శ్రీనివాస్ గౌడ: ‘ట్రయల్ రన్లో పాల్గొనను.. పరుగు పందేలపై ఆసక్తి లేదు’

ఫొటో సోర్స్, ANNU PAI
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత ఉసేన్ బోల్ట్తో పోలుస్తున్న కర్ణాటక భవన నిర్మాణ కూలీ శ్రీనివాస్ గౌడ భారత క్రీడా అథారటీ ట్రయల్లో పాల్గొనడానికి నిరాకరించాడు.
ఈ కూలీ దున్నల రేసులో అద్భుత ప్రదర్శన చూపించిన తర్వాత అతడిని ఒలింపిక్ చాంపియన్, అథ్లెట్లతో పోల్చడం ప్రారంభించారు. ఆ తర్వాత కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు, భారత క్రీడా అథారిటీ ట్రయల్లో పాల్గొనాలని అతడికి సలహా ఇచ్చారు.
28 ఏళ్ల శ్రీనివాస్ గౌడ బురద నీళ్లలో దున్నలతో 142 మీటర్ల దూరాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసి సంచలనం సృష్టించాడు.
కర్ణాటక తీర నగరం మంగళూరులోని ఒక గ్రామంలో సంప్రదాయ క్రీడ 'కంబళ'లో పాల్గొన్న అతడు ఈ అద్భుతం చేశాడు.

ఫొటో సోర్స్, ANNU PAI
గౌడ 13.42 సెకన్లలో ఆ దూరాన్ని అందుకున్నాడని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఆ తర్వాత అతడు ఉసేన్ బోల్ట్ ఒలింపిక్ రికార్డును కూడా బద్దలు కొట్టేశాడని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఒలింపిక్ క్రీడల్లో బోల్డ్ పేరున 9.58 సెకన్లలో వంద మీటర్ల దూరం చేరుకున్న రికార్డు ఉంది. గౌడ వంద మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో అందుకున్నాడని సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.

ఫొటో సోర్స్, ANNU PAI
వేగానికి కారణం దున్నలే అంటున్నాడు
ఆ తర్వాత తన సత్తా నిరూపించుకునేందుకు గౌడ ముందు ట్రయల్లో పాల్గొనాలనే ప్రతిపాదన ఉంచారు. కానీ గౌడ బీబీసీతో రేస్ సమయంలో తన పాదాలకు గాయాలు అయ్యాయని, ప్రస్తుతానికి ట్రయల్లో పాల్గొనలేనని చెప్పాడు.
"నేను భారత క్రీడా అథారిటీ ట్రయల్లో పాల్గొనడానికి ఫిట్గా లేను. నా పాదాలకు గాయాలు అయ్యాయి. నా దృష్టి కూడా 'కంబళ' పైనే ఉంది. నాకు దున్నలతో వరిపొలాల్లో పరిగెత్తడమే అలవాటు" అని శ్రీనివాస్ చెప్పాడు.
కంబళ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి ప్రొఫెసర్ గుణపాల కాదంబా "కేంద్ర క్రీడా మంత్రి ఆఫర్ను మేం స్వాగతిస్తున్నాం. మేం దాన్ని తోసిపుచ్చడం లేదు. మేం దానిని 'కంబళ'కు దక్కిన గౌరవంగా చూస్తున్నాం. కానీ, తను ఇప్పుడు ట్రయల్లో పాల్గొనలేడు. మరో రెండు మూడు రోజులు వరకూ తను దాన్ని చేయలేడు" అన్నారు.

ఫొటో సోర్స్, ANNU PAI
"ఇక్కడ సమస్య ఏంటంటే, తను మరో మూడు శనివారాలు 'కంబళ'లో పాల్గొనాలి. దీన్నుంచి తను ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయలేడు. అందుకే మేం క్రీడా శాఖ ప్రతిపాదనను తోసిపుచ్చడం లేదు. కానీ, తను తర్వాత జరిగే ట్రయల్లో పాల్గొనే ఆస్కారం ఉంది" అన్నారు.
గౌడ తన వేగానికి కారణం దున్నలే అని చెబుతున్నాడు. దున్నలు చాలా వేగంగా పరిగెడతాయని అంటున్నాడు. తనకు ఎలాంటి ట్రాక్ ఈవెంట్లో పాల్గొనాలని కూడా లేదని శ్రీనివాస చెప్పాడు.
"ఇటు ప్రొఫెసర్ కాదంబా నేను దీనిని వేరే వారితో పోల్చడం లాంటివి చేయాలనుకోవడం లేదు. ఒలింపిక్ నిర్వాహకుల దగ్గర ఎన్నో శాస్త్రీయ పద్ధతులు ఉంటాయి. వారి దగ్గర వేగాన్ని కొలవడానికి మెరుగైన ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఉంటాయి" అన్నారు.

