బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు: ‘‘బలమైన ఆధారాలు లేవు.. నిందితుల్లో ఎవరి ప్రమేయం లేదు.. క్షణికావేశంలో జరిగింది’’

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశాన్ని అట్టుడికించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో.. బలమైన ఆధారాలు ఏవీ లేవని.. ఈ విధ్వంసం ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ కేసులో లఖ్నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ బుధవారం మధ్యాహ్నం తీర్పు వెల్లడించారు.
‘‘కూల్చివేతకు ముందస్తు ప్రణాళికలు వేయలేదు.. ఇది నిందితుల్లో ఎవరి ప్రమేయం లేకుండానే క్షణికావేశంలో జరిగింది’’ అని ఆయన పేర్కొన్నారు.
దర్యాప్తు అధికారులు ఫొటోల నెగటివ్లు ప్రవేశపెట్టలేదు. వీడియో క్యాసెట్లను టాంపరింగ్ చేశారు అని కోర్టులో లాయర్లు వాదించారు.
మసీదును ధ్వంసం చేయడానికి ముందుకొచ్చినవారికి ఆర్ఎస్ఎస్, వీహెచ్పీతో ఎలాంటి సంబంధాలు లేవని కోర్టు చెప్పిందని లఖ్నవూలో మీడియాతో మాట్లాడిన లాయర్లు చెప్పారు.
ఈ కేసులో బీజేపీ మార్గదర్శక మండలి చీఫ్ నేత లాల్కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి సహా మొత్తం 32 మంది నిందితులుగా ఉన్నారు.
అయితే.. అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, మహంత్ నృత్య గోపాల్ దాస్ సహా ఆరుగురు నిందితులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టకు హాజరయ్యారు.
16వ శతాబ్దం మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో కట్టినట్లుగా కొందరు భావిస్తున్న ఈ మసీదును 1992 డిసెంబర్ 6న ఒక కరసేవకుల గుంపు కూల్చివేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మతఘర్షణలు చెలరేగాయి. హింసాత్మక ఘటనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇది చరిత్రాత్మక తీర్పు: అడ్వాణీ హర్షం
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో "చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఇది చాలా సంతోషకరమైన రోజు’’ అంటూ ఎల్.కె.అడ్వాణీ స్పందించారు. ‘‘అయోధ్యలో డిసెంబర్ 6న అదంతా హఠాత్తుగా జరిగిందని, అందులో ఏ కుట్రా లేదని ఈ తీర్పు నిరూపిస్తోంది’’ అని తన వీడియో ప్రకటనలో పేర్కొన్నారు.
సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. తీర్పు రావడం ఆలస్యం అయినప్పటికీ న్యాయమే గెలుస్తుందని ఇది నిరూపించిందని అన్నారు.
తీర్పుపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ "సత్యమేవ జయతే, సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతానికి బాధితులైన పూజ్య సాధువులు, నేతలు, వీహెచ్పీ పదాధికారులు, సామాజిక కార్యకర్తలు అబద్ధపు కేసుల్లో చిక్కుకుని అపఖ్యాతి పాలయ్యారు. ఈ కుట్రకు వారు ప్రజలను క్షమాపణలు కోరాలి" అని ట్వీట్ చేశారు.
‘‘ఇక రామమందిరం కోసం ఎదురు చూద్దాం’’ జోషి
"బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 1992 డిసెంబర్ 6 జరిగిన సంఘటన ఒక కుట్ర ప్రకారం జరిగినది కాదని నిరూపణ అయ్యింది. ఆ రోజు మేము నిర్వహించిన కార్యక్రమాలు, ర్యాలీల వెనుక ఎలాంటి కుట్రాలు లేవు. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడింక అందరం రామ మందిర నిర్మాణం కోసం ఉత్సాహంగా ఎదురుచూడాలి" అని మురళీ మనోహర్ జోషి స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
హైకోర్టుకు వెళ్తాం: ముస్లిం పర్సనల్ లా బోర్డ్
ఈ కేసులో అన్ని ఆధారాలను కోర్టు విస్మరించిందని, నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ లాయర్ జఫర్యబ్ జిలానీ తీర్పు తర్వాత చెప్పారు. ‘‘ఇప్పుడు మేం దీనిపై హైకోర్టుకు వెళ్తాం’’ అని ఆయన తెలిపారు.
