చైనా: 132 మందితో వెళ్తున్న ఆ విమానం ఎలా కుప్పకూలింది... సాంకేతిక లోపమా, విద్రోహ చర్యా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఫ్రాన్సెస్ మావో
- హోదా, బీబీసీ న్యూస్
చైనాలో ఒక పెద్ద నగరం నుంచి మరో నగరానికి ప్రయాణికులతో బయలుదేరిందా విమానం. ఎప్పటి లాగానే రెండు గంటల్లో గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంది. కానీ, బయలుదేరిన గంట తర్వాత ఆ విమానం అకస్మాత్తుగా అంతెత్తు నుంచి తలకిందులుగా కిందికి పడిపోవటం మొదలైంది. నిమిషానికి వేల అడుగులు పడిపోతూ ఓ కొండ ప్రాంతాన్ని ఢీకొట్టి పేలిపోయింది.
ఆ కూలిన విమానం చైనా ఈస్ట్రన్ ఫ్లైట్ ఎంయు5735. బోయింగ్ 737-800 రకానికి చెందిన విమానం. అలా కూలినపుడు విమానం ముక్కలుముక్కలైంది. ఘ్వాంఘ్జీ ప్రావిన్స్లోని వుఝో ప్రాంత పర్వతాల్లో గాలించినపుడు.. కాలిబుగ్గయిన విమాన శిథిలాలు, చెల్లాచెదురుగా పడిన ప్రయాణికుల వస్తువులు, మనుషుల మృతదేహాలు కనిపించాయి.
వారికి ఒక కీలకమైన వస్తువు కూడా దొరికింది. విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్సుల్లో ఒకటి. కాక్పిట్ వాయిస్ రికార్డర్ బయటివైపు దెబ్బతిన్నది. కానీ అందులోని రికార్డులు భద్రంగా ఉన్నాయి.
ఈ విమానం అకస్మాత్తుగా నేలకూలటానికి కారణమేమిటి అని విమానయాన నిపుణులు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ తమకు ఆ జవాబును అందిస్తుందని వారు ఆశిస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకూ మనకు తెలిసిన విషయాలివీ...
ఫ్లైట్ ఎంయూ-5735 కున్మింగ్ నుంచి సోమవారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:11 గంటలకు బయలుదేరింది. ఆ విమానం దాదాపు రెండు గంటలు ప్రయాణించి రెండు రాష్ట్రాలు దాటి మధ్యాహ్నం 03:05 గంటలకు ఘ్వాంఘ్జూ చేరుకోవాల్సి ఉంది. విమానంలో 123 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు.
విమానయాన రంగంలో సుదీర్ఘకాలంగా విశ్వసనీయమైన మోడల్గా పేరున్న బోయింగ్ 737-800 జెట్ విమానమది. ఈ విమానంలో ఎటువంటి లోపాలు కానీ, విమానం ఎగిరే పరిస్థితుల్లో ఎటువంటి ఆందోళనకరమైన అంశాలు కానీ, తమకు కనిపించలేదని విమానయాన సంస్థ, విమానయాన అధికారులు చెబుతున్నారు.
ఈ విమానానికి పూర్తిగా ఏడేళ్లు కూడా నిండలేదు. టేకాఫ్కు ముందు అది అన్ని పరీక్షలూ పాసయిందని సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (సీఏఏసీ) చెప్పింది.
గాలిలోకి ఎగిరిన తర్వాత కూడా ఈ విమానం సాధారణ విమాన మార్గంలో, 'ప్రమాదకరం కాని' వాతావరణం గుండానే ప్రయాణించిందని సీఏఏసీ విమాన దర్యాప్తు విభాగం అధిపతి మావో యాన్ఫెంగ్ పేర్కొన్నారు.
విమానం నిట్టనిలువునా కూలిపోవటం మొదలయ్యే వరకూ కూడా ఎయిర్ కంట్రోలర్స్ ఆ విమానంతో కాంటాక్టులోనే ఉన్నారు. ఆ తర్వాత అనేక అర్జెంట్ కాల్స్కి ఎలాంటి స్పందనా లభించలేదు.
విమానాల మార్గాలను ట్రాక్ చేసే ఫ్లైట్రాడార్24 వెబ్సైట్.. ఈ విమానం మామూలుగా 29,100 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు చూపింది. రెండు నిమిషాల 15 సెకన్ల తర్వాత విమానం 9,073 అడుగులకు పడిపోయింది.
ఈ విమానం నిమిషానికి 31,000 అడుగులు - అంటే సెకనుకు 157 మీటర్లు - గరిష్ట వేగంతో తలకిందులుగా కిందకు దిగినట్లు రాడార్ సమాచారం చూపుతోంది.
''ఇది అసాధారణమైన అధిక వేగం. మామూలుగా ఎలాంటి విమానంలోనూ ఇలాంటిది మనం చూడం. ఆ విమానం దాదాపు తలకిందులుగా నేలకు కూలివుంటుంది'' అని న్యూ సౌత్ వేల్స్కు చెందిన విమానయాన నిపుణులు డాక్టర్ సోన్యా బ్రౌన్.
