భారత్‌-రష్యా మధ్య దూరం పెరుగుతోందా?

భారత్, రష్యా జాతీయ పతాకాలు

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశానికి రష్యా చిరకాలంగా నమ్మకమైన నేస్తం. ఎన్నో సందర్భాల్లో భారతదేశానికి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా సహాయం అందించేందుకు సోవియట్ రష్యా ముందుకు వచ్చింది.

అయితే, ఆ స్నేహబంధం ఇటీవలి కాలంలో కొంత పలచబడినట్లుగా కనిపిస్తోంది. దీనికి కారణాలను అన్వేషించే ప్రయత్నం చేసిన బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ రష్యా నుంచి అందిస్తున్న కథనం.

భారతదేశం నుంచి వచ్చి మాస్కోలో స్థిరపడ్డారు అభిషేక్. రష్యా అమ్మాయినే పెళ్ళి చేసుకున్నారు. వారి బాబు వయస్సు ఆరు నెలలు. వీరిద్దరూ ఉక్రెయిన్‌లో ప్రేమలో పడి, ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో పెళ్ళి చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. భారతీయులకు రష్యాతో ఎప్పట్నుంచో అనుబంధం ఉందంటున్న అభిషేక్ ఓ విషయంలో మాత్రం ఫిర్యాదు చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: రష్యా భారత్‌కు దూరం అవుతోందా?

కఠినమైన వీసా నిబంధనల వల్ల బంధువులు, స్నేహితులు రష్యా రావడం కష్టం. మొత్తం పర్యటన వివరాలు, హోటల్ బుకింగ్స్‌తోపాటు వివరాలన్నీ సమర్పించాలి. కానీ రష్యన్లకు భారత్ వీసా లభించండం సులభం.

భారత్-రష్యా సంబంధాలు కొత్తవేమీ కాదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోంది. చాలా మంది భారతీయులు ఇక్కడ స్థిరపడ్డారు. రష్యా సంక్షోభం తలెత్తిన 1990ల్లో సామ్ కొత్వానీ భారతదేశం నుంచి వచ్చారు. ఇప్పుడు ఆయన కంపెనీ యూరప్ అంతా విస్తరించింది.

‘‘ఈనాటి రష్యా ఇంతకు ముందు లాంటిది కాదు. ఇది 1990 వరకు సోవియట్ యూనియన్. తొంభైలలో ఇక్కడ మధ్యశ్రేణి వ్యాపారులు చాలా డబ్బు సంపాదించారు. వేగంగా వచ్చి డబ్బు సంపాదించి త్వరగా వెళ్లిపోయారు. ఇప్పుడు రష్యా వేగంగా డబ్బు సంపాదించుకునేందుకు వీలు కల్పించే దేశం కాదు. ఇక్కడ వ్యాపార విధానాలు ఎంతో సంక్లిష్టంగా మారాయి. అయితే, దీర్ఘకాలిక ప్రణాళికలతో వస్తే రష్యాను మించిన దేశం లేదు’’ అన్నారు సామ్ కొత్వానీ.

ఒకప్పుడు రష్యన్లకు భారత్ ఒక ప్రత్యేకమైన మిత్రదేశం. ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. ఈ మధ్య కాలంలో భారత్, రష్యాలు తమ స్నేహాన్ని పునరుద్ఘాటించాయి, అదే సమయంలో, అవి కొత్త స్నేహితులను కూడా వెతుకుతున్నాయి.

గత రెండు దశాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా వృద్ధి చెందింది. అమెరికా సహా ఇతర దేశాలకు సన్నిహితమైంది. రష్యా కూడా యూరప్‌కు స్నేహ హస్తం అందించింది.

‘‘రష్యాలో రాజకీయ స్థిరత్వం, సకాలంలో చెల్లింపుల విషయాలకొచ్చే సరికి భారతీయ కంపెనీలు సంశయిస్తాయి. ఇది పెద్ద అడ్డంకి. ఇక్కడికిరావడం రిస్క్ అని వారి భావన. చైనా సహా ఇతర దేశాలు చేస్తున్నట్లు భారతదేశంలోని వంద అతిపెద్ద కంపెనీలు.. ఇక్కడ తమ కార్యాలయాలు తెరవడం ప్రారంభిస్తే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది’’ అని మరో భారత వ్యాపారవేత్త కుమార్ వేలంగి అభిప్రాయపడ్డారు.

భారత్-రష్యాల మధ్య సోదర భావంపై చేసిన నినాదాలు ఒకప్పుడు భారతదేశంలోనే కాదు రష్యాలో కూడా బాగా ప్రాచుర్యంలో ఉండేవి. ఆ రోజులు మళ్లీ వస్తాయని చెప్పడం చాలా కష్టం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)