నానావతి కమిషన్: గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్... ‘హింస నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారు’

2010లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ముందు హాజరయ్యేందుకు వెళుతూ జర్నలిస్టులకు నమస్కారం చేస్తున్న నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

2002వ సంవత్సరంలో గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లపై నానావతి కమిషన్ ఇచ్చిన నివేదికను గుజరాత్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

గోధ్రా రైలు దుర్ఘటన అనంతరం చెలరేగిన ఘర్షణలు పథకం ప్రకారం వ్యవస్థీకృతంగా చేసినవి కాదని, వీటిని నియంత్రించడంలో పోలీసులు విఫలం అయ్యారని నానావతి కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

వెయ్యి మందికి పైగా మైనార్టీలు చనిపోయిన ఈ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, ఆయన క్యాబినెట్‌లోని మంత్రులకు నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చిందని ది హిందూ దినపత్రిక పేర్కొంది.

రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ జీటీ నానావతి, అక్షయ్ మెహతాలు తమ నివేదికను 2014లో అప్పటి ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు సమర్పించారు. ఐదేళ్ల తర్వాత రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రదీప్‌సింగ్ జడేజా దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

2002 ఫిబ్రవరి 27వ తేదీన గోధ్రా రైల్వే స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలులోని రెండు బోగీలకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ దుర్ఘటనలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న 59 మంది ‘కరసేవకులు’ చనిపోయారు.

తదనంతరం గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి.

ఈ అల్లర్లలో వెయ్యి మందికి పైగా మైనార్టీ వర్గానికి చెందిన వారు చనిపోయారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చాలామంది నిలదీశారు. దీంతో ఈ అల్లర్లపై దర్యాప్తు చేసి, నివేదిక ఇవ్వాలని 2002లోనే నానావతి కమిషన్‌ను నరేంద్ర మోదీ ఏర్పాటు చేశారు.

కాగా, అల్లర్లను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలనూ రాష్ట్ర యంత్రాంగం తీసుకుందని నానావతి కమిషన్ తన నివేదికలో పేర్కొంది.

అయితే, కొన్ని ప్రాంతాల్లో మూక దాడుల్ని, హింసను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపింది. పోలీసుల చొరవ చూపలేదని కూడా నిందించింది.

సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలు మంటల్లో చిక్కుకోవడం, 59 మంది కరసేవకులు మరణించడంపై 2009లోనే నానావతి కమిషన్ తన నివేదిక తొలి భాగాన్ని సమర్పించగా, రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

గోధ్రా రైలు దహనం తదనంతర అల్లర్లపై నానావతి కమిషన్ 2014 నవంబర్ 18వ తేదీన ఇచ్చిన నివేదికను మాత్రం ఐదేళ్ల పాటు బహిర్గతం చేయలేదు.

అయితే, ఈ నివేదికను బయటపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్‌బీ శ్రీకుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్పందిస్తూ.. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికను ప్రవేశపెడతామని హైకోర్టుకు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)