చెన్ చూసెన్: ఆ శాస్త్రవేత్తను అమెరికా బహిష్కరించింది.. అతడు చైనాను అంతరిక్షంలోకి తీసుకెళ్లాడు

ఫొటో సోర్స్, Getty Images
షాంఘైలో "పీపుల్స్ సైంటిస్ట్" గా పిలిచే చెన్ చూసెన్ అనే ఒకే వ్యక్తికి అంకితం చేసిన 70,000 కళాఖండాలతో కూడిన మ్యూజియం ఉంది.
చెన్ని చైనా క్షిపణి, అంతరిక్ష పితామహునిగా పిలుస్తారు. చైనా తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు కావల్సిన రాకెట్లను, చైనా అణ్వాయుధాగారంలో భాగమైన క్షిపణులను అభివృద్ధి చేయడానికి చెన్ చేసిన పరిశోధనలు ఉపయోగపడ్డాయి. ఆయనను చైనాలో జాతీయ హీరోగా కొనియాడారు.
కానీ ఆయన ఒక దశాబ్ధం పాటు చదువుకుని, పని చేసిన మరో దేశంలో ఆయన సేవలను ఎవరూ కనీసం గుర్తు కూడా చేసుకోరు. చెన్ 1911లో జన్మించారు. చైనా చివరి సామ్రాజ్య రాజ వంశం అంతమై రిపబ్లిక్గా అవతరిస్తున్న తరుణమది. ఆయన తల్లిదండ్రులిద్దరూ విద్యాధికులు. ఆయన తండ్రి జపాన్లో ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత చైనా జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు.
చెన్ చిన్న వయసు నుంచే ప్రతిభ కలిగి ఉండేవారు. ఆయన షాంఘై జియావ్ టోంగ్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యారు. ఆయనకు అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకునేందుకు గాను ఎవరికీ తేలికగా లభించని అరుదైన స్కాలర్ షిప్ లభించింది.
ఆయన 1935లో బోస్టన్ చేరారు. ఆ సమయంలో చెన్ జాత్యహంకారానికి, విదేశీయుల పట్ల ఆ దేశ ప్రజలు ప్రదర్శించే భయాన్ని ఎదుర్కొనే ఉండి ఉండవచ్చు అని నార్త్ జార్జియా యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ క్రిస్ జెస్పెర్సన్ చెప్పారు. కానీ, చైనా సైద్ధాంతికంగా మారుతుందనే ఆశ కూడా ఉండి ఉండవచ్చని ఆయన అన్నారు.
చెన్ అక్కడ నుంచి అప్పట్లో బాగా పేరు పొందిన ఏరోనాటికల్ ఇంజనీర్ థియోడోర్ వోన్ కర్మాన్ దగ్గర విద్యనభ్యసించడానికి కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) కు వెళ్లారు. అక్కడ చెన్కి మరో ప్రముఖ శాస్త్రవేత్త ఫ్రాంక్ మలీనాతో కలిసి పని చేసే అవకాశం కలిగింది. ఆయన సూసైడ్ స్క్వాడ్ గా పిలిచే ఒక చిన్న ఆవిష్కర్తల బృందంలో కీలకమైన సభ్యులుగా ఉండేవారు.
వాళ్ళు చదువుకునే క్యాంపస్లో ఒక రాకెట్ తయారు చేయడానికి ప్రయత్నించడం వలన ఆ బృందానికి ఆ పేరు వచ్చింది. "కొన్ని రకాల ప్రాణాంతకమైన రసాయనాలతో వారు చేసిన ప్రయోగాలు వారికి ఈ పేరును తెచ్చి పెట్టాయి" అని ఎస్కేప్ ఫ్రమ్ ఎర్త్: ఏ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది స్పేస్ రాకెట్ రచయత ఫ్రేజర్ మెక్ డోనల్డ్ చెప్పారు. అయితే, ఈ ప్రయోగాలలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ALAMY
ఆయన ఒక రోజు మలీనా సభ్యుల బృందంతో ఒక సంక్లిష్టమైన గణిత సమస్య గురించి చర్చలో పాల్గొనే నాటికే రాకెట్ ప్రొపల్షన్ గురించి ప్రాధమిక పరిశోధన జరుపుతున్నారు.
