బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు విజేత మనుభాకర్

మనుభాకర్
ఫొటో క్యాప్షన్, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు విజేత మనుభాకర్

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డును ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్‌ గెలుచుకున్నారు. ప్రజలు తమ అభిమాన క్రీడాకారిణికి ఓట్లేసి గెలిపించడంతో ఆమెను ఈ అవార్డు వరించింది.

2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి, ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా మనుభాకర్ రికార్డు నెలకొల్పారు.

బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును 2004 నుంచి 2022 వరకు భారత మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మిథాలీరాజ్‌ అందుకున్నారు.

బీబీసీ చేంజ్ మేకర్ 2024 అవార్డును చెస్ ప్లేయర్ తానియా సచ్‌దేవ్, ఖొఖో ప్లేయర్ నస్రీన్ షేక్, బీబీసీ స్టార్ పెర్‌ఫార్మర్ 2024 అవార్డు అథ్లెట్ ప్రీతిపాల్, తులసిమతి మురుగేశన్ దక్కించుకున్నారు.

భారత్ తరఫున పారాలింపిక్స్‌లో మెడల్ సాధించిన అతిపిన్న వయస్కురాలిగా నిలిచిన 18 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి 'బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు'ను గెలుచుకున్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆప్ ద ఇయర్ 2024 అవార్డుకు గోల్ఫర్ అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవని లేఖరా, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌లు నామినీలుగా ఎంపికయ్యారు.

ఈ ఐదో ఎడిషన్ అవార్డు నామినీల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టులు, రచయితలు, నిపుణులతో కూడిన జ్యూరీ ప్యానల్ 2025 జనవరిలో ఐదుగురు ప్లేయర్లను నామినీలుగా ఎంపిక చేసింది.

ఆ తరువాత ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయించడానికి ఆడియన్స్‌కు అవకాశాన్నిచ్చారు. రెండు వారాలపాటు సాగిన ఈ ఓటింగ్‌లో అభిమానులు తమకు నచ్చిన క్రీడాకారిణికి ఓటు వేశారు.

2024లో భారత క్రీడాకారిణుల ప్రతిభ, కృషి, వారు సాధించిన విజయాలకు గుర్తుగా ఈ అవార్డును బీబీసీ అందిస్తోంది. దేశంలో మహిళలు క్రీడల్లో సాధించిన విజయాలను ఇది గౌరవిస్తుంది.

ప్లేయర్లు చాంపియన్లుగా ఎదగడంలో వెన్నంటి నిలిచిన వ్యక్తులు, వారు అందించిన సహకారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో 'చాంపియన్స్ చాంపియన్' అనే థీమ్‌తో ఈ ఏడాది ఎడిషన్ జరుగుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రాష్ట్రపతి రాసిన లేఖ

రాష్ట్రపతి అభినందనలు

ఈ మేరకు ఆమె తన సందేశాన్ని పంపించారు.

క్రీడలలో మహిళల విజయాలను హైలైట్ చేయడానికి బీబీసీ తన నిబద్ధతను చాటుతోందని రాష్ట్రపతి తన లేఖలో పేర్కొన్నారు.

కబడ్డీ చాంపియన్స్‌‌
ఫొటో క్యాప్షన్, కాలేజీ టీచర్ల ప్రోత్సాహంతో కబడ్డీ చాంపియన్స్‌‌గా మారిన మారుమూల గ్రామానికి చెందిన బాలికలపై స్టోరీ చేశాం.

ప్రత్యేక కథనాలు

దృష్టిలోపం కలిగిన అథ్లెట్స్‌పై బీబీసీ ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించింది. ఇది గైడ్ రన్నర్స్ పాత్ర, అంధులకు వనరుల కొరత సమస్యను హైలైట్ చేసింది.

ఈ అవార్డు ప్రక్రియలో భాగంగా చేసిన ప్రత్యేక కవరేజీలో... కాలేజీ టీచర్ల ప్రోత్సాహంతో కబడ్డీ చాంపియన్స్‌‌గా మారిన మహారాష్ట్రలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన బాలికలపై స్టోరీ చేశాం.

ప్రభుత్వ, ప్రైవేట్ స్పాన్సర్ల మద్దతు, నిధులతో భారత్‌లో క్రీడలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. అంతర్జాతీయ పోటీల్లో పెరుగుతున్న పతకాల సంఖ్యే దీనికి నిదర్శనం. కానీ, ఇందులో క్రీడాకారిణుల భాగస్వామ్యం తక్కువగా ఉంది.

పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజతం సాధించారు.

గత ఎడిషన్ల విజేతలు వీరే..

భారత్‌లోని మహిళా అథ్లెట్లు సాధించిన విజయాలను వేడుకగా చేయడంతోపాటు వారికి తగిన గౌరవం ఇవ్వాలనే లక్ష్యంతో 2019లో ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY) మొదలైంది.

జ్యూరీ ఎంపిక చేసిన మరో ముగ్గురు క్రీడాకారిణులను కూడా బీబీసీ సోమవారం జరిగే కార్యక్రమంలో సత్కరించనుంది.

యువ అథ్లెట్ సాధించిన విజయాలకు ప్రతీకగా 'బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు, క్రీడల్లో అనుభవజ్ఞులైన క్రీడాకారిణులు చేసిన అసమాన కృషికి గుర్తుగా 'బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్' అవార్డు, పారా స్పోర్ట్స్‌లో చూపిన ప్రతిభను చాటిచెప్పేందుకు 'బీబీసీ పారా స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను బీబీసీ అందించనుంది.

ఈ అవార్డు కార్యక్రమాన్ని బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లు, బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఈ అవార్డుల మొదటి ఎడిషన్‌(2019)కు అప్పటి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

భవీనా పటేల్
ఫొటో క్యాప్షన్, 'బీబీసీ పారా స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్‌ - 2023 అందుకుంటున్న భవీనా పటేల్.

ఆ ఏడాది బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు 'బీబీసీ ఇండియన్ సోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'ను గెలుచుకున్నారు.

2020 ఎడిషన్‌లో వరల్డ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి విజేతగా నిలిచారు.

2021, 2022లో వరుసగా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' గెలుచుకున్నారు.

గత ఎడిషన్స్‌లో క్రికెటర్ షెఫాలీ వర్మ, షూటర్ మను భాకర్ 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను కైవసం చేసుకున్నారు.

అథ్లెట్లు పీటీ ఉష, అంజు బాబీ జార్జ్, వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి, హాకీ ప్లేయర్ ప్రీతమ్ శివాచ్‌ 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు' గెలుచుకున్నారు.

'డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్‌'కు ప్రాధాన్యమిస్తూ గతేడాది 2023 ఎడిషన్‌లో 'బీబీసీ ఇండియన్ పారా-స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా ప్రవేశపెట్టాం.

భారత టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ ఇందులో విజేతగా నిలిచారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)