అనకాపల్లి పేరు చరిత్ర తెలుసుకోవాలంటే 12 వ శతాబ్ధంలోకి వెళ్లాలన్నారు అదే ప్రాంతానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామ్మోహననాయుడు.
"ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని అనైకభీముడు అనేరాజు పాలించేవాడు. ఆ సమయంలో దీనిని అనైకపల్లి అని పిలిచేవారు. అదే కాలక్రమేణా అనకాపల్లిగా మారింది. అలాగే ఈ ప్రాంతంలో 14వ శతాబ్దంలో చుట్టుపక్కల ప్రాంతాల కంటే ఎక్కువ పంటలు పండడంతో, దీనిని అనేక పంటల పల్లి అనేవారు. అదే నెమ్మదిగా అనకాపల్లిగా స్థిరపడిందనే కథ కూడా ప్రచారంలో ఉంది" అని చెప్పారు.
ఆంధ్రా, ఒడిశా వ్యాపారుల జంక్షన్...
ఇక ఏటికొప్పాక కొయ్య బొమ్మలకు ఫేమస్ అయిన ఎలమంచిలి నియోజకవర్గం విషయం తెలుసుకుందాం. విశాఖ జిల్లాలోని నగర, మైదాన, ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే నియోజకవర్గం ఇది.
"గతంలో ఈ ప్రాంతాన్ని యల్లమజిలి అనే వారు. వందేళ్ల క్రితం నుంచే ఎలమంచిలి పేరు బాగా ఫేమస్. అయితే అప్పట్లో దీన్ని యల్లమజిలీ అనేవారు. యల్ల అంటే ఎత్తైన ప్రాంతం అని అర్థం. ఆంధ్రా, ఒడిశాల మధ్య వ్యాపారం చేసేవారు, ఇక్కడ యల్ల (ఎత్తైన ప్రాంతం) దగ్గర ఆగి విశ్రాంతి తీసుకునేవారు. యల్లపై వ్యాపారులు మజిలీ చేసే ప్రాంతం కావడంతో దీనిని అప్పట్లో యల్లమజిలీ అని పిలిచే వారు. అదే ప్రస్తుతం ఎలమంచిలిగా మారింది" అని చరిత్రకారులు ఎడ్వర్డ్ పాల్ బీబీసీతో చెప్పారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో మాడుగుల హల్వాతో బాగా ఫేమస్ అయిన నియోజకవర్గం మాడుగుల. దానికా పేరు ఎలా వచ్చిందో కూడా ఎడ్వర్డ్ పాల్ చెప్పారు.
"ఒకప్పుడు ఈ ప్రాంతంలో చిన్న చిన్న మడుగులు ఉండడంతో ఈ ప్రాంతాన్ని మాడుగులూరు అనే వారట. ఆ తర్వాత అది మాడుగులగా స్థిరపడిందని కొందరు చెప్తున్నారు. అలాగే ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు మట్టితో కోటలు కట్టేవారు. మట్టితో కట్టిన ఆ కోటలను 'మాడుములు' అంటారు. ఆ మాటే మాడుగులగా మారిందని ఇంకొందరు చెప్తారు. ఈ రెండు వాదనలకు చరిత్రలో ఆధారాలు కూడా ఉన్నాయి".
"అలాగే, మాడుగులకి సమీపంలో ఉండే చోడవరం ప్రాంతాన్ని చోళ వంశస్థులు పరిపాలించడంతో ముందుగా చోళవరం అని, కాల క్రమంలో అది చోడవరంగా స్థిరపడిపోయింది" అని పాల్ వివరించారు.

"విశాఖలో మరో నియోజకవర్గం పెందుర్తి. ఇది నగర పరిధి దాటిన తరువాత వచ్చే ప్రాంతం. అరకు, అలాగే విజయనగరం వెళ్లేటప్పుడు పెందుర్తి ఒక ల్యాండ్ మార్క్ ఏరియా. ఒకప్పుడు విశాఖకి, పెందుర్తికి సంబంధాలుండేవి కావు. శివారు ప్రాంతంగా ఉండేది. ఆ సమయంలో ఇక్కడ ఎక్కువగా పందులను మేపేవారు. దీంతో ఈ ప్రాంతాన్ని పందులూరు అనేవారు. ప్రస్తుతం అదే పెందుర్తి అయ్యింది." అని ఆయన తెలిపారు.