నేలకు 7,000 నుంచి 8,000 అడుగుల ఎత్తులో విమానం స్వల్పంగా పై దిశకు మళ్లినట్లు రాడార్ సమాచారం చూపుతోంది.
కానీ ఆ వెంటనే అత్యధిక వేగంతో నేలకు కూలడం కొనసాగింది.

రెండు ప్రధాన సిద్ధాంతాలు...
''ఒక విమానం తన మార్గంలో మామూలుగా ప్రయాణిస్తూ అకస్మాత్తుగా ఇలా డైవ్ చేయటం అసాధారణమైన విషయం'' అంటారు డాక్టర్ బ్రౌన్. దీనికి కారణాన్ని నిర్ధారించటం కష్టమన్నారు. అయితే.. ''రెండు రకాల ఆలోచనలున్నాయి. అందులో ఏది సరైనదని ఈ దశలో నేను చెప్పలేను'' అని ఆమె పేర్కొన్నారు.
ఒకటి.. విమానాన్ని స్థిరంగా ఉంచి, అది కదులుతున్న దిశకు అనుగుణంగా సమాంతరంగా ఉంచే తోక ''దారుణంగా విఫలమవటం.''
అలా జరిగితే ఈ విమానం కూలిపోయినట్లుగా.. విమానం తలకిందులుగా నేలకూలటానికి దారితీయవచ్చు. ''అది యాంత్రికంగా జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రన్వే స్టెబిలైజర్ వంటిది'' అని డాక్టర్ బ్రౌన్ చెప్పారు.
నిపుణుల మనసును తొలిచేస్తున్న మరో అనుమానం... విద్రోహం. ''దురదృష్టవశాత్తూ విమానయాన రంగంలో ఇలాంటి దానిని మనం ఇంతకుముందు కూడా చూశాం'' అన్నారు డాక్టర్ బ్రౌన్.
ఆమె 2015లో జర్మన్వింగ్స్ ఫ్లైట్ 9525 కూలిపోయిన ఉదంతాన్ని ప్రస్తావించారు. అప్పుడు 150 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్బస్ విమానాన్ని దాని కో-పైలట్ ఫ్రాన్స్లోని ఆల్ప్స్ పర్వతాల్లో కూల్చివేశారు. ఆ దుర్ఘటనలో విమానంలో ఉన్న వారందరూ చనిపోయారు.
అయితే అప్పుడు ఆ విమానం నిమిషానికి 3,000 నుంచి 4,000 అడుగుల వేగంతోనే కూలిపోయిందని.. కానీ ఇప్పుడు చైనా విమానం 30,000 అడుగుల వేగంతో కూలిపోవటం గమానర్హమని డాక్టర్ బ్రౌన్ పేర్కొన్నారు. ''కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన భిన్నమైన పరిస్థితి'' అన్నారామె.
విమానాన్ని గాలిలో జారేలా డిజైన్ చేశారని ఆమె ఉంటంకించారు. ''అవి తలకిందులై, నేలకూలేలా డిజైన్ చేయలేదు. విమానంలోని ఇంజన్లన్నీ పాడైపోయినా కూడా విమానం వేగం కొంత తగ్గుతుంది కానీ అది గాలిలో జారుతూ ఉంటుంది'' అని వివరించారు.
''కాబట్టి యాంత్రిక వైఫల్యం కోణంలో చూస్తే.. సమాంతర తోక దగ్గర ఉండే పిచ్ కంట్రోల్ దగ్గరే ఉండాలి. విమానం దిశ తలకిందులుగా నిటారుగా ఉండేలా అక్కడేదో జరిగి ఉండాలి'' అని వ్యాఖ్యానించారు.
పైలట్ల గురించి ఏం తెలిసింది?
ఈ విమానంలో ముగ్గురు పైలట్లున్నారని చైనా ఈస్ట్రన్ అధికారులు బుధవారం వెల్లడించారు. వారిలో ఒకరు అనుభవం పెంచుకోవటం కోసం ఈ విమానంలో ఉన్నట్లు తెలిపారు. విమానం కెప్టెన్కు 6,709 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. ఫస్ట్ ఆఫీసర్కు 31,769 గంటల అనుభవం ఉంటే, సెకండ్ ఆఫీసర్కు 556 గంటల అనుభవం ఉంది.
''మాకు తెలిసినదాని ప్రకారం.. ఈ ముగ్గురు పైలట్ల పనితీరు బాగుంది. వారి కుటుంబ జీవితాలు కూడా సామరస్యంగా ఉన్నాయి'' అని విమానయాన సంస్థ అధికార ప్రతినిధి షాంగ్వాన్ షీమిన్ చెప్పారు.
విమానయాన రంగంలో ఆచరిస్తున్నట్లుగా.. తక్కువ దూరం ఉండే విమాన ప్రయాణాలకు సాధారణంగా ఇద్దరు పైలట్లును మాత్రమే పంపిస్తామని ఆయన నిర్ధారించారు.
