చాంపియన్స్ ట్రోఫీ: పాకిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో భారత్ విజయం, కోహ్లీ అద్భుత సెంచరీ

ఇండియా, పాకిస్తాన్, చాంపియన్స్ ట్రోఫీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లీ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబయి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

విరాట్ కోహ్లీ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీతో పాటు శుభ్‌మన్ గిల్ (46 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (56 పరుగులు) రాణించారు.

242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 15 బంతుల్లో 20 పరుగులు చేసిన రోహిత్ శర్మను షాహీన్ అఫ్రీదీ ఔట్ చేశాడు.

ఆ తర్వాత కోహ్లీ, గిల్‌ల జోడీ ఇన్నింగ్స్ నిర్మించింది. ఈ ద్వయం రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించింది. గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయస్ కూడా బ్యాట్ ఝళిపించడంతో భారత్ టార్గెట్ దిశగా కదిలింది.

చివర్లో శ్రేయస్, హార్దిక్ ఔటైనా కోహ్లీ జట్టును (42.3 ఓవర్లలో) విజయతీరాలకు చేర్చాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

తడబడిన పాకిస్తాన్

అంతకుముందు, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఆచితూచి ఆడింది.

బాబర్ అజామ్, ఇమామ్ ఉల్ హక్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. అయితే, తొమ్మిదో ఓవర్లో హార్దిక్ పాండ్యా భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు.

హార్దిక్ బౌలింగ్‌లో బాబర్ (23) కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు.

మరుసటి ఓవర్లోనే అక్షర్ పటేల్ చక్కని త్రో విసిరి మరో ఓపెనర్ ఇమామ్‌ను రనౌట్‌గా పెవిలియన్ పంపాడు.

రిజ్వాన్, షకీల్

ఫొటో సోర్స్, Getty Images

రిజ్వాన్, షకీల్ పోరాటం

రెండు వికెట్లు పడిపోవడంతో కెప్టెన్ రిజ్వాన్, సౌద్ షకీల్ పాక్ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరూ 20 ఓవర్లకు పైగా మరో వికెట్ పడకుండా ఆడి, స్కోరు బోర్డుకు 104 పరుగులు జోడించారు.

అయితే, 34 ఓవర్లో రిజ్వాన్‌ (77 బంతుల్లో 46 పరుగులు)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే సౌద్ షకీల్‌ను హార్దిక్ ఔట్ చేయడంతో పాకిస్తాన్ కష్టాల్లో పడింది.

ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కోలేకపోయారు. చివర్లో కుష్‌దిల్ షా (39 బంతుల్లో 38 పరుగులు) రాణించడంతో పాకిస్తాన్ 241 పరుగులు చేయగలిగింది.

పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ అత్యధికంగా 62 పరుగులు చేశాడు.

హర్షిత్, కుల్దీప్ కట్టడి

ఫొటో సోర్స్, Getty Images

డెత్ ఓవర్లలో హర్షిత్, కుల్దీప్ కట్టడి

కాగా, డెత్ ఓవర్లలో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ చక్కని బౌలింగ్ చేశారు.

లో ఆఫ్ కట్టర్స్, స్లో బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించాడు హర్షిత్.

క్రీజులో హిట్టర్ కుష్‌దిల్ ఉన్నా హర్షిత్, కుల్దీప్‌లు అతనికి భారీ షాట్‌లు ఆడే అవకాశం ఇవ్వలేదు.

మొత్తంగా హర్షిత్, కుల్దీప్ వేసిన చివరి 6.4 ఓవర్లలో 28 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశారు.

భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు, హర్షిత్ ఒక వికెట్ తీశారు.

కోహ్లీ, రోహిత్

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ, రోహిత్ రికార్డులు..

ఈ మ్యాచ్‌లో కోహ్లీ రెండు రికార్డులు నెలకొల్పాడు. అతి తక్కువ వన్డే మ్యాచ్ (287) ఇన్నింగ్స్‌లలో 14 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

ఈ రికార్డు ఇంతకుముందు సచిన్ (350), కుమార సంగక్కర (378) పేరిట ఉంది.

ఇక ఇదే మ్యాచ్‌లో కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌(157)లు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మహేల జయవర్ధనే (218), రికీ పాంటింగ్(160) కోహ్లీ కంటే ముందున్నారు.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో 51వ సెంచరీని పూర్తి చేశాడు.

ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా (181 మ్యాచ్‌లలో) 9000 పరుగులు పూర్తి చేసిన ఓపెనర్‌గా నిలిచాడు.

ఇప్పటివరకూ 9 వేల పరుగులు పూర్తి చేసిన ఓపెనర్లు ఐదుగురు మాత్రమే. రోహిత్ కంటే ముందుగా సచిన్ (15310), సనత్ జయసూర్య (12740), క్రిస్ గేల్ (10179), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (9200), సౌరవ్ గంగూలీ (9146) ఉన్నారు.

రోహిత్ 181వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని సాధించగా, ఇంతకుముందు ఈ రికార్డు సచిన్ (197 ఇన్సింగ్స్) పేరిట ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)