ఆంగ్లేయులను ఎదిరించిన పాకేరాయుడు...
విశాఖ ఏజెన్సీకి ముఖ ద్వారం అయిన నర్సీపట్నం ఒక పూటకూళ్లమ్మ పేరు. ఆ కథ తెలుసుకోవాలంటే బ్రిటిష్ పాలనలోకి వెళ్లాలని నర్సీపట్నం అటవీశాఖ రిటైర్డ్ ఉద్యోగి కోటేశ్వరరావు చెప్పారు.
"బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతంలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు వద్ద నర్సమ్మ అనే మహిళ ఉండేది. ఈ చెరువు చుట్టూనే ఏజెన్సీ, మైదాన ప్రాంతాలకు సంబంధించిన వ్యాపార లావాదేవిలు జరిగేవి. అలాగే ఏజెన్సీ, మైదాన ప్రాంతాల రాకపోకలకు ఇదే సెంటర్ పాయింట్. దీంతో ఇక్కడ నర్సమ్మ అనే మహిళ పూటకూళ్ల ఇల్లు ప్రారంభించింది. దీంతో ఈప్రాంతానికి నర్సమ్మ పేటగా పేరొచ్చింది. ఇది పట్నం అయిన తర్వాత ఆ పేరు నర్సీపట్నంగా మారింది. ఈ విషయం వై. సత్యనారాయణ 'మన నర్సీపట్నం' పుస్తకంలో రాశారు" అని వివరించారు.

ఇక విశాఖ, తూర్పు గోదావరి జిల్లా మధ్య సరిహద్దు ప్రాంతమైన పాయకరావు పేటకు ఆంగ్లేయులతో పోరాడిన ఒక వీరుడి వల్ల ఆ పేరు వచ్చిందని ఏయూ రిటైర్డ్ చరిత్ర ప్రొఫెసర్ సూర్యనారాయణ చెప్పారు.
"బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతాన్ని సత్యవరం స్థావరంగా చేసుకుని పాకేరాయుడు అనే రాజు పాలించేవాడు. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసేందుకు విప్లవ సైన్యాన్నికూడా తయారు చేసాడు. ఆంగ్లేయులతో పలుమార్లు పోరాటం కూడా చేశాడు. తర్వాత ఆయన బ్రిటిషర్లకు చిక్కడంతో, తమపై ఎవరూ ఎదురు తిరగకుండా వారు దిబ్బపాలెం ప్రాంతంలో ప్రజల ముందే, పాకేరాయుడ్ని బహిరంగంగా ఉరి తీశారు. ఆ శవాన్ని నెలల తరబడి అలాగే ఉంచారు. ఆయన పేరున ఈ ప్రాంతం పాకేరాయుడు పేట అయింది. తదనంతర కాలంలో పాయకరావు పేటగా మారింది" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, fb/araku
పచ్చని ఏజెన్సీలో ఎర్రమట్టి భూములు...
ఇక ఏజెన్సీ నియోజకవర్గాలైన అరుకు, పాడేరు పేర్ల విషయానికి వద్దాం. ఆ ప్రాంతాల్లో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు, సారవంతమైన నేలలను బట్టి ఆ పేర్లు వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు.
"గతంలో అరకు ఎర్రమట్టి భూములకు ప్రతీతి. కొండకు దిగువగా ఇక్కడ ఎర్రటిమట్టి భూములు చాలా ఉన్నాయి. ఆ భూముల్లో పంటలు బాగా పండేవి. స్థానిక గిరిజన బాషలో అర్ర అంటే ఎరుపు రంగు అని అర్థం. దాంతో ఈ ప్రాంతాన్ని అర్రకు అనే వారు. ప్రస్తుతం అదే అరకుగా పిలుస్తున్నారు" అంటారు ప్రొఫెసర్ సూర్యనారాయణ.

ఫొటో సోర్స్, fb/nagaru paderu
ఇక పాడేరు ప్రాంతంలో సమాంతరంగా ప్రవహించే సెలయేళ్ళ వల్లే దానికి ఆపేరు వచ్చిందని రిటైర్డ్ టీచర్ సుందరం చెప్పారు.
"ఈ ప్రాంతంలో చిలకలగడ్డ, మత్స్యగడ్డ అనే రెండు ఏర్లు ఎప్పటి నుంచో ప్రవహిస్తున్నాయి. అప్పట్లో ఈ రెండు ఏర్ల మధ్య సారవంతమైన నేల ఉండేది. ఇక్కడే గిరిజనులు వ్యవసాయం చేసే వారు. రెండు ఏర్లు మధ్య ఉన్న ప్రాంతాన్ని 'పాడియేరు' అనేవారు. పాడి అంటే సమానం అనే అర్థం. ఆ తర్వాత అదే క్రమంగా పాడేరుగా మారింది" అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీలో 'దిశ చట్టం' అమలులో ఉందా? మహిళలకు దీనితో మేలు జరిగిందా?
- కృష్ణా జల వివాదం: నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ వివాదం, దీనికి మూలం ఎక్కడ?
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్లో రోడ్ల మీదే చేపల వేట
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- అమర రాజా: ఈ సంస్థను తరలించాలని ఏపీ ప్రభుత్వం అంత కఠినంగా ఎందుకుంది?
- చుండూరు మారణకాండ: 30 ఏళ్ల కింద దళితులను చంపి, గోనె సంచుల్లో కుక్కి తుంగభద్రలో విసిరేసిన కేసు ఏమైంది?
- ఆంధ్రప్రదేశ్: రోడ్లు అధ్వానం... ప్రయాణం భయానకం
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)












