ఎల్జీబీటీ: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాన్ని రద్దు చేసిన సింగపూర్

ఫొటో సోర్స్, BBC/TESSA WONG
- రచయిత, టెస్సా వాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సింగపూర్లో ఒకానొక సమయంలో కేవలం గే అన్న కారణంగా రసెల్ హెంగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
1980లలో ఇంటర్నెట్, డేటింగ్ యాప్స్ లేని కాలంలో సింగపూర్లోని ఎస్ప్లనేడ్ పార్క్ గే వ్యక్తులకు మీటింగ్ ప్లేస్గా ఉండేది. ఆ పార్క్ వద్దే రసెల్ హెంగ్ను అరెస్ట్ చేశారు.
సింగపూర్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించేవారు.
ఎస్ప్లనేడ్ పార్క్లో చెట్లు తమకు రక్షణ కవచంగా నిలుస్తూ, ఏకాంతానికి చోటిచ్చేవని రసెల్ హెంగ్ గుర్తుచేసుకున్నారు. 71 ఏళ్ల రసెల్ నాటక రచయిత, యాక్టివిస్ట్ కూడా.
"ఆ రోజు రాత్రి మేం సరదాగా షికారుకొచ్చాం. బిగ్గరగా ఒక గొంతు వినిపించింది. ఒక పోలీసు అధికారి మాపై అరవడం ప్రారంభించారు" అంటూ ఆనాటి చేదు అనుభవాలను రసెల్ వివరించారు.
"మమ్మల్ని వరుసగా నిలబెట్టి తీవ్రంగా దూషించడం మొదలుపెట్టారు. 'మీరు సిగ్గుపడాలి' అన్నారు. మేమ కేవలం పార్క్లో నడుస్తున్నాం. కానీ, ఆయన తిట్లకు మేమేదో తప్పు చేసిన భావన కలిగింది. నిజానికి అది బెదిరింపు" అని రసెల్ చెప్పారు.
సింగపూర్ ప్రభుత్వం ఎన్నో దశాబ్దాలుగా వివాదాస్పద 377ఏ చట్టాన్ని అమలుచేస్తోంది. ఇది బ్రిటిష్ పాలన నుంచి సంక్రమించిన చట్టం.
ఈ చట్ట ప్రకారం ఇద్దరు పురుషుల మధ్య స్వలింగ సంపర్కం నిషేధం. స్వలింగ సంపర్కం ఆమోదయోగ్యం కాదన్నది సింగపూర్ సమాజం అభిప్రాయమని, ఈ చట్టం దాన్ని ప్రతిబింబిస్తుందని అధికారులు ఏళ్ల తరబడి చెబుతూ వచ్చారు.
కానీ, గత వారం సింగపూర్ పార్లమెంట్ ఈ చట్టాన్ని రద్దు చేసింది. అంతకు కొన్ని నెలల క్రితం సింగపూర్ ప్రధానమంత్రి లీ షెన్ లోంగ్ ఈ చట్టాన్ని రద్దు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రజల ఆలోచాన సరళి, వైఖరి మారుతున్న కాలంలో దీన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇది సింగపూర్ ఎల్జీబీటీ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

ఫొటో సోర్స్, BBC/TESSA WONG
‘గే’పై నిఘా.. దాడులు
ఈ రద్దుకు ముందు వరకు పోలీసులు యాంటీ-గే దాడులు చేసేవారు. నైట్క్లబ్బులపై, బీచ్లు, పార్కులపై దాడి చేసి గే వ్యక్తులను అదుపులోకి తీసుకునేవారు.
పోలీసులు ఇందుకోసం ఒక రకమైన వల పన్నేవారు. గే వ్యక్తులు తరచుగా కలుకునే ప్రదేశాలలో పోలీసులు గే లాగ నిల్చునేవారు. స్నేహహస్తం చాస్తూ దగ్గరకు వచ్చినవారిని అరెస్ట్ చేసేవారు.
