కమలా హారిస్: ‘అన్నం, పెరుగు, పప్పు, ఇడ్లీ అన్నీ తిన్నాను. చిన్నప్పుడు చెన్నై వెళ్తే మా అమ్మమ్మ లేనప్పుడు తాతయ్య ఎగ్ టోస్ట్ చేద్దామనేవారు’

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్ రేసులో ముందుకొచ్చారు.
అభ్యర్థిత్వాన్ని వదులుకున్న బైడెన్ కూడా హారిస్కే తన మద్దతు తెలిపారు.
భారత సంతతికి చెందిన 59 ఏళ్ల కమలా హారిస్ 2020 ఎన్నికల సమయంలోనూ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించారు.
కమలా హారిస్ ఎవరు? ఆమె భారతీయ మూలాలు ఏమిటి? ఆమె ఎప్పుడైనా భారత్ వచ్చారా? ఆమె బాల్యం ఎలా సాగిందనేది 2020 ఎన్నికల సమయంలో ‘బీబీసీ ప్రతినిధి’ సౌతిక్ బిశ్వాస్ కథనం రాశారు. ఆమె తన ఆత్మకథలో రాసుకున్న విషయాలు, వివిధ ఇంటర్వ్యూలలో వెల్లడించిన అంశాలను ఆయన ప్రస్తావించారు.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని నల్లజాతి రాజకీయ నేతల్లో కమలా హారిస్ ప్రముఖురాలు. ఆమెకు భారత్ మూలాలు కూడా ఉన్నాయి. తన భారతీయ మూలాలపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తుంటారు.
కమల ఆత్మకథ ‘ద ట్రూత్స్ వి హోల్డ్’ పుస్తకం 2018లో విడుదలైంది.
అందులో ఆమె.. ‘నా పేరును కమలా అని పిలవాలి. పంక్చుయేషన్ కోసం ఉపయోగించే కామా ( , ) పలికినట్లు పలకాలి’’ అని రాశారు.
‘‘కమల అంటే తామర లేదా కమలం అని అర్థం. భారత సంస్కృతిలో దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. కమలం కొలనులో తేలియాడుతున్నట్లే కనిపిస్తుంది. కానీ, దాని వేళ్లు కొలను అడుగున బలంగా పాతుకుపోయి ఉంటాయి’’ అంటూ తన పేరు గురించి ఆ పుస్తకంలో వివరించారామె.
కమలా హారిస్ తల్లి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి జమైకాలో పుట్టారు.
కమలా హారిస్కు మాయా అనే చెల్లెలు కూడా ఉన్నారు. చిన్నప్పుడు వారి ఇంట్లో ఎప్పుడూ బ్లాక్ అమెరికన్ గాయకుల సంగీతం వినిపిస్తూ ఉండేది.
కమలా హారిస్ తండ్రి డోనల్డ్ హారిస్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్.
తల్లి శ్యామల గోపాలన్ క్యాన్సర్ పరిశోధకురాలు, పౌర హక్కుల కార్యకర్త.

ఫొటో సోర్స్, THE WASHINGTON POST VIA GETTY IMAGES
‘శ్యామల అండ్ ద గర్ల్స్’
కమలా హారిస్కు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే, ఆమె తల్లిదండ్రులు విడిపోయారు.
కమలా హారిస్, ఆమె చెల్లెలు మాయాలను వారి తల్లి ఒంటరిగానే పెంచారు.
ఆ ముగ్గురినీ కలిపి... వారికి తెలిసినవాళ్లు ‘శ్యామల అండ్ ద గర్ల్స్’ అని పిలిచేవాళ్లు.
కమలా హారిస్, మాయాలకు వారి తల్లి... వారి నేపథ్యాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవారు.
‘‘ఇద్దరు నల్ల జాతి అమ్మాయిలను పెంచుతున్నానని మా అమ్మ బాగా అర్థం చేసుకున్నారు. మాయాను, నన్ను తన కొత్త దేశం నల్ల జాతి అమ్మాయిలుగానే గుర్తిస్తుందని ఆమెకు తెలుసు. అందుకే, మాలో ఆత్మవిశ్వాసాన్ని ఆమె నూరిపోశారు’’ అని కమలా హారిస్ తన ఆత్మకథలో రాశారు.
