భారత మార్కెట్‌లో 'వెబ్‌సిరీస్‌'ల జోరు

వెబ్‌సిరీస్

వీక్షకుల సంఖ్యను పెంచుకునే విషయంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ల మధ్య భారత్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పుడు మరికొన్ని బ్రాండ్లు వీక్షకులను ఆకర్షించేందుకు వరుస కడుతున్నాయి. భారత్‌కు చెందిన చాలా సంస్థలు వెబ్ కోసం కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. అంతేకాదు, వాటిని ప్రసారం చేసేందుకు సొంతంగా యాప్‌లను సైతం విడుదల చేస్తున్నాయి. ఈ సరికొత్త వేదికలు భారత్‌లో షో బిజినెస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో వివరిస్తూ బీబీసీ ప్రతినిధి యోగితా లిమాయే అందిస్తున్న కథనం ఇది.

భారతీయులు ఇప్పుడు చిన్ని తెరలకు అతుక్కుపోతున్నారు. ఆ సంఖ్య వేలల్లో కాదు, లక్షల్లో ఉంది. అంటే ఈ వేదికకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ముంబయిలోని ఓ స్టూడియో ప్రాంగణంలో వెబ్ కోసం ఓ షో చిత్రీకరణ జరుగుతోంది.

ఇటీవల కాలంలో వెబ్ సిరీస్‌ల నిర్మాణం జోరందుకుంది. దానిలో భాగమే ఇది.

బాలీవుడ్ చిత్రాల్లో అరుణోదయ్ సింగ్ చిన్న చిన్న పాత్రలు పోషిస్తుంటారు. అయితే ఇందులో ఆయనది ప్రధాన పాత్ర.

నటులు, రచయితలతో పాటు ఇక్కడ చాలా మందికి అవకాశాలుంటాయి. అది చాలా మంచి విషయం. ఖర్చు తక్కువయ్యే వ్యాపారమిది. మరిన్ని నాణ్యమైన అంశాలు తెరపైకి రావడం ఎప్పుడైనా మంచిదే.

వీడియో క్యాప్షన్, భారత మార్కెట్‌లో ‘వెబ్‌సిరీస్‌’ల జోరు

సెన్సార్‌తో ఇబ్బంది లేదు

ఇంటర్నెట్ ఇప్పుడు కథనాలను సైతం మారుస్తోంది. మాయ2 కార్యక్రమంలో గే, లెస్బియన్ ప్రేమకథే కేంద్ర బిందువు. ఇటువంటి కథలు భారతీయ సినిమాలు, టీవీల్లో కనిపించడం చాలా కష్టం. కఠినమైన సెన్సార్ నిబంధనలే దీనికి కారణం. వెబ్‌లో ప్రసారమయ్యే వినోద కార్యక్రమాలు ఎక్కువ శాతం క్రమబద్ధమైనవి కావు.

''ఎటువంటి కోతలూ లేకుండా నేను అనుకున్న కథను అలాగే చూపించే శక్తి నాకు ఈ మాధ్యమంలో ఉంది. ఇదొక కొత్త రకం స్వేచ్ఛ. ఇది స్వాతంత్ర్యం లాంటిది.'' అని వెబ్‌సిరీస్‌ల గురించి దర్శకుడు క్రిష్ణ భట్ అన్నారు.

వినోద పరిశ్రమను ప్రజాస్వామ్యయుతంగా మార్చేశాయి

భారతీయ బాక్సాఫీసుల్లో యాక్షన్, రొమాంటిక్ చిత్రాలకే గిరాకీ ఎక్కువ. పేరున్న నటులు, చిత్రరంగ ప్రముఖుల కుటుంబ సభ్యులకే ప్రధాన పాత్రలు లభిస్తుంటాయి. టీవీ ప్రైమ్ టైంలలో ఫ్యామిలీ డ్రామా కార్యక్రమాలు వేలకు వేల ఎపిసోడ్లతో సంవత్సరాల పాటు సాగుతాయి. ఈ పరిస్థితి ఇతర కార్యక్రమాలకు అవకాశాలను తగ్గిస్తోంది. ఆ సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫాం భారతీయ వినోద పరిశ్రమను ప్రజాస్వామ్యయుతంగా మార్చేసింది. అవకాశాల కోసం ముంబయిలో వేచి చూస్తున్న వేలాది మంది కళాకారులకు ఇది పని కల్పించింది. అంతేకాదు, విస్తృత స్థాయి కథలను చెప్పే అవకాశం కూడా ఇది కల్పించింది.

మొబైల్ డేటా వల్లే..

ఇక్కడి ఈ వ్యాపారానికి ఉన్న అవకాశాలేంటో విదేశీ సంస్థలు పసిగట్టాయి. భారత్‌లో మొదటి భారీ వెబ్ సిరీస్ 'సేక్రెడ్ గేమ్స్' తర్వాత నెట్‌ఫ్లిక్స్ తాను నిర్మిస్తున్న కొత్త షోలను ప్రకటించింది. చాలా భారతీయ స్టూడియోలకు సొంత వెబ్ ప్లాట్‌ఫాంలు కూడా ఉన్నాయి.

కానీ, ఈ వెబ్ బూమ్ అంతా మొబైల్ డేటా రేట్లు తక్కువగా ఉన్నందువల్లే. టెలికం పరిశ్రమలో నెలకొన్న పోటీ వల్లే డేటా రేట్లు తక్కువగా ఉన్నాయి. అది అలా కొనసాగినంత కాలం ఈ కెమెరాలు పని చేస్తూనే ఉంటాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)