సౌదీ అరేబియా: ఇకపై బాల నేరస్థులకు ఉరి శిక్షలు ఉండవు

ఫొటో సోర్స్, Getty Images
మైనర్లుగా ఉన్నప్పుడు చేసిన నేరాలకు ఇకపై సౌదీ అరేబియా మరణశిక్ష విధించబోదని ఆ దేశ మానవ హక్కుల కమిషన్ తెలిపింది. సౌదీ రాజు సల్మాన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది.
కొరడా దెబ్బల శిక్ష విధించడాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు రెండు రోజుల క్రితం సౌదీ ప్రకటించింది.
బాలల హక్కుల అంశంపై ఐరాస ఒడంబడిక ప్రకారం మైనర్లుగా ఉన్నప్పుడు చేసిన నేరాలకు మరణ శిక్ష విధించకూడదు. దీనిపై సంతకం చేసిన దేశాల్లో సౌదీ కూడా ఉంది.
మానవ హక్కుల విషయంలో సౌదీ ప్రపంచంలోనే అత్యంత వెనుకబడి ఉన్న దేశాల్లో ఒకటని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు.
దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ తీవ్ర అణచివేతకు గురవుతోందని, ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లను నిరంకుశంగా అరెస్టు చేస్తుంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2019లో రికార్డు స్థాయిలో 189 మందికి సౌదీ అరేబియా మరణ శిక్షలు అమలు చేసిందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటోంది. మైనర్గా ఉండగా చేసిన నేరానికి మరణ శిక్ష పడ్డ కేసు వీటిలో కనీసం ఒక్కటైనా ఉందని తెలిపింది.
మైనర్లుగా ఉండగా చేసిన నేరాలకు మరణ శిక్షకు బదులుగా బాల నేరస్థుల నిర్బంధ కేంద్రంలో గరిష్ఠంగా పదేళ్ల పాటు ఉంచేలా మార్పులను తెస్తూ సౌదీ రాజు ఉత్తర్వు ఇచ్చారని ఆ దేశ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు అవాద్ అల్వాద్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ కమిషన్కు సౌదీ ప్రభుత్వ మద్దతు ఉంది.
సౌదీ శిక్షాస్మృతిని మరింత ఆధునికంగా మార్చేందుకు ఈ ఉత్తర్వు ఉపయోగపడుతుందని అల్వాద్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈ నిర్ణయం గురించి సౌదీ ప్రభుత్వ మీడియాలో వెంటనే వార్తలు రాలేదు. కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేదానిపైనా స్పష్టత లేదు.
సౌదీలో ఎంతో మంది మానవ హక్కుల కార్యకర్తలు, మహిళా హక్కుల కార్యకర్తలు జైళ్లలో మగ్గుతున్నారు. 2018లో జమాల్ ఖషోగ్జీ అనే జర్నలిస్ట్ ఇస్తాంబుల్లోని సౌదీ దౌత్య కార్యాలయంలో హత్యకు గురయ్యారు. ఈ ఉదంతం తర్వాత మానవ హక్కుల విషయమై సౌదీపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టడం ఎక్కువైంది.
గత వారం సౌదీలోని ప్రముఖ మానవహక్కుల కార్యకర్త ఒకరు జైల్లో పక్షవాతం వచ్చి మృతిచెందారు. అయితే, ఆ వ్యక్తి ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతోనే ఇలా జరిగిందని సహచర కార్యకర్తలు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా?
- ఆంధ్రప్రదేశ్: 'పంట బాగా పండినా, లాక్డౌన్ నాన్నను మాకు దూరం చేసింది'
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల లాక్డౌన్ సమయంలో తండ్రి అయిన ఒక కొడుకు కథ
- ‘రంజాన్ మాసంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి’ : మతపెద్దల మార్గదర్శకాలు
- కరోనావైరస్: లాక్డౌన్తో దేశంలో రోజూ ఎన్ని వేల కోట్ల నష్టం వస్తోంది? ఎన్ని ఉద్యోగాలు పోతాయి?
- ఏపీలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో ఏం జరుగుతోంది? డిశ్ఛార్జ్ అయిన వాళ్లు ఏం చెబుతున్నారు?
- కరోనావైరస్: రాయలసీమలో ఈ మహమ్మారి ఎలా వ్యాపిస్తోంది?
- కరోనావైరస్ లాక్ డౌన్: ఆంధ్రప్రదేశ్లో పడిపోయిన పాలు, పాల ఉత్పత్తుల విక్రయం... కష్టాల్లో పాడి రైతులు
- కరోనావైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలి... లాక్డౌన్ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి?
- కరోనావైరస్ను చైనాలోని ఓ ల్యాబ్లో తయారుచేశారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








