మాంసాహారం తింటే కరోనావైరస్ సోకుతుందంటూ వదంతులు.. పడిపోయిన చికెన్, మటన్ అమ్మకాలు, ధరలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
మాంసాహారం తీసుకుంటే కరోనావైరస్ సోకుతుందంటూ సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారం కారణంగా కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా మాంసం ఉత్పత్తుల వినియోగం గణనీయంగా తగ్గింది.
ఈ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్రంగా పడింది. ఎగుమతులతో పాటు అమ్మకాలపైనా తీవ్ర ప్రభావం పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మాంసం అమ్మకాలపై అధికారులే ఆంక్షలు విధిస్తుండటం విశేషం.


ప్రస్తుతం అమ్మకాల పరిస్థితి ఏంటి ?
నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎగ్ & పౌల్ట్రీ-2022 పేరిట కేంద్ర పశుసంవర్థశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2015-16 నాటికి దేశ పౌల్ట్రీ మార్కెట్ విలువ సుమారు రూ.80 వేల కోట్లు. ఇందులో సుమారు 20 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ అసిస్టెంట్ డైరక్టర్ ఎం.సాయి బుచ్చారావు బీబీసీతో చెప్పారు. కరోనావైరస్ పేరిట కొనసాగుతున్న ప్రచారం కారణంగా ప్రస్తుత ఆదాయంలో సుమారు 60 శాతం వరకు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.
కరోనావైరస్ ప్రచారానికి తోడు ఏపీలో కొద్ది రోజులుగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఫలితంగా గడిచిన కొద్ది రోజుల్లో ఎగుమతులతో పాటు ప్రజల వినియోగంలో కూడా పెద్ద మార్పు కనిపిస్తోంది. గతంతో పోల్చితే స్థానిక వినియోగం సుమారు 70శాతం వరకు పడిపోయిందని, 60 శాతం వరకు ఎగుమతులు నిలిచిపోయాయని, పూర్తి స్థాయిలో వివరాలను సేకరిస్తున్నామని బుచ్చారవు బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కోళ్లలో పెరుగుతున్న వ్యాధులతో మరింత కలకలం
ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో అనేక కోళ్ల ఫారాల్లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. గత రెండు వారాలుగా ఇది బాగా పెరిగింది. గతంలోనూ అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.
విరిలెంట్ న్యూకేజిల్ అనే వ్యాధి కారణంగానే ఒక్కసారిగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని చెబుతున్నారు. సాధారణంగా బ్రాయిలర్కి వ్యాక్సినేషన్ సమస్య కారణంగా ఇది వేగంగా వ్యాపిస్తోంది. పెద్ద సంఖ్యలో కోళ్ల ఫారాలు ఖాళీ అవుతున్నాయి. నష్టం అంచనావేసే పనిలో అధికారులు ఉన్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక రావచ్చని చెబుతున్నారు.
మాంసం అమ్మకాలపై నిషేధం
వరుసగా జరుగుతున్న పరిణామాలతో మాంసం అమ్మకాలపై కొన్ని చోట్ల నిషేధం కూడా విధిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపాలిటీలో వారం రోజుల పాటు చికెన్, మటన్ సహా అన్ని రకాల మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. జనంలో రోజు రోజుకీ అపోహలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ముందు జాగ్రత్తగా తాత్కాలికంగా మాంసం అమ్మకాలపై నిషేధం విధించామని తణుకు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ మల్లేశ్వరరావు బీబీసీతో అన్నారు.
ఇలా కొన్నిచోట్ల అధికారికంగానే నిషేధం విధించగా.. మరి కొన్నిచోట్ల అనధికారిక నిషేధం కొనసాగుతోంది. దీంతో చికెన్ ధరలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి. జనవరి నెలాఖరునాటికి కిలో రూ.200గా ఉన్న బ్రాయిలర్ చికెన్ ఇప్పుడు రిటైల్ మార్కెట్లో రూ.150 కన్నా దిగువకు పడిపోయింది. వ్యాపారాలు ఒక్కసారిగా పడిపోయాయి.