అరెస్ట్ చేసినవారిపై అసభ్యకర చర్యలకు పాల్పడ్డారని, నిర్లజ్జగా ప్రవర్తించారని అభియోగాలు మోపేవారు. వార్తాపత్రికలలో అరెస్ట్ అయిన వారి పేర్లు, వయసు, వృత్తి వివరాలను ప్రచురించేవారు.
చాలామందికి జరిమానా లేదా కొన్ని నెలల జైలు శిక్ష విధించేవారు.
1993లో 'ది ఫ్రంట్ రోడ్ ర్రైడ్' పేరుతో జరిగిన దాడిలో చాలామంది పురుషులను అరెస్ట్ చేశారు. వారికి కఠినమైన క్యానింగ్ శిక్ష విధించారు.
ఈ శిక్షను సవాలు చేస్తూ కోర్టులో కేసు వేశారు. వారిని అరెస్ట్ చేసి అభియోగాలు మోపడం "ఆందోళన కలిగించే విషయం" అని పేర్కొంటూ కోర్టు శిక్షను రద్దు చేసింది.
ఈ దాడులు, గే వ్యక్తులకు స్పష్టమైన సందేశాన్ని పంపాయి.
"ఎప్పుడూ భయపడుతూ ఉండేవాళ్లం. బయటికొస్తే మనపై నిఘా ఉంటుందన్న విషయం మనసులో మెదులుతూ ఉండేది" అని రసెల్ హెంగ్ చెప్పారు.
2000ల నాటికి ఈ దాడులు తగ్గుముఖం పట్టాయి. హోమోసెక్సువాలిటీపై బహిరంగంగా చర్చించడం మొదలుపెట్టారు.
2007లో 377ఏ చట్టంపై పార్లమెంట్లో పెద్ద చర్చ జరిగింది. ఆ సందర్భంగా సింగపూర్ ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయదుగానీ, అమలు చేయదని హామీ ఇచ్చింది.
క్రమక్రమంగా సింగపూర్ సమాజం ఎల్జీబీటీ వ్యక్తులను ఆమోదించడం మొదలుపెట్టింది.
అయితే, ఇప్పటికీ చాలామంది స్వలింగ సంపర్కం "తప్పు" అని అనుకుంటున్నప్పటికీ, గే హక్కులకు మద్దతు పెరుగుతోందని ఇటీవల ఒక సర్వేలో తేలింది.
సింగపూర్ ప్రభుత్వం ఎల్జీబీటీ సమూహానికి అనుకూలంగా సంస్థలు ఏర్పాటు చేయడం, వైవిధ్యాలను ప్రోత్సహించే విధానాలను అమలుచేయడం ప్రారంభించింది.
గతంలో గే వ్యక్తులు బయట కలిసినా నేరంగా పరిగణించే దేశంలో, క్రమంగా ఎల్జీబీటీ సమూహానికి మద్దతుగా ర్యాలీలు, సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఎల్జీబీటీ కార్యకర్తలకు విశేషంగా మద్దతు లభించింది. గే హక్కుల సంస్థలు ఉనికిలోకి వచ్చాయి.

ఫొటో సోర్స్, BBC/TESSA WONG
రసెల్ హెంగ్ సింగపూర్లో ఎప్పటి నుంచో ఉన్న ఎల్జీబీటీ సంఘం వ్యవస్థాపక సభ్యుడు. 1990లలో దీని రిజిస్ట్రేషన్ను రెండుసార్లు తిరస్కరించారు. తమ సంఘంపై పోలీసులు నిఘా పెట్టేవారని రసెల్ హెంగ్ చెప్పారు.
