మూత్రపిండాలు: కిడ్నీ సమస్యలను గుర్తించడం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

ఫొటో సోర్స్, PETERSCHREIBER.MEDIA
- రచయిత, ప్రతిభా లక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
భారత్లో ప్రతి ఏడుగురిలో ఒకరు మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. గత రెండు దశాబ్దాలలో మూత్ర పిండాల సంబంధిత రోగులు రెట్టింపు అయ్యారు.
దేశంలో కిడ్నీ మార్పిడి అవసరమైన వారు రెండు లక్షలు ఉండగా, ప్రతి సంవత్సరం కేవలం 12 వేల మూత్ర పిండ మార్పిడులు అవుతున్నాయి. ఈ లెక్కలన్నీ మూత్ర పిండాల ఆరోగ్య సమస్య తీవ్రతను తెలియజేస్తాయి. అయితే ఈ కిడ్నీ వ్యాధి సమస్య తగ్గించడం కోసం, వ్యాధికి గల కారణాలు, తీవ్రత తగ్గించడానికి అవసరమైన అవగాహన గురించి ఇప్పుడు చూద్దాం.
కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణం అదుపులో లేని మధుమేహం. అది కాక, అధిక రక్తపోటు, కొన్ని సార్లు బీ.పీ తగ్గిపోవడం వల్ల, ఎన్నో ఇతర ఇన్ఫెక్షన్లు ( డెంగూ, మలేరియా, హెచ్ఐవీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు), మూత్ర పిండాల రాళ్లు, కొన్ని రకాల మందుల (నొప్పి తగ్గడానికి వాడే మాత్రలు, స్టెరాయిడ్ మాత్రలు, కొన్ని యాంటీబయాటిక్స్) వల్ల ఈ సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా, మోతాదు తెలియని వాళ్లు ఇచ్చే పసరు మందులు, చెట్ల మందుల వల్ల, కొన్ని సార్లు జన్యు పరమైన సమస్యల కారణంగా, లూపస్ (SLE) వంటి కొన్ని స్వయం ప్రతిరక్షక వ్యాధులు (మహిళల్లో అధికంగా) మూత్ర పిండాలు పాడవడానికి కారణం అవ్వవచ్చును.
కిడ్నీ సమస్యల లక్షణాలు ఏంటి?
లక్షణాలు అనేవి మొదట వ్యాధికి కారణాన్ని బట్టి ఉండవచ్చును. దీర్ఘ కాలిక జబ్బుల వల్ల మూత్ర పిండాలు పాడై ఉంటే, ముందుగా మొహం వాపు, తరవాత కాళ్లు, శరీరం అంతా వాపు రావొచ్చు. మూత్రం సరిగ్గా రాకపోవడం, నడిస్తే ఆయాసం రావడం, పడుకుంటే ఆయాసం రావడం సాధారణంగా ఉంటాయి.
ఒకవేళ మూత్ర పిండాలు దెబ్బ తినడానికి రాళ్లు కారణం అయితే, నడుములో నొప్పి, అక్కడి నుంచి గజ్జల్లోకి రావడం, చలి జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలతో ప్రారంభం అవ్వచ్చు.
ఇతర ఏవైనా ఇన్ఫెక్షన్ల వల్ల మూత్ర పిండాలు పాడై ఉంటే వాటికి సంబంధించిన వ్యాధి లక్షణాలు లేక నొప్పి మాత్రలు, స్టెరాయిడ్ వంటి మందులు అధికంగా వాడటం వల్ల జరిగి ఉంటే, రోగికి వాపులు ఏమీ లేకుండా, మూత్రం మామూలుగానే వస్తూ, ఏకంగా ఆయాసంతో రోగి వైద్యులను సంప్రదించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Science Photo Library
పర్యవసానాలు ఎలా ఉంటాయి?
ఒంట్లో రక్త కణాలు తయారవ్వడానికి అవసరమైన ఒక ముఖ్యమైన హార్మోన్ (ఎరిథ్రోపోయిటిన్) మూత్ర పిండాలలో ఉత్పత్తి అవుతుంది. అందుకే మూత్ర పిండాలు పాడైన వారికి హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది. దానితో రక్తహీనత, అందువల్ల ఆయాసం, నీరసం, అలసట వంటి లక్షణాలు కలగవచ్చు.
అలాగే మన శరీరంలోని కండరాలు, ఎముకలు బలంగా ఉండటానికి ఎంతో అవసరమైన విటమిన్ డి మొదలగునవి మూత్రపిండాలలో ఉత్పత్తి అవుతాయి. అందుకే విటమిన్ డి తగ్గిపోవడం వల్ల కలిగే నీరసం, ఒళ్లు నొప్పులు అలసట వంటివి మూత్ర పిండాల వ్యాధిగ్రస్తుల్లో సర్వ సాధారణం.
మూత్రపిండాలు మన రక్తపోటును నియంత్రించే ముఖ్యమైన అవయవాలు. కాబట్టి, మూత్రపిండాల సమస్య ఉన్న వాళ్లకు రక్తపోటు అదుపులో ఉండకపోయే ప్రమాదం ఉంది. అధిక శాతం వారు అనేక రకాల మందులు వాడవలసిన అవసరం ఉంటుంది. అయినా అప్పుడప్పుడు బీపీ హెచ్చు తగ్గులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
మూత్రం తగ్గి, ఒంట్లో అధిక నీరు చేరి పోవడం వల్ల, గుండె పైన ఒత్తిడి పెరిగి, అది సరిగ్గా పని చేయలేకపోవడం, దానితో గుండె వాపు, ఆయాసం, ఊపిరితిత్తులలో నీరు చేరడం, దానితో ఊపిరి అందక, అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.
రక్త ప్రసరణ బాగా అవ్వడానికైనా, రక్తం గడ్డ కట్టడానికైనా మూత్ర పిండాలు సరిగ్గా పని చేయడం ముఖ్యం. అందుకే వీరిలో గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ.