సీబీఐ కోర్టు ఇచ్చిన ‘‘ఈ తీర్పుతో న్యాయవ్యవస్థ ద్వారా న్యాయం జరగదని, న్యాయం జరుగుతుందనే ఒక భ్రమ మాత్రమే ఉంటుందని భావిస్తారు’’ అని సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ బీబీసీతో పేర్కొన్నారు.
‘‘ఇది ఇలాగే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విధ్వంసం కేసులో తీర్పు రావడానికి ముందే భూమి యాజమాన్య హక్కులపై తీర్పు వెలువరించారు. అది కూడా మసీదును కూల్చినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న పక్షానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు’’ అన్నారాయన.
‘‘ఇది ముస్లిం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది. ఏ తీర్పూ తమకు అనుకూలంగా వస్తున్నట్లు వారికి అనిపించదు. ముస్లిం సమాజాన్ని రెండో తరగతి పౌరులుగా మార్చేస్తున్నారు. వారి ముందు ప్రస్తుతం చాలా పెద్ద సవాళ్లున్నాయి. మెల్లమెల్లగా హిందూ దేశం నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ప్రశాంత్ భూషణ్ బీబీసీ ప్రతినిధి దివ్యా ఆర్యతో వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ తీర్పు సిగ్గుచేటు: సీతారాం ఏచూరి
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో తీర్పు హాస్యాస్పదంగా వర్ణించారు. ఆయన తన ట్వీట్లో "ఇది న్యాయాన్ని అవహేళన చేయడమే, బాబ్రీ మసీదు విధ్వంసం నేరారోపణలు ఎదుర్కున్న వారందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. ఒక మసీదు తనంతట అదే కూలిపోయిందా? అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం దీనిని 'భయంకరమైన చట్ట ఉల్లంఘన'గా చెప్పింది. ఇప్పుడు ఈ తీర్పు 'సిగ్గుచేటు' అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
తీర్పుపై స్పందించిన ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ "అదే హంతకుడు, అదే కోర్టు, చాలా తీర్పులు ఇచ్చిన షాహిద్, ఇప్పుడు కూడా అనుకూలంగానే ఇచ్చాడు" అనే అర్థం వచ్చేలా ఒక కవితను ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇదీ కేసు.. నిందితులు వీరు...
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఒకటి దీనిని పడగొట్టిన కరసేవకుల పైన, రెండోది బీజేపీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన 8 మందికి వ్యతిరేకంగా నమోదైంది. రామ్కథా పార్కు వేదిక పైనుంచి వీరంతా రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆరోపించారు.
రెండో ఎఫ్ఐఆర్లో బీజేపీ నేత లాల్కృష్ణ అడ్వాణీ, వీహెచ్పీ అప్పటి ప్రధాన కార్యదర్శి అశోక్ సింఘల్, బజరంగ్ దళ్ నేత వినయ్ కటియార్, ఉమాభారతి, సాధ్వీ రితంభరా, మురళీ మనోహర్ జోషి, గిరిరాజ్ కిశోర్, విష్ణు హరి దాల్మియా పేర్లు ఉన్నాయి.
మొదటి కేసును సీబీఐకి, రెండో కేసును సీబీసీఐడీకి అప్పగించారు. ఆ తర్వాత రెండు కేసులకు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నాయని, వీటిని ఒకటిగా కలిపేస్తూ సీబీఐ ఒక అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది.
దీనితోపాటూ చార్జిషీటులో బాలా సాహెబ్ ఠాక్రే, కల్యాణ్ సింగ్, చంపత్ రాయ్, ధరమ్ దాస్, మహంత్ నృత్య గోపాల్ దాస్, మరికొంత మంది పేర్లను చేర్చారు.
32 మంది నిందితులు
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో మొత్తం 49 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో ఇప్పుడు 32 మంది మాత్రమే సజీవంగా ఉన్నారు.
