ఉగ్రవాద వ్యతిరేక తొలి భారతీయ మహిళా దళం

ఫొటో సోర్స్, Getty Images
ఇది భారత తొలి మహిళా SWAT (స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్) దళం. 36 మంది ఉన్న ఈ బృందం ఆగస్టు 15న స్వాంతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్రకోట వద్ద పహారా కాసింది.
ఈ బృందంలోని మహిళలందరూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారే. బుధవారం ఎర్రకోట వద్ద ఏకే-47 తుపాకీ, MP5 మెషీన్ గన్లు తదితర ఆయుధాలను పట్టుకుని కనిపించారు.
దిల్లీలో భద్రత చూడటం వీళ్ల బాధ్యత. ఇందుకోసం వీరికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), దిల్లీ పోలీసులు కఠోర శిక్షణ ఇచ్చారు.
ఉగ్రదాడులను ఎలా తిప్పికొట్టాలో కూడా వీళ్లకు నేర్పించారు.
"నేను ఇలా కమాండో అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. మా అన్నయ్య వద్దన్నారు. కానీ అమ్మాయిలూ అన్ని పనులు చేయగలరని నా నమ్మకం. అందుకే ఈ వృత్తిలోకి వచ్చాను. మొదటిసారి ఫైరింగ్ శబ్దం విన్నప్పుడు చాలా భయమేసింది. కొంతమంది అమ్మాయిలు ఏడ్చేశారు. నేను కూడా తొలిసారి ఫైరింగ్ చేసినప్పుడు భయపడ్డా. ఆ తరవాత నుంచి అంతా అలవాటైపోయింది. ఇక తుపాకీ పేల్చడానికి మేమెప్పుడూ భయపడం. ఆ పని చేయడానికే కదా మేమిక్కడికి వచ్చింది" అని అన్నారు సిక్కిం నుంచి వచ్చిన కమాండో దేవిక.

"చిన్నప్పుడు నేను బొమ్మ తుపాకీతో ఆడుకునేదాన్ని. ఇప్పుడు నా చేతిలో నిజమైన తుపాకీ ఉంది. తుపాకీని, బాంబులను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో నేర్పించారు. నేరస్థులతో ఎలా వ్యవహరించాలో చెప్పారు" అని అసోంకు చెందిన కాకులి బారువా వివరించారు.
ఇతర అమ్మాయిలు కూడా స్వాట్ కమాండోలు అయ్యేందుకు ముందుకు వస్తారని వీళ్లు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









