కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి చేస్తున్న కృషి ఏమిటి?: నరేంద్రమోదీ ప్రశ్న

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

"ప్రపంచం మొత్తం గత 8-9 నెలలుగా కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతోంది. అయితే ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి ఐరాస చేస్తున్న ప్రయత్నాలేమిటి?" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి ప్రశ్నించారు.

ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశాల్లో శనివారం సాయంత్రం మోదీ ప్రసంగిస్తూ ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు.

కోవిడ్ 19 కారణంగా టెలీకార్ఫరెన్స్ పద్ధతిలో జరుగుతున్న ఈ సమావేశాల్లో మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు.

ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

"ప్రపంచంలోనే అతి పెద్ద టీకా ఉత్పాదక దేశంగా ఈ రోజు విశ్వ మానవాళికి మరొక భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. భారత ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యం ప్రపంచంలోని మానవులందరినీ కరోనావైరస్ సంక్షోభం నుంచి బయట పడేయడంలో సహాయపడుతుంది.

కోవిడ్-19 అంటువ్యాధి విజృంభిస్తున్న సమయంలో కూడా భారత ఔషధ పరిశ్రమ, 150కు పైగా దేశాలకు అవసరమైన మందులను సరఫరా చేసింది.

భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంగా గుర్తింపు పొందింది. ప్రపంచ జనాభాలో 18 శాతం ఉన్న దేశం, విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న ఆలోచనలతో తులతూగుతోంది.’’

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

భారత్‌ను ఇంకెన్నాళ్లు దూరం పెడతారు?

‘‘భారతదేశ ప్రజలు ఐరాస సంస్కరణల ప్రక్రియ పూర్తి కావడంకోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికైనా ముగుస్తుందా అని భారత ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఇంకా ఎన్నాళ్లు భారత్‌ను ఐరాస నిర్ణయాధికార వ్యవస్థ నుంచి దూరంగా ఉంచుతారు?

శాంతిస్థాపనలో భాగంగా భారతదేశం అధిక సంఖ్యలో తన సైనికులను కోల్పోయింది. ఐరాసలో భారత సహకారం చూసినవాళ్లందరూ, భారతదేశం పోషిస్తున్న పాత్ర విస్తరణను కూడా పరిశీలిస్తారు.

ఎన్నో సంవత్సరాల బానిసత్వాన్ని, ఆర్థిక వెనుకబాటుతనాన్ని జయించిన దేశం మాది. దేశంలో జరిగే ఎలాంటి మార్పులైనా ప్రపంచ స్థాయి ప్రభావాన్ని చూపగలిగేలా ఎదిగిన భారతదేశం ఇంకా ఎన్నాళ్లు ఐరాస నిర్ణయాధికార వ్యవస్థలో సభ్యత్వం పొందేందుకు ఎదురుచూడాలి?

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మా అనుభవాలను, ఖ్యాతిని ప్రపంచ ప్రయోజనాల కోసం వినియోగిస్తాం. జగత్కల్యాణమే మా లక్ష్యం. శాంతిభద్రతలు కాపాడడంలో భారతదేశం ఎల్లప్పుడూ ముందుంటుంది" అని చెప్పారు మోదీ.

నాలుగైదేళ్లలో ‘సాధించిన విజయాల’ను వివరించిన మోదీ...

భారత ప్రధాని మోదీ.. గత 4-5 ఏళ్లల్లో భారతదేశం సాధించిన విజయాలను ఐరాస ప్రపంచ వేదికపై ప్రస్తావించారు. .

"40 కోట్ల మంది ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం చేయగలిగాం. 60 కోట్ల మంది ప్రజలను బహిరంగ మలమూత్ర విసర్జన వ్యవస్థ నుంచి విముక్తులను చేయగలిగాం. కేవలం 4-5 సంవత్సరాలలోనే ఇవన్నీ సాధించడం అంత సులభం కాదు.

ఇవాళ భారతదేశంలో 150 కోట్ల ఇళ్లకు పంపుల ద్వారా తాగునీరు సరఫరా చేసే కార్యక్రమం జరుగుతోంది. కొద్ది రోజుల కిందటే 6 లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటనెట్ అందిందడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి అనేక విధానాలను రూపొందిస్తున్నాం. భారతదేశం మహిళలకు 26 వారాల మెటర్నిటీ లీవ్ ఇచ్చే దేశాల్లో ఒకటిగా ఎదిగింది" అని ప్రధాని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)