గుండె చికిత్స: తల్లి కడుపులోని బిడ్డ గుండెకు ఆపరేషన్... ‘‘ద్రాక్ష పండు’’ సైజులో గుండె... తేడా వస్తే ప్రాణం పోతుంది

కడుపులోని బిడ్డ

ఫొటో సోర్స్, Getty Images

గుండెకు ఆపరేషన్ చేయడం సాధారణమే.

పలాన ఆసుప్రతికి చెందిన డాక్టర్లు ఎంతో అరుదైన గుండె ఆపరేషన్ చేశారు... అనే వార్తలను కూడా వింటూ ఉంటాం.

కానీ దిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు చేసిన గుండె ఆపరేషన్ అరుదైన వాటిలో అరుదైనది. తల్లి కడుపులో ఉన్న బిడ్డ గుండెకు ఆపరేషన్ చేసినట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

''కేవలం 90 సెకన్లలో ద్రాక్ష పండు అంత సైజులో ఉండే బిడ్డ గుండెకు ఆపరేషన్ చేసిన దిల్లీ ఎయిమ్స్ వైద్యులకు అభినందనలు'' అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మనుషుక్ మాండవీ ట్వీట్ చేశారు.

దీన్ని రీట్వీట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎయిమ్స్ వైద్యులను మెచ్చుకున్నారు. ''భారతీయ వైద్యుల సృజనాత్మకతకు గర్వపడుతున్నా'' అని ఆయన ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఏం జరిగింది?

గర్భవతిగా ఉన్న 28ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చేరారు. అంతకు ముందు ఆమెకు మూడు సార్లు అబార్షన్ జరిగింది.

వార్తా సంస్థ ఏఎన్‌ఐ ప్రకారం...

ప్రస్తుతం కడుపులో పెరుగుతున్న బిడ్డ గుండెకు సమస్య ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయినప్పటికీ బిడ్డను కనాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. దాంతో బిడ్డ గుండెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు.

ఎయిమ్స్

ఫొటో సోర్స్, ANI

బలూన్ డైలేషన్ పద్ధతి

బిడ్డ గుండెలోని ఒక కవాటం మూసుకుపోయింది. దాన్ని తెరిచేందుకు బలూన్ డైలేషన్ అనే పద్ధతిని దిల్లీ ఎయిమ్స్ వైద్యులు వాడారు. గుండెకు సంబంధించిన చికిత్సా విధానాల్లో బలూన్ డైలేషన్ ఒకటి.

ఈ పద్ధతిలో చిన్న ట్యూబ్‌ను పొత్తికడుపు భాగం నుంచి రక్తనాళాల్లోకి ప్రవేశపెడతారు. ఆ ట్యూబ్ మెల్లగా అక్కడి నుంచి గుండెలోకి పంపుతారు. ఆ ట్యూబ్ చివర్లో ఒక బెలూన్ ఉంటుంది.

మూసుకుపోయిన గుండె కవాటంలోకి ట్యూబ్ చేరుకున్న తరువాత ఆ బెలూన్‌ను లోకి గాలి పంపి ఉబ్బనిస్తారు. బెలూన్ ఉబ్బడం వల్ల కవాటం తెరుచుకుంటుంది.

ఈ పద్ధతిలోనే కడుపులోని బిడ్డ గుండెకు చికిత్స చేశారు. ఎయిమ్స్‌లోని గుండె చికిత్స నిపుణులు, గర్భస్త శిశు నిపుణులు దీన్ని నిర్వహించారు.

''తల్లి పొత్తి కడుపు నుంచి ఒక సూదిని బిడ్డ గుండెలోకి పంపాం. బెలూన్ కేథటర్ పద్ధతి ద్వారా మూసుకుపోయిన కవాటాన్ని తెరిచాం. తద్వారా రక్తప్రసరణ పెరిగింది.

ప్రస్తుతం తల్లి, కడుపులోని బిడ్డ క్షేమంగానే ఉన్నారు. బిడ్డ గుండెను స్పెషలిస్టు బృందం పర్యవేక్షిస్తూ ఉంది.బిడ్డ పూర్తిగా పెరిగి, డెలివరీ అయియే నాటికి ఈ సమస్య తగ్గుతుందని భావిస్తున్నాం'' అని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

''ఇది చాలా ప్రమాదకరమైన ఆపరేషన్. కడుపులోని బిడ్డ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. అల్ట్రాసౌండ్ గైడెన్స్‌లో ఈ ఆపరేషన్ చేశాం.

చాలా వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేదంటే ఏదైనా తేడా వస్తే బిడ్డ చనిపోతుంది'' అని వైద్యులు చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)