మమ్మీ మిస్టరీ వీడింది: తయారీలో తుమ్మ జిగురు పాత్ర

- రచయిత, విక్టోరియా గిల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలోని ఎన్నో మిస్టరీల్లో మమ్మీల తయారీ ఒకటి. కానీ ఇప్పుడిప్పుడే ఆ చిక్కుముడి వీడుతోంది. ప్రాచీన ఈజిప్ట్లో శవాలు కుళ్లిపోకుండా ఉండేందుకు వాడిన పద్ధతులేంటో తెలుస్తున్నాయి. ఇటీవలే శాస్త్రవేత్తలు ఓ మమ్మీపై క్షుణ్ణంగా అధ్యయనం జరిపి దాన్ని భద్రపరిచేందుకు ఉపయోగించిన పదార్థాల జాబితాను కనుగొన్నారు.
దీనికోసం క్రీస్తు పూర్వం 3,700-3,500 మధ్య కాలానికి చెందిన ఓ మమ్మీపై వివిధ దశల్లో ఫోరెన్సిక్ రసాయన పరీక్షలు జరిపారు. ఆ వివరాలను ఆర్కియలాజికల్ సైన్స్ జర్నల్లో ప్రచురించారు.
ఆ అధ్యయనంలో పాలుపంచుకున్న డాక్టర్ స్టెఫెన్ బక్లీ మాట్లాడుతూ, 4000 ఏళ్ల పాటు ఈజిప్ట్ మమ్మీల తయారీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన పదార్థాల గుట్టును తాము కనిపెట్టినట్టు చెప్పారు.
శాస్త్రవేత్తల ప్రకారం మమ్మిఫికేషన్ (మమ్మీల తయారీ) కోసం ఉపయోగించిన ప్రధాన పదార్థాలు
- ఓ మొక్క నుంచి సేకరించిన నూనె (నువ్వుల నూనెగా భావిస్తున్నారు)
- ‘బుల్రషెస్‘ అనే మొక్క వేరు నుంచి సేకరించిన తైలం
- తుమ్మ చెట్టు నుంచి సేకరించిన సహజసిద్ధ జిగురు
- దేవదారు వృక్షం నుంచి సేకరించిన జిగురు
వీటన్నింటినీ కలపడం ద్వారా ఆ పదార్థానికి బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి వస్తుందని, దాని సాయంతో శరీరం కుళ్లిపోకుండా ఏళ్ల తరబడి కాపాడి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యోర్క్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ బక్లీ, ఆయన సహోద్యోగులు కలిసి మమ్మీపైన కనిపించిన ప్రతి పదార్థానికి చెందిన ‘కెమికల్ ఫింగర్ప్రింట్’ను సేకరించాక ఈ ఫలితాలను వెల్లడించారు.

ఫొటో సోర్స్, DR STEPHEN BUCKLEY
ఇటలీలోని ఈజిప్షియన్ మ్యూజియంలో ఉన్న మమ్మీని వీళ్లు తమ పరిశోధన కోసం ఎంచుకున్నారు.
‘మమ్మీల కెమిస్ట్రీ గుట్టును ఇప్పటిదాకా ఏ పరిశోధనా పూర్తి స్థాయిలో విప్పిన దాఖలాలు లేవు’ అని డా.బక్లీ చెప్పారు.
శాస్త్రవేత్తలు ఎలా కనిపెట్టారు?
ఈ మమ్మీల తయారీ ‘రెసిపీ’ని కనిపెట్టే పని డా.బక్లీ చాలా ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. దీనికోసం ఆయన మొదట ఇంగ్లండ్లోని బోల్టన్ మ్యూజియంలో ఉన్న మమ్మీలను చుట్టడానికి ఉపయోగించిన వస్త్రం నుంచి కొన్ని రసాయనాలు వెలికి తీసి వాటిని విశ్లేషించారు.
ఇప్పటిదాకా అందరూ క్రీస్తు పూర్వం 2,600 కాలంలో మమ్మీల తయారీ ప్రక్రియ మొదలైనట్టు భావిస్తున్నారు. కానీ ఈ మమ్మీ తయారీకి ఉపయోగించిన వస్త్రం అంతకంటే పురాతనమైనదని, అంటే... క్రీ.పూ.4000 నాటిదాని బక్లీ చెప్పారు. దాన్ని బట్టి చూస్తే శవాలను కుళ్లిపోకుండా భద్రపరిచే ప్రక్రియ కూడా చాలా ముందే మొదలై ఉంటుందని ఆయన అన్నారు.