ఆ సమయంలో రాకెట్ సైన్స్ అంటే కొంత మంది పిచ్చి వాళ్ళు, ఊహా లోకంలో విహరించే వాళ్ళు చేసే పనిగా భావించేవారని మెక్ డోనల్డ్ చెప్పారు. "వాళ్ళని ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇందులో భవిష్యత్తు ఉందని చెప్పి వారి ప్రతిష్టను దిగజార్చుకోవడానికి ఏ ఇంజనీరు సమ్మతంగా ఉండే వారు కాదు. కానీ, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తీరుతో ఆ అభిప్రాయం మారిపోయింది" అని ఆయన అన్నారు.
ఈ సూసైడ్ స్క్వాడ్ బృందం అమెరికా మిలటరీ దృష్టిని ఆకర్షించింది. వారు విమానాల రెక్కలకు బూస్టర్లను జత చేసి చిన్న చిన్న రన్ వే ల మీద నుంచి జెట్ సహాయంతో ఎగరడానికి కావల్సిన పరిశోధన చేయడానికి నిధులు సమకూర్చారు. దీంతో కర్మన్ నాయకత్వంలో 1943లో జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ (జె పి ఎల్) ని ఏర్పాటు చేశారు. ఇందులో చెన్, ఫ్రాంక్ మలీనా ముఖ్య సభ్యులుగా ఉన్నారు.
చెన్ చైనా పౌరుడైనప్పటికీ అప్పటికి చైనా అమెరికాకి అనుబంధ దేశంగా ఉండటంతో అమెరికా అంతరిక్ష కార్యక్రమంలో ఆయన సభ్యుడిగా ఉండటం పట్ల పెద్దగా అనుమానాలు వ్యక్తం కాలేదు" అని మెక్ డోనల్డ్ చెప్పారు. ప్రత్యేకంగా వర్గీకరించిన కొన్ని ఆయుధాల పరిశోధన కోసం పని చేయడానికి చెన్ కి అవసరమయిన భద్రతాపరమైన అనుమతులు లభించాయి. ఆయన అమెరికా ప్రభుత్వ సైన్స్ అడ్వైజరీ బోర్డులో కూడా పని చేశారు.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ఆయన జెట్ ప్రొపల్షన్ లో ప్రపంచంలోనే ఒక ప్రముఖ నిపుణుడిగా నిలిచారు. ఆయనను థియోడోర్ వోన్ కర్మన్ తో కలిసి ఒక ప్రత్యేక ప్రాజెక్టులో పని చేయడానికి జర్మనీ పంపించారు. ఆయనకు లెఫ్టినెంట్ కలొనెల్ పదవిని ఇచ్చారు. వారు ఈ ప్రాజెక్టులో భాగంగా నాజి ఇంజనీర్లను, శాస్త్రవేత్తలను ఇంటర్వ్యూ చేయవలసి ఉంది. జర్మనీ దగ్గర దాగిన పరిజ్ఞానాన్ని అమెరికా తెలుసుకోవాలని అనుకుంది.

ఫొటో సోర్స్, Alamy
కానీ, ఆ దశాబ్దం చివరకు వచ్చేసరికి చెన్ ఉద్యోగ భవిష్యత్తు అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఆయన జీవితం మరోలా మలుపు తిరగడం ప్రారంభించింది.
"చైనాలో 1949లో కమ్యూనిస్ట్ ప్యూపిల్స్ రిపబ్లిక్ ని స్థాపిస్తున్నట్లు మావో ప్రకటించారు. దాంతో చైనా దేశస్థులందరినీ అమెరికాలో దుష్టులుగా చూడటం మొదలయింది" అని క్రిస్ జెస్పెర్సన్ చెప్పారు. అమెరికా మొదట్లో చైనా పట్ల ఆకర్షితమవ్వడం, అక్కడ ఏదైనా పరిణామం చోటు చేసుకోగానే ఆ దేశాన్ని దూషించడం లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తుతూనే ఉన్నాయి అని ఆయన అన్నారు.
