కరోనావైరస్ - కర్ణాటక: లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి సిద్ధలింగేశ్వర రథోత్సవం నిర్వహించిన కల్బుర్గి గ్రామస్థులు

కర్ణాటక రథోత్సవం

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. తొలి కోవిడ్-19 మరణం ఈ రాష్ట్రం నుంచే నమోదైంది.

ఈ కార్యక్రమాన్ని అడ్డుకోనందుకు చిత్తాపూర్ తాలూకా మెజిస్ట్రేట్‌, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. రేవూర్ గ్రామాన్ని జిల్లా యంత్రాంగం సీల్ చేసింది. సామాజిక దూరం పాటించాలనే నిబంధనని ఈ రథోత్సవంలో పూర్తిగా ఉల్లంఘించారు.

రెండేళ్ల చిన్నారికి కోవిడ్-19 సోకడంతో కంటైన్మెంట్ ఏరియాగా గుర్తించిన వాడి గ్రామానికి రథోత్సవం జరిగిన ప్రాంతం కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

కొంత మంది పురోహితులు, ఆలయ అధికారుల సమక్షంలో బుధవారం సాయంత్రం ఆలయంలో కొన్ని నిత్య పూజలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు బీబీసీకి చెప్పారు.

కానీ ఆ మరుసటి రోజు ఉదయమే ఆలయం బయటకి రథాన్ని తీసుకొచ్చి ఊరేగింపు నిర్వహించారు. ఇందులో సుమారు వెయ్యి మంది భక్తులు పాల్గొన్నారని ఒక అధికారి చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ ఉత్సవాన్ని నిర్వహించడంలేదని అంతకు ముందే ఆలయ అధికారులు పత్రికా సమావేశం ద్వారా ప్రభుత్వానికి తెలియచేశారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ ఉత్సవం నిర్వహించవద్దని ఆలయ ట్రస్ట్ సభ్యులకి సమావేశాలు పెట్టి విజ్ఞప్తి చేశారని, చిత్తాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే చెప్పారు.

కంటైన్మెంట్ ప్రాంతంగా గుర్తించిన ప్రాంతాల్లో కల్బుర్గి మొదటిది. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలని కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతాల్లో ప్రజల కదలికల్ని పూర్తిగా నిర్బంధించి నిత్యావసరాలని పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా నేరుగా ఇళ్లకే సరఫరా చేస్తారు.

ఈ రథోత్సవం ఘటనతో ఉక్కిరిబిక్కిరైన జిల్లా యంత్రాంగం రేవూర్ గ్రామంలో హడావుడిగా ఫీవర్ క్లినిక్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మేము బృందాలని పంపిస్తున్నామని, గ్రామాన్ని ఇప్పటికే సీల్ చేశామని కల్బుర్గి జిల్లా డిప్యూటీ కమిషనర్ బీబీసీకి చెప్పారు. వాడి గ్రామంలో కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలైనట్లు ఆయన తెలిపారు.

కర్ణాటక రథోత్సవం

ఫొటో సోర్స్, ANI

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించినందుకు టెంపుల్ ట్రస్ట్ సభ్యులతోపాటు మరో 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

ఇప్పటికే ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మార్టిన్ మార్బానియాంగ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)