‘‘కమలా హారిస్ భారత సంస్కృతిని ఆకళింపు చేసుకుంటూ పెరిగారు. కానీ, ఇప్పుడు ఓ ఆఫ్రికన్ అమెరికన్గా ఆమె సగర్వంగా జీవిస్తున్నారు’’ అని 2019లో వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం రాసింది.
2015లో సెనేట్కు కమలా హారిస్ పోటీ చేసినప్పుడు... ఆమెను ‘భారతీయ క్యాన్సర్ పరిశోధకురాలు, జమైకన్ ప్రొఫెసర్ల కూతురు’గా ఎకనమిస్ట్ మ్యాగజీన్ వర్ణించింది.
కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవి చేపట్టిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఏసియన్ అమెరికన్ కమలా హారిస్.
తన గుర్తింపు విషయంలో కమలా హారిస్ స్పష్టంగా ఉంటారు. తనను తాను కేవలం ‘ఓ అమెరికన్’గా ఆమె వర్ణించుకుంటారు.
అయితే, కమలా హారిస్ గురించి బాగా తెలిసినవాళ్లు... ఆమె రెండు వర్గాలకూ దగ్గరగా ఉంటారని చెప్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
‘చిన్నప్పుడు చెన్నై వెళ్లినప్పుడు ఏమైందంటే..’
కమలా హారిస్ 2020 ఎన్నికల సమయంలో అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించారు.
అప్పుడామె భారత సంతతి కమెడియన్ మిండీ కలింగ్తో కలిసి ఓ వంటల వీడియోలో కనిపించారు.
భారతీయ వంటకాన్ని వండుతూ, తమ దక్షిణ భారత నేపథ్యం గురించి ఆ వీడియోలో వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారు.
కమలా హారిస్ తన యూట్యూబ్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేశారు.
కమలా హారిస్ భారత నేపథ్యం గురించి ఇంకా చాలా మందికి తెలియదని, భారత సంతతి వాళ్లు ఆ విషయం గురించి తెలుసుకుని సంతోషపడుతున్నారని అప్పట్లో మిండీ ఆమెతో అన్నారు.
చిన్నప్పుడు దక్షిణాది వంటకాలు తిన్నారా అని కమలా హారిస్ను మిండీ ప్రశ్నించారు.
‘‘అన్నం, పెరుగు, ఆలుగడ్డ కూర, పప్పు, ఇడ్లీ’’ అంటూ చిన్నప్పుడు తాను ఇంట్లో తిన్న వంటల జాబితాను వివరించారు కమలా హారిస్.
‘‘నేను భారత్లో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్తుండేదాన్ని. మా అమ్మమ్మ శాకాహారి. ఆమె ఎక్కడికైనా వెళ్లినప్పుడు గుడ్లతో ఫ్రెంచ్ టోస్ట్ చేసుకుందామని మా తాతయ్య అడుగుతుండేవారు’’ అని కమలా హారిస్ చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.
తమ ఇంట్లో బిర్యానీ కూడా చేసుకునేవాళ్లమని కమలా హారిస్ తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
కమలా హారిస్ తల్లి దిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు
కమలా హారిస్ 2014లో డగ్లస్ ఎమ్హోఫ్ అనే న్యాయవాదిని పెళ్లాడారు. డగ్లస్ యూదుడు.
భారతీయ, యూదు సంప్రదాయలను అనుసరిస్తూ తమ వివాహం జరిగిందని కమలా హారిస్ తన పుస్తకంలో రాశారు.
కమలా హారిస్ను ఎక్కువగా నల్లజాతి అమెరికన్ రాజకీయ నేతగానే అక్కడివారు చూస్తుంటారు.
మరోవైపు భారతీయ అమెరికన్లు కూడా కమలా హారిస్ను తమలో ఒకరిగా చూసుకుంటున్నారు.
