ఆసియా క్రీడల్లో భారత్: కబడ్డీలో గోల్డెన్ ఆశలు గల్లంతు.. ‘కెప్టెన్ అతివిశ్వాసమే కొంప ముంచింది’

కబడ్డీ

ఫొటో సోర్స్, EPA

చరిత్రలో తొలిసారి.. భారత్ పురుషుల కబడ్డీ జట్టు ఆసియా క్రీడల్లో ఫైనల్‌ చేరుకోకుండానే నిష్క్రమించింది.

సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్ చేతిలో ఓడిపోయింది.

దీంతో ఆసియా క్రీడల్లో అప్రతిహతంగా కొనసాగిన భారత్‌ విజయాలకు తొలిసారి బ్రేక్ పడింది.

భారత్‌తో పోల్చితే బలహీనంగా కన్పించిన ఇరాన్ చేతిలో ఓడిపోవడం క్రీడాభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

దేశీ క్రీడలో మొదటిసారి భారత జట్టు కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇంతకు మునుపటి వరకూ ఆసియా క్రీడల కబడ్డీ పోటీల్లో భారత్‌కు స్వర్ణం ఖాయమనుకునేవారు.

ఇరాన్ జట్టు అత్యంత ప్రతిభ కనబరచడంతో భారత్ తేలిపోయింది. చివరకు 18-27 తేడాతో ఓటమి పాలైంది.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఈ సందర్భంగా టీం ఇండియా కోచ్ రామ్ మెహర్ సింగ్ విలేఖర్లతో మాట్లాడుతూ.. ఈ రోజు తమ ప్లాన్ సరిగ్గా పని చేయలేదని, కొన్ని సమస్యలు కూడా ఎదురుకావడంతో క్రీడాకారులు అనుకున్న మేర రాణించలేకపోయారని చెప్పారు.

ఇరాన్ గత రెండు ఆసియా క్రీడల్లోనూ రన్నరప్‌గా నిలిచింది. ఈసారి ఫైనల్లో ఈ జట్టు దక్షిణ కొరియాతో తలపడనుంది. కొరియా గ్రూప్ స్టేజ్‌లో భారత్‌ను ఓడించింది.

మొదట 6-4తో భారత్ మెరుగ్గానే కనిపించినా.. చివరకు ఇరాన్ పుంజుకోవడంతో ఓటమి తప్పలేదు.

'కెప్టెన్ అతి విశ్వాసం కొంప ముంచింది'

కెప్టెన్ అజయ్ థాకూర్ అతి విశ్వాసమే కొంప ముంచిందని.. అందుకే చరిత్రలో తొలిసారి భారత జట్టు పైనల్‌కు చేరకుండానే తిరిగొస్తోందని కోచ్ రామ్ మెహర్ అన్నారు.

ఇప్పటి వరకు భారత్ ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచింది.

1990లో ఆసియా క్రీడలు మొదలైనప్పటి నుంచి భారత్ ఫైనల్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి.

''మేం కెప్టెన్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓడిపోయాం. గాయాలూ కొంత పాత్ర పోషించాయి. సూపర్ టాకిల్లోనూ సమస్యలు వచ్చాయి'' అని మెహెర్ చెప్పారు.

కెప్టెన్ థాకూర్ గాయపడటం కూడా భారత్‌ ఓటమికి కారణమైందని చెప్పారు.

'' ఇది ఘోరమైన ఓటమి. మేం అంగీకరించాల్సిందే. ఇరాన్ చాలా బాగా ఆడింది.'' అని అన్నారు.

గ్రూప్ దశలోనూ దక్షిణ కొరియా చేతిలో భారత్ ఓడిపోయింది.

మహిళల జట్టు

ఫొటో సోర్స్, SAI MEDIA / TWITTTER

''ఆ మ్యాచ్‌లో మా డిఫెన్స్ సరిగా పని చేయలేదు. ఈ రోజు మా డిఫెన్స్ బాగా పని చేసింది. కానీ ఫార్వర్డ్ లైన్ కలిసి రాలేదు'' అని మెహర్ తాజా ఓటమికి కారణాలను విశ్లేషించారు.

కాగా.. మహిళల జట్టు తైవాన్‌ను 27 -14తో ఓడించి వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరింది.

ఈ క్రీడల్లో ఇప్పటి వరకూ భారత్ 4 స్వర్ణాలు, 4 రజతాలు, 10 కాంస్య పతకాలు సాధించింది.

అయిదో రోజు భారత్ మొత్తం మూడు పతకాలను సాధించింది.

15 ఏళ్ల షర్దుల్ విహాన్ మెన్స్ డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో రజతం సాధించాడు.

టెన్నిస్ సింగిల్స్‌లో అంకితా రైనా కాంస్యం సాధించారు.

(ఆధారం: పీటీఐ)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

(ఆధారం పీటీఐ)