చైనా మీడియా సంస్థలు గురువారం నాడు ఆ పైలట్ల పేర్లు, వారి కుటుంబ సభ్యుల పేర్లను రాయటం మొదలుపెట్టాయి. ఆ వివరాలను అధికారులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Reuters
బ్లాక్ బాక్సుల ద్వారా ఏం తెలియవచ్చు?
విమాన శిథిలాల్లో బుధవారం దొరికిన కాక్పిట్ వాయిస్ రికార్డర్ను బీజింగ్లోని లేబరేటరీకి పంపించారు అధికారులు. అక్కడ ఆ రికార్డర్లోని సమాచారాన్ని వేగంగా డీకోడ్ చేస్తారని ఆశిస్తున్నారు.
విమానం కూలిపోయిన తాకిడికి బ్లాక్ బాక్స్కు కొన్ని సొట్టలు పడ్డాయని, కానీ దాని లోపలి సమాచారం భద్రంగా ఉన్నట్లు కనిపిస్తోందని అధికారులు చెప్పారు.
''ఒకవేళ ఈ విమానాన్ని ఉద్దేశపూర్వకంగా నేలకూల్చినట్లయితే.. ఆ బ్లాక్ బాక్స్లోని సమాచారం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాక్పిట్లోని ప్రతి శబ్దాన్నీ అది రికార్డు చేస్తుంది. వాళ్లు ఏం చెప్తున్నారు? ఎవరైనా బలప్రయోగంతో కాక్పిట్లోకి ప్రవేశించారా? ఏవైనా అలారమ్లు మోగాయా? వంటివన్నీ రికార్డు అవుతాయి'' అని డాక్టర్ బ్రౌన్ వివరించారు.
ఫ్లైట్ డాటా రికార్డర్ అయిన మరో బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు. అందులో విమానం కంట్రోల్ సెట్టింగ్స్, ఎయిర్ డాటా వంటి మరింత సమాచారం ఉండాలి. యాంత్రిక సమస్యలేవైనా ఉంటే ఆ సమాచారం ద్వారా వెలుగుచూడవచ్చు.

ఫొటో సోర్స్, Reuters
ప్రస్తుతం ఏం జరుగుతోంది?
కూలిపోయిన బోయింగ్ విమానం అమెరికాలో తయారైనందున.. ఈ దుర్ఘటనపై దర్యాప్తులో పాలుపంచుకోవాలని అమెరికా విమానయాన రంగ నిపుణులను ఆహ్వానించారు చైనా దర్యాప్తు అధికారులు ఆహ్వానించారు.
ఇదిలావుంటే.. వుఝో వద్ద పర్వతసానువుల్లో విమానం కూలిన ప్రాంతాన్ని 600 మందికి పైగా కార్మికులు, వలంటీర్లు జల్లెడ పడుతున్నారు. వాతావరణం తడిగా ఉండటం, ఆ ప్రాంతాన్ని వరద ముంచెత్తటం వల్ల గాలింపు చర్యలు వేగంగా సాగటం లేదు.
ఘటనా స్థలంలో మనుషుల శరీర భాగాలు కనిపించాయి. ఎవరైనా ప్రాణాలతో ఉన్నట్లు కనిపించలేదు. కానీ మృతుల సంఖ్య ఎంత అనేది చైనా అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
''నష్టపోయిన'' 110 కుటుంబాలకు తాము సాయం అందిస్తున్నామని చైనా ఈస్ట్రన్ విమానయాన సంస్థ చెప్పింది.
ఈ వార్తతో ప్రయాణికులు బంధువులు హతాశులయ్యారు. విమానం కూలిన మరుసటి రోజునే.. అది కూలిన ప్రాంతానికి చేరుకున్నారు. కొందరు స్థానిక మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ఇంకొందరు ఆన్లైన్లో తమ ఆవేదనను పంచుకున్నారు.
ఈ నేపథ్యంలో చైనా అన్ని విమానాల భద్రతను సమీక్షించటానికి రెండు వారాల ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
చైనా ఈస్ట్రన్, దాని అనుబంధ సంస్థలు రెండు.. అత్యవసర ముందుజాగ్రత్త చర్యలో భాగంగా తమ దగ్గరున్న బోయింగ్ 737-800 రకం విమానాలను గాలిలోకి ఎగరకుండా నిలిపివేసింది.
ఇవి కూడా చదవండి:
- కేజీ చికెన్ 1000, ఒక్కో గుడ్డు 35.. కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 - ఈ పరిస్థితికి సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలే కారణమా?
- ఉత్తర కొరియా: విదేశీ వీడియోలు చూస్తే 15 ఏళ్ల జైలు శిక్ష.. సీడీలు, పెన్డ్రైవ్లతో దొరికితే మరణ శిక్ష
- రష్యా ఆయుధాల కొనుగోళ్ళను భారత్ ఎందుకు తగ్గించుకోలేకపోతోంది?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