ఫొటో సోర్స్, Thinkstock
గుర్తించడం ఎలా ?
మూత్ర పిండాల సమస్యను తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులువవుతుంది.
కేవలం రెండు చిన్న, అతి తక్కువ ఖర్చుతో చేసే పరీక్షలతో గుర్తించవచ్చు (సీరం క్రియాటినిన్, యూరిన్ ప్రొటీన్/అల్బుమిన్ ఎక్రెషన్).
మూత్రంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, మూత్ర పరీక్షలో తెలిసే అవకాశం ఉంది.
దీర్ఘ కాలిక జబ్బులు అదుపులో ఉన్నాయా లేదా అని తెలియడానికి, సంబంధిత షుగర్ పరీక్షలు, కొవ్వు పరీక్షలు చేయవలసి ఉంటుంది.
కడుపు స్కాన్ చేయడం వల్ల, మూత్ర పిండాలు కుంచించుకు పోయి ఉన్నాయా అని, లేదా వాటిలోని రాళ్లను, వాపును, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని గుర్తించే అవకాశం ఉంది.
రక్తం ఉత్పత్తి సరిపడా అవుతుందా లేదా అని తెలిపే రక్త పరీక్ష, గుండె పని తీరును గుర్తించే గుండె స్కానింగ్, మొదలగు పరీక్షలు అవసరాన్ని బట్టి చేయించవలసి ఉంటుంది.

ఫొటో సోర్స్, CRICK INSTITUTE
కిడ్నీలను కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు
*ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకోవాలి.
*అధికంగా మాంసం తీసుకోకూడదు.
*ప్రతి రోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయాలి
*ఆహారంలో సగభాగం పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి.
*ధూమపానం మానేయాలి.
*నొప్పి గోళీలు, అనవసరంగా స్టెరాయిడ్స్ వాడకూడదు.
*రక్త పోటు, మధుమేహం ఉన్న వారు తరుచూ పరీక్ష చేసుకుంటూ, సరైన వైద్యుల నుంచి మందులు వాడాలి.
*రక్త హీనత, నీరసం, ఒళ్లు నొప్పులు, వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుల సలహా మీద పరీక్షలు చేయించుకోవాలి.
అయితే, మూత్ర పిండాల సమస్య వల్ల, ఆరోగ్య పరమైన ఇబ్బందులే కాక, ఆర్థిక పరంగానూ ఇబ్బంది పెట్టేదే. కిడ్నీ సమస్యలను గుర్తించడం ఆలస్యమైతే చికిత్స చాలా ఖర్చుతో కూడుకుంటుంది.
ఒకసారి డయాలిసిస్కి దాదాపు 2 వేల రూపాయలు. వారానికి మూడు సార్లు, ప్రతిసారి నాలుగు గంటలు, అదీ జీవితాంతం చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు డబ్బుతో పాటు, రోగితో మరొకరు కూడా తమ సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది.
ఒక సారి డయాలిసిస్ కి 150 లీటర్ల నీళ్లు ఖర్చవుతాయి. అందుకే ఇలాంటి ఒక సమస్య తీవ్రతను తగ్గించడం, ముందస్తుగా గుర్తించే అవగాహన పెంచడం, తగిన చికిత్స అందించడం చాలా అవసరం.
ముఖ్యంగా దీర్ఘ కాలిక జబ్బులతో బాధ పడుతున్న వారు, వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ వాటిని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం .
(రచయిత వైద్యురాలు. ఈ వ్యాసం నిర్దిష్టమైన సమస్య మీద స్థూలమైన అవగాహన కోసం మాత్రమే)
ఇవి కూడా చదవండి
- దిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత మీద ఈడీ ఆరోపణలు ఏమిటి?
- అన్ని వయసుల వారికీ గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్.. ముందే గుర్తించడం ఎలా?
- IWD2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఊదా రంగును ఎందుకు ధరిస్తారు...
- అక్కడ విడాకులను వేడుకగా జరుపుకుంటారు
- Sexual Health: ‘‘వయాగ్రా తీసుకొని మద్యం తాగడంతో మరణించిన వ్యక్తి’’... అరుదైన కేసుగా వెల్లడి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