అంతలో జె పి ఎల్ కి కొత్తగా వచ్చిన డైరెక్టర్ పరిశోధనశాలలో గూఢచర్యం జరుగుతుందనే అనుమానాన్ని ఎఫ్ బి ఐ కి వ్యక్తం చేశారు. గూఢచర్యం చేసేవారిలో చైనా దేశస్థులు కానీ, యూదులు కానీ అయి ఉంటారని ఆయన చెప్పినట్లు ఫ్రేజర్ మెక్ డోనల్డ్ చెప్పారు.
అప్పటికే ఇరు దేశాల మధ్య అంతర్యుద్ధం మొదలయ్యే దశ కనిపిస్తోంది. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మెక్ కార్తీ చేపట్టిన కార్యకలాపాలు కూడా అదే సమయంలో చోటు చేసుకోవడం ప్రారంభమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో చెన్, ఫ్రాంక్ మలీనా లాంటి వారు కమ్యూనిస్టులు కావడంతో వారి వలన దేశ భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందంటూ ఎఫ్ బి ఐ ఆరోపణలు చేసింది.
పసడేనా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన ఒక సమావేశానికి చెన్ హాజరైనట్లు అమెరికా కమ్యూనిస్ట్ పార్టీ 1938లో విడుదల చేసిన పత్రాన్నిఆధారం చేసుకుని ఎఫ్ బి ఐ ఈ ఆరోపణలు చేసింది. కానీ, చెన్ కి ఆ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. కానీ, అదే సమయంలో ఆయన ఆ పార్టీలో చేరినట్లు కొన్ని కొత్తగా చేసిన పరిశోధనలు చెబుతున్నాయి.
చెన్ కేవలం ఆ సమావేశానికి హాజరు కావడం వలన ఆయన పై మార్క్సిస్ట్ అనే ముద్ర వేయడానికి లేదు. ఆ సమయంలో ఒక కమ్యూనిస్ట్ గా ఉండటమంటే అది జాత్యహంకారానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడమే అని ఫ్రేజర్ మెక్ డోనల్డ్ అన్నారు. ఫాసిజంతో ఉన్న ముప్పును, అమెరికాలో నెలకొన్న జాత్యహంకారపు హింసను తెలియచేయటమే ఆ బృందం ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ఉదాహరణకు స్థానిక పసడేనా స్విమ్మింగ్ పూల్ వేరేగా ఏర్పాటు చేయాలనే చేస్తున్న ప్రచారం గురించి చర్చించడానికి వారు ఈ సమావేశాలను వేదికగా చేసుకున్నట్లు చెప్పారు.
చైనా కోసం చెన్ గూఢచర్యం చేసినట్లు కానీ, లేదా అమెరికాలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ ఏజెంటుగా పని చేసినట్లు గాని ఎటువంటి ఆధారాలు లేవని, కాలిఫోర్నియా యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ జ్యోయ్ వాంగ్ చెప్పారు.
కానీ, ఆయనకున్న ప్రత్యేక భద్రతా అనుమతులను తొలగించి ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. కాల్టెక్ లో కర్మన్ తో సహా ఆయనతో కలిసి పని చేసే సహోద్యోగులు చెన్ నిరపరాధి అని విన్నపాలు చేసినప్పటికీ అమెరికా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు.
చెన్ 5 సంవత్సరాల పాటు హౌస్ అరెస్ట్ లో ఉన్న తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ 1955లో ఆయనను అమెరికా నుంచి బహిష్కరించి చైనాకు పంపాలని నిర్ణయించుకున్నారు. ఆయన భార్య, అమెరికాలో పుట్టిన ఇద్దరు పిల్లలతో కలిసి బోటులో చైనాకు ప్రయాణమయ్యారు. ఆయన అక్కడ వేచి చూస్తున్న రిపోర్టర్లతో మళ్ళీ అమెరికా భూభాగం మీద కాలు పెట్టనని చెప్పారు. ఆయన చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఆయన అమెరికాలో ఒక ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన ఆ దేశానికి చాలా సేవలను అందించారు. మరింత అందించి కూడా ఉండే వారు. ఇది కేవలం ఆయనను అవమానించడం మాత్రమే కాదు. ఒక విధంగా ఆయనను మోసం చేయడం కూడా" అని టియాన్యు అనే జర్నలిస్ట్ అన్నారు.
చైనాలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయనను వెంటనే చైనా కమ్యూనిస్ట్ పార్టీలో చేర్చుకున్నారు. ఆయన చరిత్రలో మచ్చలు లేవని కాదు. ఆయన భార్య ఒక సంపన్న కుటుంబానికి చెందిన జాతీయ నాయకుని కూతురు. అమెరికాలో ఆయన పతనం మొదలయ్యేవరకు ఆయన ఉన్నతమైన జీవితాన్నిగడుపుతూ ఉండేవారు. అమెరికా పౌరసత్వానికి కూడా ఆయన దరఖాస్తు చేసుకున్నారు.
1958లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు అయిన నాటి నుంచీ పూర్తిగా పార్టీకి అనుకూలంగానే పని చేశారు. ఆయన మహోన్నతమైన కెరీర్ ని సొంతం చేసుకున్నారు.
ఆయన చైనాలో అడుగు పెట్టే నాటికి ఆయనకు రాకెట్ సైన్స్ గురించి పెద్దగా జ్ఞానం లేదు. కానీ, 15 సంవత్సరాల తర్వాత చైనా అంతరిక్షంలోకి తొలి సాటిలైట్ ప్రవేశపెట్టే పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఆయన కొన్ని దశాబ్దాల పాటు కొత్త తరం శాస్త్రవేత్తలు తయారయ్యేందుకు శిక్షణ ఇచ్చారు. ఆయన చేసిన పనులు చైనా తమ దేశస్థులను చంద్రుని పైకి పంపడానికి పునాదులు వేసింది.
అనుకోకుండా చైనా లో చెన్ అభివృద్ధి చేసిన క్షిపణి కార్యక్రమం ద్వారా తయారయిన ఆయుధాలు అమెరికా మీదే ప్రయోగించారు.
చెన్ తయారు చేసిన సిల్క్ వార్మ్ క్షిపణులను 1991 గల్ఫ్ వార్ లో అమెరికా మీద ప్రయోగించారు" అని ఫ్రేజర్ చెప్పారు. అలాగే 2016లో యెమెన్ లో హ్యూతి తిరుగుబాటుదారులు యుఎస్ఎస్ మాసన్ మీద అదే ఆయుధాలను ప్రయోగించారు.
ఇది అనుకోకుండా చుట్టు తిరిగిన పరిణామం. "ఆయన నిపుణతను అమెరికా బహిష్కరించింది. అదే వారిని కాటు వేయడానికి వెనక్కి వచ్చింది. స్థానికంగా ఉన్న కమ్యూనిజం పై వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ఒక వ్యక్తిని బహిష్కరించడం ద్వారా ఒక కమ్యూనిస్టు ప్రత్యర్థిగా ఉన్న దేశం ఆయుధాలు తయారు చేయడానికి, సొంత క్షిపణులను, అంతరిక్ష పరిశోధనలను అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇదొక భౌగోళిక రాజకీయ తప్పిదం" అని ఫ్రేజర్ అన్నారు.
"ఇది ఈ దేశం చేసిన అత్యంత పిచ్చి పని" అని మాజీ యుఎస్ నేవీ సెక్రటరీ డాన్ కిమ్బెల్ అన్నారు.
అయితే ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అయితే ఈ సారి అవి సైద్ధాంతిక పరమైనవి కాదు. ఈ సారి వాణిజ్యపరమైన, సాంకేతిక భద్రత, కోవిడ్ నియంత్రణలో చైనా వైఫల్యానికి సంబంధించిన ఉద్రిక్తతలు మొదలయ్యాయి.
అమెరికా అంతరిక్షకార్యక్రమంలో చెన్ పాత్ర గురించి చాలా మంది అమెరికన్లకు తెలియనప్పటికీ , ఇరు దేశాలలో చదువుకునే విద్యార్థులకు ఆయన గురించి తెలుసని టియాన్యు అంటారు.
