రఫేల్ యుద్ధ విమానాల వివాదం: అసలు ఒప్పందం ఏంటి? వివాదం ఎక్కడ? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు

వీడియో క్యాప్షన్, రఫేల్ డీల్ రాద్ధాంతం ఏంటి? ఎందుకు? ఎలా?
    • రచయిత, తెలుగు డెస్క్
    • హోదా, బీబీసీ

భారత్ అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్‌కు చెందిన డసో కంపెనీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్ చెప్పారంటూ వచ్చిన కొత్త సమాచారం ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. అసలు రఫేల్ గొడవ ఏంటి?

రఫేల్ ఒప్పందంలో వివాదాస్పద అంశాలు: భారత భాగస్వామి ఎంపిక , ఒప్పంద వ్యయం, విమానాల సంఖ్య

1. ఒప్పందం ప్రారంభం

భారత్ వాయుసేన వద్ద ఉన్న యుద్ధ విమానాలను ఆధునికీకరించాలని భావించింది. 2012లో అంటే యూపీఏ ఇందుకు సంబంధించి బిడ్లను ఆహ్వానించింది. అమెరికా, యూరప్, రష్యా తదితర దేశాల నుంచి పలు బిడ్లు వచ్చాయి. వాటిలో ఫ్రాన్స్‌కి చెందిన ప్రైవేటు కంపెనీ డసోను ఎంపిక చేశారు.

18 ఆఫ్ ద షెల్ఫ్ జెట్ విమానాలను డసో నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

డసో నుంచి టెక్నాలజీ, ఇతర విడి భాగాలను భారత్‌కు తీసుకొచ్చి బెంగళూరులో ఉన్న ప్రభుత్వ అధీనంలోని హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్‌లో (హల్) 108 యుద్ధ విమానాలను అసెంబుల్ చేయాలని నిర్ణయించారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Sean Gallup/Getty Images

2.మోదీ ప్రధాని అయ్యాక

2014లో భారత్‌లో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యూపీఏ నిర్ణయానికి భిన్నంగా.. ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 విమానాలను నేరుగా డసో నుంచి కొనుగోలు చేయాలని 2015లో నిర్ణయించింది. అక్కడి టెక్నాలజీని కొని దేశీయంగా హల్‌లో యుద్ధ విమానాల అసెంబ్లింగ్ ఆలోచనను విరమించుకుంది.

2015 ఏప్రిల్లో భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుందని మోదీ ప్రకటించారు.

ఈ ఒప్పందం కింద డసో, దాని ప్రధాన భాగస్వాములైన ఇంజిన్ మేకర్ సఫ్రాన్, ఎలక్ర్టానిక్ సిస్టమ్స్ తయారీ దారు థాలెస్‌లు తమ టెక్నాలజీని డీఆర్డీవో, హెచ్ఎఎల్‌తో పంచుకుంటాయని అనుకున్నారు.

రాఫేల్

ఫొటో సోర్స్, Getty Images

3.ఒప్పందం కుదిరాక..

2016 సెప్టెంబరులో ఫ్రాన్స్‌తో ఒప్పందంపై మోదీ సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. డసోకి రూ.58వేల కోట్లు చెల్లించాలి. రఫేల్ 36 యుద్ధ విమానాలు అందిస్తుంది. మొత్తం రూ.58వేల కోట్లలో 15 శాతం నిధులను భారత్ డసోకి ముందస్తుగా చెల్లించాలి. విమానాలతో పాటు మీటియర్ మిసైల్స్ సహా పలు అత్యాధునిక ఆయుధాలను భారత్‌కి డసో అందిస్తుంది.

భారత వాయుసేన పరిశోధన కార్యక్రమాల్లో డసో 30 శాతం పెట్టుబడులు పెడుతుంది. స్థానికంగా భారత్‌లో తయారు చేసే రఫేల్ విమానాల కోసం 20 శాతం నిధులు వెచ్చిస్తుంది. ఈ నిధులు మొత్తం రూ.58వేల కోట్లలో భాగంగా ఉంటాయి.

2019 సెప్టెంబరులో రఫేల్ యుద్ధ విమానాలు అందుబాటులోకి వస్తాయి.

రాఫేల్

ఫొటో సోర్స్, Getty Images

4.మరి వివాదం ఎక్కడ?

మొదట డసోకి భారత భాగస్వామిగా అంటే ఇక్కడ ఆ సంస్థ పరిశోధనలు చేయడానికి, టెక్నాలజీ అందించడానికి హల్‌ను ఎంచుకుంటారని భావించారు. కానీ అలా జరగలేదు. డసో తమ భారత భాగస్వామిగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను ఎంచుకుంది.

వెంటనే 36 విమానాలను కొనుగోలు చేయాలని మోదీ నిర్ణయించడం కూడా ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు.

2012లో యూపీఏ జరిపిన బేరసారాలతో పోల్చితే ఇఫ్పుడు ఒక్కో విమాన ధరను మూడు రెట్లు పెంచేశారని కాంగ్రెస్ చెబుతోంది. తాజా ఒప్పందాన్ని అధిగమించలేని నష్టంగా పేర్కొంది.

రాఫేల్

ఫొటో సోర్స్, AFP

5. మోదీ ప్రభుత్వం ఏమంటోంది?

కాంగ్రెస్ విమర్శలను కేంద్రం తిప్పికొట్టింది. 2012 చర్చలతో పోల్చితే తాజా ఒప్పందం చాలా పారదర్శకంగా ఉందని.. ఇందులో అత్యాధునిక ఆయుధాల ప్యాకేజీ, లాజిస్టిక్ సపోర్ట్ లు కూడా ఉన్నాయని తెలిపింది. యూపీఏ సంప్రదింపులు జరిపినపుడు వీటిని చేర్చలేదని పేర్కొంది.

పొరుగు దేశాలు సైనిక బలాన్ని పెంచుకున్నాయి కాబట్టి మనకు వెంటనే 36 అత్యాధునిక యుద్ధ విమానాలు కావాలని మోదీ చెప్పారు.

రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను రఫేల్ తన భారత భాగస్వామిగా ఎంచుకోవడంలో ప్రభుత్వం పాత్ర లేదని అవి రెండూ ప్రైవేటు సంస్థలని కేంద్రం పేర్కొంది.

రాఫేల్

ఫొటో సోర్స్, AFP

6. డసో ఏం చెప్పింది?

ఒప్పందంపై వచ్చిన విమర్శలపై రఫేల్ కూడా స్పందించింది. తమ భాగస్వామ్యంలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని డసో, రిలయన్స్ ఎయిరో స్పేస్ పేర్కొంది. డసో.. రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌లు రెండూ ప్రైవేటు సంస్థలని.. తమ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో భారత ప్రభుత్వం పాత్ర లేదని తెలిపింది. తామే రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను ఎంచుకున్నామని పేర్కొంది.

మనోహర్ పార్రికర్

ఫొటో సోర్స్, Getty Images

7. ఇప్పుడేమైంది?

డసో తమ భారత భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకోవాలని భారత ప్రభుత్వమే డసోకు సూచించినట్లు ఫ్రెంచి పత్రిక మీడియా పార్ట్.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ చెప్పింది.

దీంతో కేంద్ర ప్రభుత్వం కావాలనే ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'హాల్‌'ను పక్కనపెట్టి, అనుభవం లేని రిలయన్స్‌ డిఫెన్స్‌కు కాంట్రాక్టును అప్పగించిందన్న విమర్శలకు బలం చేకూరినట్టయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)