ఫొటో సోర్స్, ANNU PAI
కంబాలా అంటే ఏంటి?
'కంబళ' అంటే కర్ణాటక తీర ప్రాంతాల్లో నిర్వహించే ఒక సంప్రదాయ క్రీడ. స్థానిక తులు భాషలో 'కంబళ' అంటే 'బురద నిండిన వరిపొలాలు' అని అర్థం.
ఈ క్రీడలో పాల్గొనే క్రీడాకారులు 132-142 మీటర్ల పొడవున్న పొలంలో కాడెకు కట్టిన దున్నలతో కలిసి వేగంగా పరుగు తీయాల్సి ఉంటుంది. ఈ క్రీడ వివాదాస్పదం కూడా అయ్యింది. ఇది తరచూ అంతర్జాతీయ స్థాయిలో జంతు హక్కుల కార్యకర్తలు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
2014లో భారత సుప్రీంకోర్టు ఎద్దులను, దున్నలను ఇలా పరిగెత్తించడంపై నిషేధం విధించింది.
కర్ణాటక పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో 'జల్లికట్టు'పై తర్వాత దీనిపై కూడా నిషేధం విధించారు. జల్లికట్టుపై నిషేధం విధించిన రెండేళ్లకు కర్ణాటక హైకోర్టు 'కంబళ'అన్ని కార్యకాలాపాలపై నిషేధం విధిస్తూ, మధ్యంతర ఉత్తర్వులు విధించింది.

ఫొటో సోర్స్, ANNU PAI
హైకోర్టు నిషేధాన్ని సవాలు చేసిన 'కంబళ' నిర్వాహకులు ఈ క్రీడలో మానవతా విలువలను మరింత పెంచుతామని చెప్పారు అని ప్రొఫెసర్ కాదంబా తెలిపారు.
"దున్నలపై మానవత్వంతో ప్రవర్తించాలని, వాటిని అనవసరంగా గాయపరచకూడదని గౌడ సహా, మా ప్రస్తుత, మాజీ విద్యార్థులకు నేర్పిస్తున్నాం" అని ప్రొఫెసర్ కాదంబా చెప్పారు.
2018లో కర్ణాటకలో 'కంబళ' మళ్లీ ప్రారంభమైంది. కానీ, దానితోపాటూ చాలా షరతులు కూడా విధించారు. వాటిలో జాటీలు ఉపయోగించడాన్ని కూడా నిషేధించారు. అయితే ఈ క్రీడకు ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉంది.
అంతర్జాతీయ జంతు హక్కుల సంస్థ పెటా(PETA) సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. 'కంబళ'ను మళ్లీ ప్రారంభించాలనే నిర్ణయం చట్టవిరుద్ధం అని చెప్పింది.
కానీ, ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న, ఈ క్రీడ ఏళ్ల క్రితం సంప్రదాయ 'కంబళ'కు చాలా భిన్నం అని ప్రొఫెసర్ కాదంబా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:
- జైపూర్లో బాసిత్ ఖాన్ హత్యకు కారణమేంటి... కశ్మీరీలపై ద్వేషంతోనే కొట్టి చంపారా?
- జింకల వేటకు పెంపుడు చిరుతలు... క్రూర మృగాలనే మచ్చిక చేసుకున్న కొల్హాపూర్ వాసులు
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
- షహీన్బాగ్: ‘దిల్లీ కాలుష్యంలో ఆశల గాలి పీల్చాలంటే ఇక్కడకు రావాల్సిందే’ - అభిప్రాయం
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- భారత్లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలను వదులుకుంటున్న యువకులు
- బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