కమలా హారిస్పై ఆమె తల్లి శ్యామల గోపాలన్ ప్రభావం చాలా ఎక్కువ. చాలా సార్లు ఆమె ఈ విషయం గురించి మాట్లాడారు. తన తల్లిని కమలా స్ఫూర్తిగా భావిస్తారు.
శ్యామలకు నలుగురు తోబుట్టువులు. దిల్లీ యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారు. 19 ఏళ్ల వయసులోనే బెర్క్లీ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుని, చదువు కోసం 1958లో అమెరికాలో అడుగుపెట్టారు.
న్యూట్రిషన్, ఎండోక్రినాలజీలో డాక్టరేట్ చేసేందుకు వెళ్లిన శ్యామల... క్యాన్సర్ పరిశోధకురాలిగా మారారు.
‘‘ఆమెను అమెరికాకు పంపించడం మా అమ్మమ్మ, తాతయ్యలకు ఎంత కష్టమైన విషయమో నాకు తెలుసు. కమర్షియల్ జెట్ ప్రయాణాలు అప్పుడప్పుడే మొదలయ్యాయి. వాళ్లతో కాంటాక్ట్లో ఉండటం కూడా అప్పట్లో కష్టమే. కాలిఫోర్నియా వెళ్తానని మా అమ్మ అడిగినప్పుడు, వాళ్లు అడ్డు చెప్పలేదు’’ అని కమలా హారిస్ అన్నారు.
‘‘చదువు పూర్తైపోగానే, భారత్కు తిరిగివచ్చి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని మా అమ్మ తన తల్లిదండ్రులకు మాట ఇచ్చింది. కానీ, ఆమె తలరాత మరోలా ఉంది’’ అని వివరించారు.

ఫొటో సోర్స్, HARRIS FAMILY
భారత్లో కమలా హారిస్ కుటుంబ నేపథ్యం ఇదీ..
బెర్క్లీలో చదువుతున్నప్పుడు పౌర హక్కుల ఉద్యమంలో శ్యామల పాల్గొన్నారు. అక్కడే డోనల్డ్ హారిస్ ఆమెకు పరిచయమయ్యారు.
‘‘ఆమె పెళ్లి గురించి, అమెరికాలో ఉండిపోవాలని తీసుకున్ననిర్ణయం... ఆమె దృఢ సంకల్పానికి, ప్రేమకు నిదర్శనం’’ అని కమలా హారిస్ తన పుస్తకంలో రాశారు.
1964లో శ్యామల తన డాక్టరేట్ పూర్తి చేశారు. ఆ ఏడాదే కమలా హారిస్ పుట్టారు.
భారత్లో శ్యామల కుటుంబంలోనూ రాజకీయ వాతావరణం ఉండేది.
కమలా హారిస్ అమ్మమ్మ పెద్దగా చదువుకోలేదు. కానీ, గృహ హింస, కుటుంబ నియంత్రణ గురించి ఇతరులకు ఆమె అవగాహన కల్పించేవారు.
కమలా హారిస్ తాతయ్య భారత ప్రభుత్వంలో సీనియర్ దౌత్యవేత్త. ఆయన జాంబియాలో పనిచేశారు. ఆ దేశానికి స్వతంత్రం వచ్చాక, శరణార్థులకు పునరావాసం కల్పించేందుకు ఆయన కృషి చేశారు.
కమలా హారిస్ తన పుస్తకంలో తన భారత పర్యటనల గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు.
తన మేనమామకు, చిన్నమ్మలతో తనకు సాన్నిహిత్యం ఉండేదని... ఫోన్ కాల్స్, లేఖలు, అప్పుడప్పుడు పర్యటనలతో వారితో టచ్లో ఉండేదాన్నని కమలా హారిస్ రాశారు.
కమలా హారిస్ తల్లి శ్యామల 2009లో చనిపోయారు. అప్పటికి ఆమె వయసు 70 ఏళ్లు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