దాంతో ఇటలీ మ్యూజియంలో ఉన్న అత్యంత పురాతన మమ్మీలలో ఒకదానిపై మరింత లోతుగా పరిశోధనలు జరపాలని డా.బక్లీ బృందం నిర్ణయించుకుంది. ఆ మమ్మీ దొరికినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రత్యేక పూతలు దానిపై వేయలేదు. అందుకే తమ అధ్యయనానికి ఆ మమ్మీనే సరైనదని వాళ్లు భావించారు.
ఆ మమ్మీ నుంచి సేకరించిన పదార్థాలపై జరిపిన పరిశోధన ద్వారా, శరీరం కుళ్లిపోకుండా కాపాడే లేహ్యాన్ని ప్రాచీన ఈజిప్షియన్లు ఎలా తయారు చేసుంటారనే దానిపై తామొక అంచనాకు వచ్చినట్లు బక్లీ తెలిపారు.
‘ఇప్పటిదాకా అత్యంత పురాతన మమ్మీల గురించి ఉన్న విజ్ఞానాన్ని ఈ పరిశోధన ఎన్నో రెట్లు ముందుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ మమ్మీకి సంబంధించి కూడా చాలా విషయాలు తెలిశాయి. రసాయన విశ్లేషణ, జన్యు పరిశోధన, రేడియో కార్బన్ డేటింగ్, మమ్మీపై ఉన్న వస్త్రాల పరిశోధన లాంటి అనేక పరీక్షల ఫలితాలను విశ్లేషించడం ద్వారా, ఈ మమ్మీ క్రీ.పూ.3600 కాలానికి చెందిన 20-30ఏళ్ల యువకుడిదని మేం నిర్థరించాం’ అని సిడ్నీలోని మాక్వెరీ యూనివర్సిటీకి చెందిన ఈజిప్షియన్ పరిధోకురాలు డా.జానా జోన్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, DR STEPHEN BUCKLEY
ఈ పరిశోధన ఎందుకంత ముఖ్యం?
ఇప్పటిదాకా అందరూ అనుకుంటున్న దానికంటే చాలా ముందు నుంచే ఈజిప్షియన్లు శవాలను భద్రపరిచేవారని ఈ పరిశోధన ద్వారా తేలింది. దాంతోపాటు, శవాలు కుళ్లకుండా కాపాడే పూత కోసం ఈజిప్షియన్లు ఉపయోగించిన పదార్థాల రహస్యాలు కూడా తెలిశాయి.
శరీరానికి పరిమళ ద్రవ్యాల పూత వేయడం అన్నది మమ్మీల తయారీలో ఓ భాగం మాత్రమే. దానికి తోడు మమ్మీల తయారీలో మరెన్నో దశలు ఉన్నాయి. అవేంటంటే...
- మెదడును తొలగించడం. దీనికోసం ‘విస్కింగ్’ అనే పద్ధతి ద్వారా మెదడును ద్రవ రూపంలోకి మార్చి శరీరం నుంచి వేరు చేస్తారని భావిస్తున్నారు.
- శరీరం లోపలి అవయవాలను తొలగించడం
- తేమను పూర్తిగా తొలగించేందుకు శరీరాన్ని సహజమైన ఉప్పులో ఉంచడం
- బ్యాక్టీరియాను చంపడానికి పరిమళ ద్రవ్యాల పూతను శరీరానికి పట్టించడం
- ప్రత్యేకమైన నారతో శరీరాన్ని పూర్తిగా చుట్టేయడం
మమ్మీల తయారీలో శరీర తేమను తొలగించడంతో పాటు పరిమళ ద్రవ్యాల పూతను తయారు చేయడం కూడా చాలా కీలకమని డా.బక్లీ చెప్పారు.
‘ఈజిప్షియన్లు పునర్జన్మలను నమ్ముతారు. మరణం తరవాత ఆత్మ ఉండటానికి ఓ దేహం కావాలని వాళ్లు భావిస్తారు. అందుకే చనిపోయిన తరువాత కూడా మమ్మీల రూపంలో శరీరాన్ని భద్రపరచడానికి ప్రయత్నించేవారు’ అంటారు బక్లీ.
ఇవి కూడా చదవండి
- బ్యాగరి మహిళలు: శవాల మధ్య బతుకు పోరాటం
- కేరళ వరదలు: ఈ పెను విపత్తుకు కారణాలేమిటి?
- కొరియా కుటుంబాలు: 60 ఏళ్ల కిందట యుద్ధంతో విడిపోయారు.. ఇప్పుడు కలుస్తున్నారు
- ‘ఇండియాలోని భారతీయులకంటే బ్రిటన్లోని భారతీయులే సంప్రదాయబద్ధంగా జీవిస్తున్నారు’
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








