గాంధీ బొమ్మను 'షూట్' చేసిన హిందూ మహాసభ నేత పూజా పాండే అరెస్టు

గాంధీ బొమ్మను షూట్ చేస్తున్న పూజా పాండే

మహాత్మా గాంధీ బొమ్మను ఎయిర్ పిస్టల్‌తో కాల్చిన హిందూ మహాసభ నాయకురాలు పూజా పాండేను అలీగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంపిన రోజైన జనవరి 30న హిందూ మహాసభ నిర్వహించిన ఒక 'వేడుక'లో పూజ ఈ పని చేశారు.

గాడ్సే బొమ్మకు పూలమాల వేసిన తర్వాత గాంధీ బొమ్మను పూజ మూడుసార్లు షూట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో గత వారం వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యింది. దీనిని హిందూ మహాసభే విడుదల చేసిందని భావిస్తున్నారు.

వీడియో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పూజ అరెస్టు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూజను, వీడియోలో పూజతోపాటు ప్రముఖంగా కనిపిస్తున్న ఆమె భర్త ఆచూకీని గుర్తించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ కేసులో ఇప్పటికే వారం వ్యవధిలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు అనుమానితుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారి నీరజ్ జదావున్ బీబీసీతో చెప్పారు.

గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

1948 జనవరి 30న దిల్లీలో గాంధీని గాడ్సే అతిసమీపం నుంచి ఛాతీపై కాల్చి చంపేశాడు. గాడ్సే హిందూ మహాసభ సహా పలు జాతీయవాద మితవాద గ్రూపుల్లో కార్యకర్తగా ఉండేవాడు.

గాంధీ ముస్లింల పట్ల మొగ్గు, పక్షపాతం చూపించారని, హిందువులకు నమ్మకద్రోహం చేశారని హిందూ ఛాందసవాదులు ఆరోపిస్తారు. 1947లో భారతదేశ విభజనకు, విభజన సమయంలో రక్తపాతానికి కూడా గాంధీయే కారణమని వారు విమర్శిస్తారు.

గాంధీ హత్యను వేడుకగా జరుపుకోవడానికి హిందూ మహాసభ గతంలోనూ ప్రయత్నించింది. కర్ణాటకలోని ఆరు జిల్లాల్లో గాడ్సే విగ్రహాలు పెడతామని ఈ గ్రూపు ప్రకటించడంపై 2015లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)