నవాజ్ షరీఫ్: అవినీతి కేసులో జైలు నుంచి విడుదలైన పాకిస్తాన్ మాజీ ప్రధాని

నవాజ్ షరీఫ్, మర్యమ్‌

ఫొటో సోర్స్, Reuters

అవినీతి కేసులో పదేళ్లు జైలు శిక్ష పడి, గత రెండు నెలలుగా శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను విడుదల చేయాలని ఇస్లామాబాద్ న్యాయస్థానం ఆదేశించింది. నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కుమార్తె మర్యమ్‌కు పడిన శిక్షలను కూడా ఇస్లామాబాద్‌లోని హైకోర్టు సస్పెండ్ చేసింది.

దాంతో బుధవారం నాడు కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటలకే షరీఫ్‌ను, ఆయన కుమార్తె మర్యమ్‌ను విడుదల చేశారు.

దేశ సార్వత్రిక ఎన్నికలకు ముందు.. జూలై నెలలో వీరికి ఈ శిక్షలు పడ్డాయి.

తాము ఎలాంటి తప్పూ చేయలేదని, తమకు కిందికోర్టు విధించిన శిక్షలను రద్దు చేయాలని వారు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయటంతో తాజా తీర్పు వెలువడింది.

నవాజ్ షరీఫ్ భార్య కుల్సూమ్ నవాజ్ క్యాన్సర్‌తో బాధపడుతూ సరిగ్గా వారం రోజుల కిందట లండన్‌లో మృతి చెందారు. దీంతో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకుగాను వీరికి బెయిల్ లభించింది. అంత్యక్రియల తరువాత వారు తిరిగి జైలుకెళ్లారు.

తాజా తీర్పు నేపథ్యంలో వారు బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

లండన్‌లో నవాజ్ షరీఫ్ కుటుంబానికి చెందిన నాలుగు విలాసవంతమైన ఆస్తుల యాజమాన్య హక్కులకు సంబంధించిన కేసులో అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారనే కేసులో షరీఫ్‌కు జూలైలో శిక్ష పడింది.

రాజకీయ కారణాలతోనే తనకు శిక్షలు పడేలా చేశారని షరీఫ్ పేర్కొన్నారు.

ఆయన కుమార్తె మర్యమ్‌ నవాజ్ షరీఫ్‌కు... నేరాలకు సహకరించినందుకు ఏడేళ్లు, దర్యాప్తుకు సహకరించకపోవటంతో ఒక ఏడాది జైలు శిక్ష విధించారు. ఈ రెండు శిక్షలూ ఏకకాలంలో అమలవుతాయని కోర్టు తెలిపింది. నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దన్ అవన్ దర్యాప్తుకు సహకరించనందుకు గాను ఏడాది జైలు శిక్ష పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)