వీరిలో లాల్ కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్, ఉమా భారతి, వినయ్ కటియార్, సాధ్వీ రితంభర, మహంత్ నృత్య గోపాల్ దాస్, క్టర్ రామ్ విలాస్ వేదాంతి, చంపత్ రాయ్, మహంత్ ధరమ్ దాస్, సతీష్ ప్రధాన్, పవన్ కుమార్ పాండేయ్, లల్లూ సింగ్, ప్రకాశ్ శర్మ, విజయ్ బహదూర్ సింగ్, సంతోష్ దుబే, గాంధీ యాదవ్, రాంజీ గుప్తా, బ్రజ్ భూషణ్ శరణ్ సింగ్, కమలేష్ త్రిపాఠీ, రామచంద్ర ఖత్రీ, జయ్ భగవాన్ గోయల్, ప్రకాశ్ పాండేయ్, అమర్ నాథ్ గోయల్, జయభాన్ సింగ్ పవైయా, మహారాజ్ స్వామీ సాక్షీ, వినయ్ కుమార్ రాయ్, నవీన్ భాయీ శుక్లా, ధర్మేంద్ర సింగ్ గుర్జర్, ఆచార్య ధర్మేంద్ర దేవ్, సుధీర్ కుమార్, కక్కడ్, అర్ఎన్ శ్రీవాస్తవ్ ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మరణించిన నిందితులు
మరణించిన 17 మంది నిందితుల్లో అశోక్ సింఘల్, బాలా సాహెబ్ ఠాక్రే, విజయ్ రాజె సింధియా, గిరిరాజ్ కిశోర్, విష్ణుహరి దాల్మియా, మహంత్ అవైద్యనాథ్, పరమహంస్ దాస్ చంద్రదాస్, మోరేశ్వర్ సావే, లక్ష్మీనారాయణ్ దాస్, వినోద్ కుమార్ వత్స్, రామ నారాయణ్ దాస్, డీబీ దాస్, రమేశ్ ప్రతాప్ సింగ్, హరగోవింద్ సింగ్, బైకుంఠ్ లాల్ శర్మ, మహామండలేశ్వర్ జగదీశ్ ముని మహరాజ్, డాక్టర్ సతీష్ నాగర్ ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అడ్వాణీ, జోషి, ఉమాభారతి
తీర్పు వినిపించడానికి సాధారణంగా నిందితులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కానీ బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో కోర్టు లాల్కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, మహంత్ నృత్య గోపాల్ దాస్ సహా ఆరుగురు నిందితులకు కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
వీరంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరువుతున్నారు. మిగాత 26 మంది నిందితులు కోర్టుకు స్వయంగా హాజరవుతారు. కేసులో నిందితులుగా ఉన్న వినయ్ కతియార్, సాధ్వి రితంభర, చంపత్ రాయ్, పవన్ పాండే కోర్టుకు హాజరయ్యారు.
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో తీర్పు వెలువడనుండడంతో పాత హైకోర్టు భవనం సమీపంలో బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు భవనం సమీపంలో చాలా ప్రాంతాల్లో కొయ్యలతో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
కైసర్ బాఘ్ బస్టాండుకు వెళ్లే బస్సులను దారి మళ్లించారు. కోర్టు భవనం మీదుగా వెళ్లే వాహనాల రాకపోకలను తగ్గించారు. నిందితులు కోర్టుకు హాజరవడం మొదలైంది. వివరాలు పరిశీలించిన తర్వాత మాత్రమే వారిని కోర్టులోకి అనుమతిస్తున్నారు.
మద్దతుదారులను, మీడియాప్రతినిధులను కోర్టు భవనంలోకి అనుమతించలేదు. కోర్టు సమీపంలోని చాలా దుకాణాలను మూసివేశారు. లఖ్నవూ పోలీస్ కమిషనర్ సుజీత్ పాండే అవసరమైన భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామమందిరం ఉద్యమంతో ఆర్ఎస్ఎస్ ఏం సాధించింది
- అయోధ్య రామమందిరం: మోదీ ముఖ్య అతిథిగా శంకుస్థాపన...ఇది భారత్ స్వరూపాన్నే మార్చేస్తుందా?
- అయోధ్య రామ మందిరం: స్థలం చదును చేస్తున్నప్పుడు దొరికిన అవశేషాలతో కొత్త వివాదం
- అయోధ్య: బాబ్రీ మసీదు తాళాలను రాజీవ్గాంధీ తెరిపించారా? ఏం జరిగింది?
- రంజన్ గొగోయ్: భారత రాజకీయాల్లో అయోధ్యకాండకు 'ముగింపు' పలికిన చీఫ్ జస్టిస్
- కరసేవకుడి నుంచి ప్రధాని వరకు... మోదీకి అయోధ్య ఉద్యమం ఎలా ఉపయోగపడింది?
- అయోధ్య తీర్పు: పురాతత్వశాఖ సర్వేలో రామ మందిర అవశేషాలు లభించాయా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