చైనా అమెరికాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను చూస్తుంటే తిరిగి చెన్ కాలం నాటి ఆంక్షలు తమ పై విధిస్తారేమోననే భయాన్ని చాలా మంది విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, ALAMY
జ్ఞానాన్ని బహిష్కరిస్తే ఏమవుతుందో చెప్పడానికి చెన్ కథ ఒక హెచ్చరికగా నిలుస్తుందని, ఫ్రేజర్ అంటారు.
అనేక మంది విదేశీయుల పరిజ్ఞానంతో అభివృద్ధి చెందిన అమెరికా విజ్ఞానం గురించి ఈ సమయంలో సంబరంగా చెప్పుకోవడం కూడా కష్టంగానే అనిపిస్తుంది.
వెర్నహర్ లాంటి జర్మనీ శాస్త్రవేత్తల సేవల కంటే కూడా అమెరికా అంతరిక్ష కార్యక్రమానికి సేవలు అందించిన జె పి ఎల్ సేవలను బాగా నిర్లక్ష్యం చేశారని మెక్ డోనల్డ్ అంటారు. కర్మన్, చెన్ జర్మనీ వెళ్ళినప్పుడు బ్రౌన్, ఇతర శాస్త్రవేత్తలను కలిసిన వెంటనే వారిని అమెరికాకు రప్పించారు.
బ్రౌన్ కూడా నాజీ విధానాలను సమర్ధించే వ్యక్తే. కానీ, ఆయన సేవలను గుర్తించినట్లు చెన్, జెపిఎల్ లో ఇతర సభ్యుల సేవలను గుర్తించలేదు అని మెక్ డోనల్డ్ అన్నారు.
అమెరికా తొలి అంతరిక్ష ప్రయోగాలు ఆ భూభాగంలో పెరిగిన సోషలిస్టులు మొదలుపెట్టారనే విషయాన్ని వినడానికి అమెరికా సుముఖంగా లేదు.
చెన్ జీవితం ఒక శతాబ్ద కాలం పాటు విస్తరించింది. ఆ సమయంలో ఆర్ధికంగా చెరువులో ఒక చిన్న చేపగా ఉన్నచైనా భూమి మీద, అంతరిక్షంలోనూ కూడా శక్తివంతమైన ఒక సూపర్ పవర్ గా ఎదిగింది. ఆ పరివర్తనలో చెన్ కి కూడా భాగముంది. కానీ, ఆయన కథ అమెరికాలో కూడా గొప్పగా చెప్పుకోవలసిన కథ. ప్రతిభ ఎక్కడున్నా విస్తరించాల్సిందే.
గత సంవత్సరం చైనా చంద్రుని పై అడుగు పెట్టి చరిత్ర సృష్టించినప్పుడు ఆ మిషన్ కి చెన్ కి గురువుగా వ్యవహరించిన క్రేటర్ పేరును పెట్టింది. కమ్యూనిజం పట్ల అమెరికాకున్న వ్యతిరేకత చైనా అంతరిక్షంలోకి అడుగు పెట్టేందుకు సహాయపడిందని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: ఇండియాలో వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- సోషల్ మీడియా: అభ్యంతరకర ఫోటోలు కనిపిస్తే అమ్మాయిలు వెంటనే ఏం చేయాలి?
- డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రపంచాన్ని ఎలా మార్చేశారు?
- పాకిస్తాన్లో వంట గ్యాస్ అయిపోతోందా... డిమాండ్ పెరుగుతోంది, సరఫరా తగ్గుతోంది.. ఇప్పుడెలా?
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ఇండియాలో కరోనావైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- విజయనగర గజపతి రాజుల వ్యవహారాలు ఇప్పుడు ఎందుకు రచ్చకెక్కుతున్నాయి?
- కరోనా వైరస్: వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా ఆరు రోజుల్లోనే ఎలా నిర్మిస్తోంది?
- కరోనావైరస్: భారత మీడియా చైనాను ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? చైనా కుట్ర సిద్ధాంతంపై ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








