పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు పదేళ్ల జైలు శిక్ష

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ అవినీతి నిరోధక కోర్టు మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మర్యమ్ నవాజ్ అవినీతి అభియోగాలపై తీర్పు వెల్లడించింది.
నవాజ్ షరీఫ్కు పదేళ్లు, మరియమ్ నవాజ్కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
మర్యమ్ నవాజ్కు 20 లక్షల పౌండ్లు(సుమారు 1.75 కోట్ల రూపాయలు) జరిమానా విధించింది.
శిక్ష విధించిన తర్వాత మర్యమ్ నవాజ్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోయారు.
పాకిస్తాన్లో జులై 25న ఎన్నికలు జరగాల్సి ఉంది. మర్యమ్ నవాజ్ లాహోర్లోని ఎన్ఏ 127 స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
మర్యమ్ నవాజ్ భర్త కెప్టెన్ సఫ్దర్కు కూడా కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
ఎవెన్ ఫీల్డ్ ఎయిర్పోర్టును జప్తు చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
నేషనల్ అకౌంటబులిటీ బోర్డ్( పాకిస్తాన్ లోకాయుక్త కార్యాలయం) ప్రాసిక్యూటర్ సర్దార్ ముజఫర్ "ఎవెన్ ఫీల్డ్ను జప్తు చేయాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది" అని చెప్పారు.
లండన్లో ఉన్న నవాజ్ షరీఫ్ ఆస్తుల్లో ఎవెన్ ఫీల్డ్ను ఒకటిగా భావిస్తున్నారు. దీని గురించి ఆయనపై నమోదైన అవినీతి కేసుల్లో విచారణ సాగింది.
అంతకు ముందు జులై 3, 2018న ఈ కేసులో విచారణలు పూర్తి చేసిన కోర్టు తీర్పు రిజర్వులో ఉంచింది.

ఫొటో సోర్స్, ...
ఇస్లామాబాద్ అవినీతి నిరోధక కోర్టు జడ్జి మహమూద్ బషీర్ తొమ్మిదిన్నర నెలల పాటు ఈ కేసును విచారించారు.
ఈ కేసులో నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మర్యమ్ నవాజ్, హసన్ నవాజ్, హసీన్ నవాజ్, కెప్టెన్ సఫ్దర్పై అభియోగాలు నమోదయ్యాయి.
హసన్ నవాజ్, హుసేన్ నవాజ్లు ఇప్పటికే పరారీలో ఉన్నట్టు న్యాయస్థానం ఖరారు చేసింది
ఈ కేసును ఏడు రోజులు వాయిదా వేయాలని నవాజ్ షరీఫ్ పిటిషన్ దాఖలు చేశారు. తన భార్య అనారోగ్యానికి గురి కావడంతో పాకిస్తాన్ రాలేనని చెప్పారు. నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్లో ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP
లండన్లో ఫ్లాట్లకు సంబంధించిన అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు పదేళ్ల జైలు శిక్ష పడింది. కోర్టులో విచారణ జరిగిన తర్వాత ఈ ఆరోపణలు ఖరారయ్యాయి. గతంలో ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు అవినీతి అభియోగాలను ఖరారు చేసింది.
నవాజ్ షరీఫ్తో పాటు ఆయన కూతురు మర్యమ్ నవాజ్, అల్లుడు కెప్టెన్ మొహమ్మద్ సఫ్దర్పై కూడా అభియోగాలు నమోదు చేసింది.
తన రాజకీయ ప్రత్యర్థులు వేసిన కేసుల్లో నవాజ్ షరీఫ్ కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు.
రెండు కేసుల్లో ఆయనకు శిక్ష కూడా పడింది. అయితే పాకిస్తాన్లో తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నవాజ్ షరీఫ్పై కోర్టు విచారణ జరగడం ఇదే మొదటిసారి.
కోర్టు తీర్పుతో తదుపరి చర్యలపై దృష్టి పెడతామని నవాజ్ షరీఫ్ పార్టీ ముస్లిం లీగ్(నవాజ్) నేత తారిక్ ఫజల్ చౌధరి చెప్పారు. మన దగ్గర ఇప్పుడు ఓటు హక్కు ఉందని, పార్టీ కార్యకర్తలు సంయమనంతో ఉండాలని ఆయన అన్నారు.
నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తెను కోర్టు దోషిగా ఖరారు చేసిన తర్వాత పాకిస్తాన్ అవామీ లీగ్ నేత షేఖ్ రషీద్ "నవాజ్ షరీఫ్ అల్లా పట్టుకు చిక్కాడని అన్నారు. మర్యమ్ నవాజ్ నకిలీ పత్రాలు రూపొందించారు" అని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి








