కేరళ: నన్ రేప్ కేసులో మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్ను నిర్దోషిగా ప్రకటించిన కొట్టాయం కోర్టు

- రచయిత, అరవింద్ చాబ్రా, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఒక క్రైస్తవ సన్యాసినిని పదే పదే రేప్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్ను కేరళలోని కొట్టాయం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
కోర్టు తీర్పు సమయంలో ఫ్రాంకో దుఃఖిస్తూ కనిపించారు. ఆయన తన లాయర్లను ఆలింగనం చేసుకున్నారు. "దేవుడిని ప్రార్థించండి. అందరికీ ధన్యవాదాలు" అని అన్నారు.
ఈ కేసును 105 రోజుల పాటు విచారించిన కోర్టు శుక్రవారం నాడు తీర్పును ప్రకటించింది. అత్యాచారంతో సహా అన్ని రకాల అభియోగాల నుంచి కోర్టు ఆయనను విముక్తం చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"ఫ్రాంకో ములక్కల్ మీదున్న అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది" అని కొట్టాయం అడిషనల్ సెషన్స్ జడ్జి (ఏఎస్జె) జి. గోపకుమార్ తన తీర్పులో వ్యాఖ్యానించారు. ఈ అత్యాచారం అభియోగాల నుంచి బిషప్ ఫ్రాంకో ములక్కల్ను నిర్దోషిగా ప్రకటించారు.

అసలేం జరిగింది...
కేరళకు చెందిన ఫ్రాంకో ములక్కల్ అనే బిషప్ తనను లైంగికంగా వేధించారని ఒక నన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 మే నుంచి 2016 సెప్టెంబరు మధ్య అనేకసార్లు బిషప్ తనను లైంగికంగా వేధించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కానీ, బిషప్ ఫ్రాంకో ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ‘అవి ఒట్టి అబద్దాలు, కట్టు కథలు. ఫిర్యాదు చేసిన మహిళ చిన్న పిల్ల కాదు. అన్ని రోజులు పాటు వేధిస్తుంటే ఆమె చూస్తూ ఎలా ఉంటారు?’ అని బీబీసీతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
పంజాబ్లోని జలంధర్ డైసిస్కు ఆయన బిషప్గా ఉన్నారు. చర్చిల్లో బిషప్ది చాలా ఉన్నత స్థానం. దేశంలో మొత్తం 144 డైసిస్లకు గాను 145 మంది బిషప్లు ఉన్నారు.
ఆ నన్పైన ఉన్న వేరే ఫిర్యాదుపై తాను విచారణ చేస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని బిషప్ ఫ్రాంకో పేర్కొన్నారు.
మరోపక్క ఈ కేసు విషయంలో పోలీసులు స్పందించట్లేదని ఆరోపిస్తూ కేరళలో కొందరు నన్స్ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి క్యాథలిక్ లాటిన్ చర్చితో పాటు స్థానికులు కూడా మద్దతు తెలుపుతున్నారు. కానీ, జలంధర్కు చెందిన ‘మిషనరీస్ ఆఫ్ జీసస్’ ఆ నన్స్ను నిరసనల్లో పాల్గొనద్దని కోరింది.

పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు బిషప్ ఫ్రాంకో తనను రేప్ చేశారని ఆరోపిస్తూ ఆ నన్ చర్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ తనను పట్టించుకోలేదని ఆమె చెప్పారు.
బహిరంగంగా నిరసనలు ప్రారంభించడానికి ముందు ఆమె ఈ ఏడాది జనవరి, జూన్, సెప్టెంబర్ నెలల్లో దిల్లీలోని పోప్ ప్రతినిధులకు లేఖ రాసినట్లు వివరించారు.
పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ జార్జ్ జోసెఫ్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ‘బిషప్ను వెంటనే అరెస్టు చేయాలి. హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి. ఆ బిషప్ దేశం వదిలి వెళ్లకుండా చూడాలి’ అని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. తాము నిందితుడి విషయంలో ఆధారాలు సేకరించామని, కానీ ఈ కేసులో ఆచితూచి అడుగేయమని కోర్టు తమకు సూచించిందని పోలీసులు కేరళ హైకోర్టుకు తెలిపారు.

మరోపక్క బిషప్ మాట్లాడుతూ... ‘ఆ నన్కు మరో వ్యక్తితో సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపైన నేను విచారణ జరుపుతున్నా. తన కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఆమె అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ... ‘బాధితురాలిపై చేస్తున్న అసత్య ఆరోపణలు ఇవి. ఒకవేళ తన కుటుంబ జీవితం బాలేకపోతే, ఆమె ఇంకా ఎందుకు కుటుంబంతోనే ఉంటుంది?’ అని కేరళలో నిరసనలకు నాయకత్వం వహిస్తున్న అనుపమ చెప్పారు
‘నిందితుడిని పోలీసులు అరెస్టు చేయక తప్పదు. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కూడా బిషప్కు వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయని పోలీసులు పేర్కొన్నారు’ అని కేరళ హైకోర్టు మాజీ జడ్జి కేమల్ పాషా అభిప్రాయపడ్డారు.
బిషప్ ఫ్రాంకో సెప్టెంబర్ 19న పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోరుతూ కొట్టాయం పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేశారు.
చివరకు, 105 రోజుల విచారణ అనంతరం కొట్టాయం కోర్టు ఈ మాజీ బిషప్ను 2022 జనవరి 14న నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