5 కేజీల మటన్ కొంటే హెల్మెట్ ఉచితం
అటు మాంసం అమ్మకాలు కూడా గణనీయంగా పడిపోవడంతో వ్యాపారులు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణాజిల్లా నందిగామలో ఓ మటన్ దుకాణం యజమాని 5 కేజీల మాంసం కొంటే హెల్మెట్ ఉచితం అంటూ కొనుగోలుదారుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
నిలిచిన ఎగుమతులు - లబోదిబోమంటున్న పౌల్ట్రీ యజమానులు
మొదట కరోనావైరస్ వదంతులు, ఆపై యజమానులు పెంపకంలో జాగ్రత్తలు పాటించని కారణంగా కోళ్లకు సోకిన వ్యాధులు... ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన పౌల్ట్రీ వ్యాపారి ఈడ్పుగంటి సత్యన్నారాయణ బీబీసీతో అన్నారు.
వ్యాక్సినేషన్ లోపం కారణంగా కోళ్లలో రోగనిరోధక శక్తి తగ్గి వేల సంఖ్యలో చనిపోతున్నాయి. అలా చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చేయాలి లేదా కాల్చేయాలి. కానీ కొందరు రోడ్డుపక్కనే పడేయడంతో జనంలో మరింత భయాలు మొదలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఎగుమతులు ఆగిపోయాయని ఫలితంగా నిర్వహణ భారం పెరుగుతోందని సత్యన్నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి
చికెన్ తింటే కరోనావైరస్ వస్తుందన్న వదంతుల ప్రభావం దేశ వ్యాప్తంగా పౌల్ట్రీ మార్కెట్పై కూడా పడిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల గడిచిన మూడు వారాలుగా సుమారు 1300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొంది.
ఒక్కసారిగా అమ్మకాలు పడిపోవడంతో చిన్న వ్యాపారులు నష్టపోయారు. తాజా పరిణామాలు కోళ్ల దాణా ఉత్పత్తిదారులపైనా కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గడిచిన కొద్ది వారాలుగా సుమారు 8 శాతం అమ్మకాలు క్షీణించాయి.

వాట్సాప్ మెసేజ్లపై మహారాష్ట్ర పోలీసులు సీరియస్
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన అధికారులు చికెన్ తినడం పూర్తి సురక్షితం అంటూ ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేశారు. వివిధ రాష్ట్రాల పౌల్ట్రీ సంఘాలు కూడా ప్రసార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు విడుదల చేశాయి.
తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
పౌల్ట్రీ సంఘాలు, అధికారుల చర్యలతో ఇప్పుడిప్పుడే అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తోందని వెంకీస్ సంస్థ జనరల్ మేనేజర్ ప్రసన్న పెడ్గొంకర్ చెప్పినట్టు రాయిటర్స్ తెలిపింది. గత నెలతో పోల్చితే తమ సంస్థ షేర్ ధర కూడా 20 శాతం పెరిగిందన్నారు. అంత మాత్రాన పరిస్థితి పూర్తిగా కుదుటపడినట్టు కాదని చెప్పారు. తిరిగి సాధారణ పరిస్థితికి చేరుకునేందుకు సమయం పడుతుందని, చిన్న, మధ్య తరహా వ్యాపారులు మాత్రం తీవ్రంగా నష్టపోయారని ప్రసన్న చెప్పినట్టు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘అన్నీ అపోహలే’
అనవసర అపోహల కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని అగ్రికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ రామసుబ్బారెడ్డి బీబీసీతో అన్నారు.
గుడ్లు, మాంసం కారణంగా వైరస్ వ్యాపిస్తుందనడంలో వాస్తవం లేదని పైగా వైరస్ని తట్టుకునే శక్తి కూడా వస్తుందని చెప్పారు. వెటర్నరీ విభాగం నిపుణుల అభిప్రాయాలు తీసుకోకుండా అశాస్త్రీయంగా ప్రచారం చేయడం సరికాదన్నారు. పూర్తిగా ఉడికించిన తర్వాత వైరస్ సోకే అవకాశమే లేదని బీబీసీకి వివరించారు.
‘నాన్వెజ్ కారణంగా కరోనా వ్యాపించదు’
ఆహారం కారణంగా కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు లేవని తూర్పు గోదావరి జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయకర్త డాక్టర్ రమేష్ కిషోర్ తెలిపారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘కొందరు ప్రచారం చేస్తున్నట్టు నాన్-వెజ్ కారణంగా కరోనా వ్యాప్తి చెందుతుందనేది అసత్యం. ఆంధ్రప్రదేశ్లో అలాంటి వైరస్ ప్రభావం ఏమాత్రం లేదు. ప్రస్తుతం 35 డిగ్రీల సెల్సియస్కు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మన రాష్ట్రంలో ఇంత ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కరోనా కారకాలు మనుగడ సాగించడం అసాధ్యం. అయితే కోళ్లు మృతి చెందిన విషయాన్ని కరోనా వైరస్తో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారు. దానివల్ల అపోహలు పెరుగుతున్నాయి. చికెన్, మటన్లలో లభించే మాంసకృత్తులు మనిషికి అవసరం. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు పాటించాలి’’ అని సూచించారు.

ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- ఒక్క మిడత ‘మహమ్మారి'లా ఎలా మారుతుంది
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- పాకిస్తాన్లో చక్కెర కొరత... ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- హార్ట్ బ్రేక్ గైడ్: లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ బాధ నుంచి బయటపడండి ఇలా..
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- బిర్యానీ హైదరాబాద్ది కాదా?
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