నేడు సింగపూర్లో టూరిస్టులకు గే చరిత్ర వివరించే గైడ్స్ ఉన్నారు. 34 ఏళ్ల ఐజాక్ టంగ్ తనతో వచ్చే టూరిస్టులకు ఈ చరిత్రను తప్పకుండా చెబుతారు. 19వ శతాబ్దంలో చైనా నుంచి వచ్చిన వలసదారులలో పురుషులు వ్యభిచారం వృత్తిలోకి దిగేవారని చెబుతూ, నగరంలో ఉన్న పాపులర్ గే మీటింగ్ ప్రదేశాలను చూపిస్తారు.
ఐజాక్ ప్రత్యేకంగా ఎల్జీబీటీ టూర్లు నిర్వహిస్తారు. ఇవి కేవలం ఆ దేశంలో ఎల్జీబీటీ చరిత్రని వివరించే టూర్లు.
సింగపూర్లో ప్రజలకు ముఖ్యంగా యువతకు "అమ్నీషియా" ఉందని గ్రహించానని, అందుకే ఎల్జీబీటీ టూర్లు నిర్వహిస్తున్నానని ఐజాక్ బీబీసీతో చెప్పారు. ఆయన నిర్వహించే టూర్లు స్వలింగ సంపర్కులను, స్ట్రెయిట్ ప్రజలు కూడా ఆకర్షిస్తుంటాయి.
"377ఏ చట్టం ఉండి, దాన్ని అమలు చేయకపోవడం వలన, గే హక్కుల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ, ఇటీవల కాలంలో ఈ చట్టం గురించి చర్చ, ఇప్పుడు దానికి రద్దు కారణంగా ప్రజలలో ఎల్జీబీటీ చరిత్ర పట్ల ఆసక్తి, కుతూహలం పెరిగాయి" అని ఐజాక్ చెప్పారు.
377ఏ రద్దుతో గే సమూహం పట్ల వ్యతిరేకత చరిత్రలో కలిసిపోయినప్పటికీ ఎల్జీబీటీ సమూహాలలో పూర్తిగా భయం పోలేదు. వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ, జాగ్రత్తగా ఉంటున్నారు.
అయితే, 377ఏ రద్దుతో పాటు సింగపూర్ ప్రభుత్వం మరో చిన్న మెలిక పెట్టింది. ప్రస్తుతానికి గే వివాహాలకు అనుమతి లేకుండా రాజ్యాంగంలో సవరణ తీసుకురావాలని యోచిస్తోంది.
"మిలిటెంట్ హోమోసెక్సువల్స్" పెరుగుతారని, మతపరమైన స్వేచ్ఛ పెరిగిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ వాదన అర్థరహితమని ఎల్జీబీటీ సముహం అంటోంది.
"377ఏ రద్దు చేసినప్పటికీ, ఈ అంశం మరింత సున్నితంగా మారిపోతుందని ఆందోళంగా ఉంది. ఈ నిర్ణయం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇది చాలాసేపటిగా బల్లపై ఉన్న కాఫీ కప్పులాంటిది. కాఫీ ఉందిగానీ చల్లారిపోయింది" అని హెంగ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నేవీ డే: ఐఎన్ఎస్ విక్రాంత్ను ధ్వంసం చేయాలని వచ్చిన పాకిస్తాన్ జలాంతర్గామి 'ఘాజీ' విశాఖపట్నంలో ఎలా జలసమాధి అయ్యింది?
- దిండి: కేరళను తలపించే ఈ కోనసీమ రిసార్ట్స్ ప్రత్యేకత ఏమిటి?
- భారత్, పాకిస్తాన్ యుద్ధం 1971 - ఘాజీ: విశాఖలో అప్పుడు రాత్రి పూట ఒక్క దీపం కూడా వెలగలేదు
- చెన్నై నుంచి 1,000 మొసళ్లను గుజరాత్లోని ముకేష్ అంబానీ జూకు ఎందుకు తరలిస్తున్నారు?
- పెళ్లి కాకుండా సెక్స్లో పాల్గొంటే ఏడాది జైలు శిక్ష... చట్టం తీసుకురానున్న ఇండోనేసియా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














