హువావే: ఈ చైనా ఫోన్ల తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద కంపెనీ ఎలా అయింది?

ఫొటో సోర్స్, AFP
మొబైల్ ఫోన్లతో హువావే పేరుగాంచింది. ఇటీవల ప్రపంచంలో రెండవ అతిపెద్ద సరఫరాదారుగా పేరు తెచ్చుకుంది. అలాగే, భారీ సమాచార వ్యవస్థ పరికరాలను కూడా ఈ చైనా దిగ్గజ కంపెనీ తయారు చేస్తోంది.
అయితే, అంతర్జాతీయ గూఢచార సంస్థలు, రోబొట్ ఆర్మ్స్ల దొంగతనం, నాశనం చేయలేని డైమండ్ కోటెడ్ గ్లాసులు, ఇరాన్తో అనుమానాస్పద ఒప్పందాలు తదితర అంశాలకు సంబంధించి ఈ కంపెనీపై అనేక ఆరోపణలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, PA
5జీ : సూపర్ స్పీడ్
మొబైల్ ఫోన్ల నెట్వర్క్లో మరో విప్లవంగా భావిస్తున్న 5 జీ సాంకేతికతను అందించేందుకు వివిధ దేశాలతో హువావే సంస్థ చర్చలు జరుపుతోంది. డ్రైవర్ రహిత కార్లతో సహా అనేక భారీ వ్యవస్థల్లో ఈ కొత్త సాంకేతికతను వినియోగించవచ్చు.
ఒక వేళ ఒక దేశానికి సంబంధించిన 5జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు హువావే వద్దే ఉంటే అది ఆ దేశంపై గూఢచర్యం చేయగలదని, నెట్వర్క్ను నిలిపివేయగలదని, దీని వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందని అమెరికా ఆరోపిస్తోంది.
ట్రంప్ ఆదేశాలకు ముందే హువావేపై ఆంక్షలు విధించాలని తన పాశ్చాత్య మిత్రదేశాలపై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చింది.
ముఖ్యంగా 'ఫైవ్ ఐస్' గ్రూప్ సభ్య దేశాలకు అమెరికా ఈ సూచన చేసింది. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ ఫైవ్ ఐస్ గ్రూప్ సభ్య దేశాలు. ఈ దేశాలలోని గూఢచార సంస్థల మధ్య చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని సైతం ఇచ్చిపుచ్చుకుంటాయి.
హువావే 5జీ నెట్వర్క్ వినియోగిస్తే.. ఇంగ్లిష్ వాడే ఏ దేశంతోనూ సమాచారం ఇచ్చిపుచ్చుకోకూడదని అమెరికా హెచ్చరించింది.
కీలమైన సమాచార వ్యవస్థలను హువావే 5జీ నెట్వర్క్ ద్వారా వాడే దేశాలతో తాము ఎలాంటి సమాచారాన్ని పంచుకోమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, తాము చైనా తరఫున ఎప్పుడూ గూఢచర్యం చేయలేదని హువావే సంస్థ పదే పదే తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తుంది. కానీ, చైనా ఇంటెలిజెన్స్ సంస్థకు సహాయం చేయకుండా ఏ కంపెనీ నిరాకరించకూడదని ఆ దేశ చట్టాలు చెబుతున్నాయని విమర్శకులు గుర్తు చేస్తున్నారు.
అలాగే, నిషేధం విధించడం వల్ల ''ఖరీదైన ప్రత్యామ్నాయాలను అమెరికా వెతుక్కోవాల్సి ఉంటుంది. 5జీ నెట్వర్క్ వినియోగంలో వెనకబడటం వల్ల దేశంలోని కంపెనీలు, వినియోదారుల ప్రయోజనాలకు కూడా హాని కలుగుతుంది'' అని అమెరికా వ్యాలెట్ కంపెనీలకు వారు సూచిస్తున్నారు.
అమెరికా గూఢచర్య సంస్థలు దేశంలోని గూగుల్, యాహూ తదితర పెద్ద కంపెనీలకు సంబంధించిన డాటాను ఎన్నో ఏళ్లుగా తస్కరిస్తున్నాయని అలాగే, ఎన్క్రిప్టెడ్ సాంకేతికతను కూడా పరిశీలించేందుకు ప్రయత్నించాయని ఎన్ఎస్ఏ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ బయట పెట్టిన విషయం తెలిసిందే.

ఫొటో సోర్స్, AFP
ఏమిటి రోబొట్ ఆర్మ్ కుంభకోణం
హువావే సంస్థ టీ మైబెల్కు చెందిన రోబొట్ ఆర్మ్(ఫోన్ స్క్రీన్ను నొక్కేందుకు ఉపయోగించే టెక్నాలజీ) సాంకేతికతను తస్కరించిందని ఆ సంస్థ ఇంజినీర్ ఒకరు ఆరోపించారు.
టీ- మొబైల్ డిజైన్ ప్రయోగశాల నుంచి అనుకోకుండా రోబోట్ ఆర్మ్ తన సంచిలో పడిపోయిందని ఆ ఉద్యోగి తెలిపారు.
అయితే, గతంలో హువావేతో భాగస్వామిగా ఉన్న టీ మొబైల్ సంస్థ ఈ వాదనను నమ్మలేదు. తర్వాత రెండు సంస్థలు కోర్టులో ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నాయి.
