మహారాష్ట్ర: సజీవ దహనానికి గురైన మహిళ మృతి... ఏపీ తరహా చట్టాన్ని తెస్తామన్న హోం మంత్రి

యువతి

"ఆమె తట్టుకోలేనంత నొప్పితో అరుస్తోంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతోంది. అప్పటికే మంటలు ఆమె తల, మెడ, ముఖాన్ని కమ్మేశాయి. అటు వైపుగా స్కూలుకు వెళుతున్న ఒక అమ్మాయి దగ్గర నుంచి స్వెటర్ తీసుకుని ఆమె మీద కప్పి, మంటల్ని అదుపులోకి తెచ్చి, వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాను. ఈ ఘటనని నేను జీవితంలో మర్చిపోలేను" అని విజయ్ కుకడే చెప్పారు.

ఫిబ్రవరి 3న మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని హింగన్ ఘాట్, నన్దోరి చౌక్ ప్రాంతంలో కాలేజీకి వెళుతున్నప్పుడు సజీవ దహనానికి గురైన ఆ మహిళ సోమవారం ఉదయం మరణించింది. ఆమె ఒక కాలేజీలో లెక్చరర్.

ఈ ఘటనకు విజయ్ ప్రత్యక్ష సాక్షి.

నలభై శాతం కాలిన గాయాలతో బాధితురాలిని నాగపూర్ లోని హాస్పిటల్‌కు తరలించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడడం సాధ్యం కాలేదు.

Presentational grey line
News image
Presentational grey line

అసలు ఏం జరిగింది?

ఫిబ్రవరి 3, ఉదయం 7:15 గంటలకు, "నన్ను రక్షించండి, నన్ను రక్షించండి" అంటూ దూరంగా నుంచి వస్తున్న కేకలు ఆ దారిలో వెళుతున్న విజయ్ కుకడే చెవిలో పడ్డాయి. ఎవరో ప్రమాదంలో ఉన్నారని ఆయన తన బండిని ఆపారు.

బైక్ ఆపి చూసేసరికి మంటల్లో కాలుతున్న మహిళ కనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన కాలుతున్న శరీరం పై నీళ్లు చల్లి మంటల్ని ఆపే ప్రయత్నం చేశారు.

మంటలు ఎంతకీ ఆగకపోవడంతో అదే దారిలో స్కూల్ కి వెళుతున్న అమ్మాయి స్వెటర్ తీసుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు.

మంటల్ని ఆర్పిన తక్షణమే అమ్మాయిని కారులో హాస్పిటల్ కి తరలించారు.

"నేను మా అమ్మాయిని స్కూల్ లో దించటానికి వెళుతున్నప్పుడు నన్దోరి చౌక్ దగ్గర ఒక అబ్బాయి కాలుతున్న కర్ర చేతిలో పట్టుకుని కనిపించాడు. చలి కాలం కావడం వలన అక్కడ ఉన్న తుక్కు కాల్చి చలి కాచుకుంటున్నారని అనుకున్నాను. కానీ, వెనక్కితిరిగి వస్తున్నపుడు ఈ అమ్మాయి మంటల్లో కాలుతూ కనిపించింది. ఆ కర్రతో ఆ అమ్మాయికి నిప్పు పెట్టి ఉంటారని అర్ధం అయింది" అని కుకడే చెప్పారు.

స్థానికుల తక్షణ సహాయం

నిందితులు మహిళని పెట్రోల్ పోసి నిప్పంటించగానే కాలుతున్న బట్టలతో ఆమె అక్కడే కూలబడిపోయింది. సహాయం కోసం అరిచింది. తన ఏడుపు విని స్కూల్ కి వెళుతున్న ఒక అమ్మాయి అటు వైపు పరుగు పెట్టింది.

ఇంతలో విజయ్ కుకడే కూడా తన బండిని ఆపి సహాయ చర్యలు మొదలు పెట్టారు. స్థానికుల సహాయంతో మంటలు ఆర్పి ఆ అమ్మాయిని తక్షణమే హాస్పిటల్ కి తరలించారు.

