నరేంద్ర మోదీకి గేట్స్ ఫౌండేషన్ అవార్డు: మానవ హక్కుల కార్తకర్తల అభ్యంతరాలు

మోదీ

ఫొటో సోర్స్, PTI

భారత ప్రధాని అయ్యాక నరేంద్ర మోదీని అనేక అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. ఇప్పుడు మరో అవార్డు ఆయనకు దక్కబోతోంది.

బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఇటీవల మోదీకి 'గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు' ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే, దీని చుట్టూ వివాదం ముసురుకుంది.

కొందరు మానవహక్కుల కార్యకర్తలు మోదీకి ఈ పురస్కారం ఇస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టినందుకుగానూ మోదీకి గేట్స్ ఫౌండేషన్ ఈ అవార్డు ప్రకటించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ కార్యక్రమం కింద దేశంలో లక్షల సంఖ్యలో మరుగుదొడ్లు నిర్మించినట్లు, పరిశుభ్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించినట్లు భారత ప్రభుత్వం చెబుతోంది.

సెప్టెంబర్ 24న ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

అయితే, ఈ పురస్కారం గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయి.

1976లో నోబెల్ శాంతి బహుమతి పొందినవారిలో ఒకరైన మెయిరీడ్ మెగ్వైర్ కూడా మోదీకి అవార్డు ఇచ్చే విషయంలో పునరాలోచించుకోవాలని గేట్స్ ఫౌండేషన్‌కు లేఖ రాశారు.

ఎన్ఆర్‌సీ

ఫొటో సోర్స్, Getty Images

''మోదీ పాలనలో భారత్ ప్రమాదకర స్థితి, ఉపద్రవం వైపు నడుస్తోంది. మానవ హక్కులను, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారు. అసోం, కశ్మీర్‌లలో మానవహక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. ప్రజల జీవితాలను కాపాడేందుకు, సమానత్వం సాధించేందుకు కృషి చేస్తున్న గేట్స్ ఫౌండేషన్ మోదీకి పురస్కారం ప్రకటించడం మాకు ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పునరాలోచించుకోవాలి'' అని ఈ లేఖలో వ్యాఖ్యానించారు.

జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, ఆంక్షలు విధించిన ఈ సమయంలో పురస్కారం ఇవ్వడమేంటని గేట్స్ ఫౌండేషన్‌ను కొందరు ప్రశ్నిస్తున్నారు.

దక్షిణాసియా అమెరికన్లతో కూడిన ఓ సంఘం గేట్స్ ఫౌండేషన్‌కు ఓ బహిరంగ లేఖ రాసింది.

''నెల రోజులుగా జమ్మూకశ్మీర్‌లోని 80 లక్షల మంది ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. బయటి ప్రపంచంతో వారికి సంబంధాలు తెగిపోయాయి. మీడియాను అడ్డుకుంటున్నారు. చాలా మంది ప్రజలను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సమయంలో మోదీకి పురస్కారం ఇస్తే ఈ మానవహక్కుల ఉల్లంఘనల పట్ల అంతర్జాతీయ సమాజం మౌనం వహిస్తోందన్న సంకేతాలు వెళ్తాయి'' అని ఈ లేఖలో పేర్కొంది.

గేట్స్ ఫౌండేషన్

ఫొటో సోర్స్, Reuters

కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీకి దక్కిన పురస్కారాల్లో ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా ఒకటి. ''ప్రజాస్వామ్యానికి, ఆర్థిక వృద్ధికి పునరుజ్జీవనం పోసినందుకు'' దీన్ని ఆయన పొందారు.

'ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు చేసిన కృషికిగానూ' దక్షిణ కొరియా సియోల్ శాంతి పురస్కారం కూడా దక్కింది.

అయితే, నోట్ల రద్దు సహా మోదీ ప్రభుత్వం చేపట్టిన చాలా చర్యలను తప్పుపట్టినవారు ఈ పురస్కారాల గురించి కూడా విమర్శలు చేశారు.

గతేడాది ఐక్యరాజ్య సమితి మోదీకి 'ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్' పురస్కారం ప్రదానం చేసింది. గ్రీన్ లైట్ ప్రాజెక్టు ద్వారా మోదీ పెద్ద స్థాయిలో అడవులు నాశనమవ్వకుండా కాపాడారని పేర్కొంది.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్యనగరంగా దిల్లీ మారిన విషయాన్ని మాత్రం విస్మరించింది.

స్వచ్ఛ భారత్ కింద 90% భారతీయులకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించినట్లు భారత ప్రభుత్వం చెబుతోంది.

అయితే, ఇలా కట్టిన మరుగుదొడ్లలో చాలా వరకూ నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయని ''వేర్ ఇండియా గోస్'' అనే అధ్యయన పుస్తకం పేర్కొంది.

బిల్ గేట్స్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, బిల్ గేట్స్

బిల్ గేట్స్ ఏమన్నారు?

నరేంద్ర మోదీకి పురస్కారం ప్రకటించడం వెనుకున్న కారణాల గురించి బిల్ గేట్స్ 'హిందుస్తాన్ టైమ్స్' పత్రికకు ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

''స్వచ్ఛ భారత్‌కు ముందు భారత్‌లో 50 కోట్లకుపైగా ప్రజలకు మరుగుదొడ్లు లేవు. ఇప్పుడు వారిలో అధిక శాతం మందికి ఆ సదుపాయం లభించింది. ఇంకా చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. కానీ, మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రభావం భారత్‌పై చాలా ఉంది'' అని గేట్స్ అన్నారు.

పరిశుభ్రత విషయంలో ఎలా పనిచేయాలన్న దానిపై మిగతా దేశాలకు స్వచ్ఛ భారత్ ఒక ఉదాహరణగా పనిచేస్తుందని గేట్స్ ఫౌండేషన్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)