అయితే, దీనికి సంబంధించి తాజాగా మెయిల్స్ బయటపడటంతో చైనాలోని సీనియర్ అధికారి సూచన మేరకే ఆ ఇంజినీర్ సాంకేతికతను తస్కరించి ఉంటారనే అనుమానాలు వస్తున్నాయి.
ఈ కారణం వల్లే హువావే ముఖ్య ఆర్థికాధికారి మెంగ్ వాంగ్జోను అమెరికాకు అప్పగించేందుకు కెనడాలో గతేడాది అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్తో ఒప్పందాలు?
ఈ ఆరోపణలతో తనను అమెరికాకు అప్పగించడంపై మెంగ్ ఇంకా పోరాడుతున్నారు. ఇరాన్తో రహస్య ఒప్పందాలు చేసుకున్నారనే ఆరోపణలనూ ఆమె ఖండిస్తున్నారు.
స్కైకాం కంపెనీ ద్వారా ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేసే పథకంలో ఈమె ఒక భాగమనే ఆరోపణలు వచ్చాయి. మెంగ్పై ఉన్న నేరాభియోగంలో ''ఇరాన్తో ఉన్న వ్యాపార ఒప్పందాల విషయంలో ఆమె అమెరికన్ బ్యాంకులు, ప్రభుత్వంతో అబద్ధం చెప్పారు'' అని ఉంది.
మెంగ్... హువావే సంస్థ వ్యవస్థాపకుడి కూతురు. తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఆమె ఖండిస్తున్నారు. ఒకవేళ ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమైతే అమెరికా చట్టాల ప్రకారం 30 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో హువావే కష్టాలు
హువావే కంపెనీపై వచ్చిన అన్ని ఆరోపణలను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తోందని బ్లూంబర్గ్ మీడియా సంస్థ తెలిపింది. ఫోన్ను జారవిడిస్తే దాని స్క్రీన్ పగిలిపోతుందని తెలిసిందే. కొత్త స్క్రీన్ను అమర్చాలంటే ఎంత ఖర్చు అవుతుందో కూడా మనకు తెలుసు.
ఈ దశలో అన్బ్రేకబుల్ స్క్రీన్తో ఉండే స్మార్ట్ ఫోన్ తయారీ అనేది ఏ సంస్థకైనా గొప్ప వరంలాంటిది. కృత్రిమ డైమండ్ కోటింగ్తో చిరకాలం ఉండే సరికొత్త గ్లాసును సరఫరా చేసేందుకు అక్హాన్ సెమీకండక్టర్ ఇన్ సంస్థ హువావేతో చర్చలు జరిపింది.
'ఇలాంటి ఒక నమూనా గాజును ఆ సంస్థ హువావేకి అందజేసింది. కానీ, దాన్ని తిరిగి తయారీ సంస్థకు ఇచ్చిన కొన్ని నెలల్లోనే ఆ గాజు ధ్వంసమైంది' అని బ్లూబర్గ్ తెలిపింది. విశ్లేషణ కోసం హువావే.. అమెరికా నుంచి నమూను తీసుకొని ఉండొచ్చనే ఉద్దేశంతో అక్హన్ సెమీకండక్టర్ ఇంక్ మీద ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్ని కుంభకోణాలు, ఆరోపణలు చుట్టుముట్టినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించినా అంతర్జాతీయ వ్యాపారంలో హువావే ఇంకా కీలకంగానే ఉంది.
యూరోపియన్, అమెరికా కంటే చాలా తక్కువ ఖర్చుకు సాంకేతికతను హువావే అందిస్తుండటంతో ఆఫ్రికా, ఆసియాలోని చాలా దేశాల్లో దీని మార్కెట్ ఎక్కువగా ఉంది.
దేశంలో 5జీ నెట్వర్క్ నిర్మాణంలో హువావే పరికరాలను ఉపయోగించాలా లేదా అనేదానిపై యూకేలో ఇంకా వాదోపవాదనలు జరుగుతున్నాయి.
హువావేపై ఆరోపణలు రావడంతో అప్రధానమైన విభాగాలలో చైనా పరికరాలను వాడాలనే నిర్ణయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి ఇటీవల వెనక్కి తీసుకున్నారు. అలాగే, హువావేకి సంబంధించిన అనేక విషయాలపై అనిశ్చతి ఇంకా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
- ఆంధ్రప్రదేశ్: ఏజెన్సీల్లో తాగునీటి కొరత.. చెలమలో నీళ్ల కోసం కిలోమీటర్ల నడుస్తున్న గిరిజన మహిళలు
- భారత లోక్సభ ఎన్నికల ఫలితాలపై పాకిస్తాన్లో ఉత్కంఠ ఎందుకు
- చంద్రగిరి రీపోలింగ్: పోలింగ్కి, రీపోలింగ్కి ఇంత వ్యవధి ఇదే తొలిసారి
- లోక్-సభ ఎన్నికలు 2019- 'మోదీ భారత్'లో హామీలు నెరవేరాయా
- ఒసామా బిన్ లాడెన్: ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఇప్పుడు ఏ స్థితిలో ఉంది
- మన్ను తిన్న చిన్నారి మట్టిలో కలిసిపోయింది.. ఆ పాపం ఎవరిది
- ఈ రాజధాని నగరాలు... ఇటీవలి దశాబ్దాలలో వెలిసిన సరికొత్త అద్భుతాలు
- ప్రధాని మోదీ మేకప్ కోసం నెలకు రూ. 80 లక్షలు ఖర్చు చేస్తారనే వార్తల్లో నిజమెంత
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








