ఇండోనేషియా: రెండు సుమత్రా జాతి ఆడ పులులు జూలో గార్డును చంపి పారిపోయాయి...

అంతరించిపోతున్న పులుల జాబితాలో సుమత్రా జాతి కూడా ఉంది (ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతరించిపోతున్న పులుల జాబితాలో సుమత్రా జాతి కూడా ఉంది (ఫైల్ ఫొటో)
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఇండోనేషియాలోని సింకా జూ పక్కనే ఉన్న కొండ చరియలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విరిగి పడ్డాయి. అవి పులులు ఉండే ఎన్‌క్లోజర్ మీద పడ్డాయి. ఎన్‌క్లోజర్ దెబ్బ తినడంతో 18 నెలల వయసున్న రెండు ఆడ పులులు కాపలాగా ఉన్న జూ-కీపర్ మీద దాడి చేసి, అక్కడి నుంచి తప్పించుకున్నాయి.

పులుల దాడిలో జూ-కీపర్ తీవ్రమైన గాయాలతో చనిపోయారు.

ఎన్‌క్లోజ‌ర్‌పై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన‌ట్లు తెలుసుకున్న అధికారులు వెంటనే ప్రమాద ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే అక్క‌డ తీవ్ర‌గాయాల‌తో చ‌నిపోయిప‌డి ఉన్న గార్డును అధికారులు గుర్తించిన‌ట్లు ఏఎఫ్‌పి వార్తాసంస్థ తెలిపింది.

సుమత్రా జాతికి చెందిన ఆ పులులు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి. ఇండోనేషియాలోని బోర్నియో ద్వీపంలో ఉన్న సింకా జూలో సుమ‌త్రా జాతి పులులు నివసిస్తున్నాయి.

అదే ఎన్‌క్లోజ‌ర్ ద‌గ్గ‌ర‌ చచ్చిపడి ఉన్న ఒక‌ కోతిని, ఉష్ట్రపక్షిని కూడా అధికారులు గుర్తించారు. రెండు పులులు తప్పించుకున్న వార్త బయటకు రాగానే సింగ్‌క‌వాంగ్ పట్టణం, వెస్ట్ కాలిమంతన్‌ ప్రాంతాలలో భారీ సెర్చ్ ఆపరేషన్ మొద‌లుపెట్టారు అధికారులు.హై అలర్ట్ ప్రకటించారు.

సమీపంలో ఉన్న అన్ని టూరిస్ట్ సెంటర్లను ముందు జాగ్రత్తగా మూసేశారు. ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ ప్రజలను పోలీసులు హెచ్చరించారు.

పులి

ఫొటో సోర్స్, Getty Images

ఎలా పట్టుకున్నారు?

త‌ప్పించుకున్న పులుల‌ను వెత‌క‌డానికి డ్రోన్‌ల‌ను కూడా ఉప‌యోగించారు పోలీసులు. ‘‘వాటి జాడ తెలుసుకోవడానికి మేం చాలా కష్టపడాల్సి వచ్చింది’’ అని స్థానిక పోలీసులు సీఎన్ఎన్ ఇండోనేషియాకు చెప్పారు.

రోజూ ఆహారం తీసుకునే సమయానికి పులులు మళ్లీ జూ వైపు వస్తాయని, అప్పుడు పట్టుకోవచ్చని వాటి బోను దగ్గర పెద్ద ఎత్తున మాంసాన్ని ఏర్పాటు చేశారు. కానీ, పులులు అటువైపు రాలేదు.

చివ‌ర‌కు ఓ ప్రాంతంలో ఈ రెండు దాక్కున్నట్లు గుర్తించిన అధికారులు వాటికి మత్తు మందు ఇచ్చి ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించారు.

మ‌త్తు ఇవ్వబోతున్న స‌మ‌యంలో ఒక పులి దాడి చేయ‌డంతో పోలీసులు దానిని కాల్చి చంపారు. ‘‘రెండింటికి మత్తు మందు ఇవ్వాలనుకున్నాం. కానీ కుదరలేదు. ఆ పులి తీవ్ర ఆగ్రహంతో దాడికి దిగడంతో కాల్చేయక తప్పలేదు’’ అని స్థానిక కన్జర్వేషన్ ఏజెన్సీ అధికారి సాద్‌టాటా నూర్ అదిరామంత‌ తెలిపారు.

‘‘దాన్నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాం. ఎలాగైనా ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నా కుదరలేదు. మనిషి ప్రాణానికే ప్రాధాన్యమివ్వాల్సి వచ్చింది’’ అని ఆయన అన్నారు.

సిబ్బంది చేతికి చిక్కిన పులికి ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సుమత్రా జాతికి చెందిన పులులు కేవలం 400లోపే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్ ‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)