ప్రతీకాత్మక చిత్రం

ఘటన వివరాలు:

ఉ. 7.05 గం.లు: లెక్చరర్ గా పని చేస్తున్న మహిళ నన్దోరి చౌక్ దగ్గర బస్సు దిగింది.

ఉ. 7.07 గం.లు: ఆమె కాలేజీ వైపు నడవడం మొదలు పెట్టింది. బస్సుని వెంబడిస్తున్న వికేష్ నగరలే, నిందితుడు చౌక్ దగ్గర ఆగాడు.

ఉ. 7.10 గం.లు: నిందితుడు తన బండిలోని పెట్రోల్ లో చింకి గుడ్డలు కట్టిన కర్రని ముంచి మహిళ నడిచిన దారి వెంట నడవడం మొదలు పెట్టాడు

ఉ. 7.15 గం.లు: మహిళ న్యూ మహాలక్ష్మి గ్రోసరీ స్టోర్ వైపు వెళ్ళింది. వికేష్ నగరలే వేగంగా లెక్చరర్ దగ్గరకి వెళ్లి ఆమె ఒంటి పై పెట్రోల్ పోసాడు.

ఉ. 7.17 గం.లు: మండుతున్న కర్రతో ఆమెకు నిప్పంటించి ఇంజిన్ ఆపకుండా పార్క్ చేసి ఉంచిన బైక్ దగ్గరకు వెళ్ళి పారిపోయాడు.

దాడి తర్వాత గట్టిగా ఆర్త నాదాలు వినిపించాయి. అక్కడ ఉన్న ఒక వ్యక్తి నిందితుడిని పట్టుకుపోవాలని ప్రయత్నించాడు కానీ, అతను దొరకలేదు. బాధితురాలిని హాస్పిటల్ కి తరలించారు.

నిరసన

ఫొటో సోర్స్, PRAVEEN MUDHOLKAR

రాక్షస ప్రవ్రుత్తి ఉన్నవారేఇలా చేస్తారు

"నేను గత 35 ఏళ్ళుగా హాస్పిటల్ యాక్సిడెంట్ వార్డ్ లో పని చేస్తున్నాను. ఇన్నేళ్ళ వైద్య వృత్తిలో ఇంత దారుణమైన ఘటన చూడలేదు. ఇలా రాక్షసం గా ఒక మహిళను సజీవ దహనం చేయడం నన్ను చాలా బాధిస్తోంది. ఆమె శరీరం మీద పెట్రోల్ పోయడం వల్ల ఆమె ముఖం, మెడ, గొంతు, చెవులు, జుట్టు, దంతాలు కూడా కాలిపోయాయి. ఇది రాక్షసులను కూడా భయపెట్టే విధంగా ఉందని బాధితురాలికి వైద్యం అందించిన డాక్టర్ అనూప్ మరార్ అన్నారు.

మహారాష్ట్ర హోమ్ శాఖ మంత్రి అనిల్ దేశముఖ్ మహిళ పై దాడి చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లో విచారణ జరిపి నిందితులకి శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో నిందితులని శిక్షించేందుకు చట్టాన్నితీసుకు వస్తామన్నారు.

నిరసన

ఫొటో సోర్స్, PRAVEEN MUDHOLKAR

ఇది హింగన్ ఘాట్లో గత మూడు నెలల్లో చోటు చేసుకున్న మూడవ ఘటన. రీటా దాగే అనే మహిళని పట్ట పగలే ఇంట్లోకి చొరబడి హత్య చేశారు.

గత ఏడాది సెప్టెంబర్ లో సాక్షి సర్కార్ అనే అమ్మాయిని నిర్జన ప్రదేశానికి తీసుకుని వెళ్లి చంపేశారు.

ఇప్పుడు జరిగిన ఘటన మూడవది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)