Agnipath నిరసనలు: ఒకవైపు యువత ఆందోళనలు.. మరోవైపు కేంద్ర మంత్రులు, ప్రముఖుల ప్రశంసలు

ఫొటో సోర్స్, Getty Images
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా శుక్రవారం కూడా దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి.
సైన్యంలో స్వల్పకాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం యువకులకు నాలుగేళ్ల పాటు మాత్రమే సైన్యంలో పనిచేసే అవకాశం లభిస్తుంది.
ఈ కొత్త నియామక ప్రక్రియను వ్యతిరేకిస్తూ యువకులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
బిహార్ ఉప ముఖ్యమంత్రి రేణు దేవి ఇంటిని కూడా నిరసనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెతో పాటు బిహార్ బీజేపీ ప్రముఖ నేత, పశ్చిమ చంపారన్ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఇంటిపై దాడి చేశారు.
బిహార్, ఉత్తరప్రదేశ్, హరియాణా, తెలంగాణ రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న రైలు కోచ్లను తగులబెట్టారు.
హింస చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం ఫరీదాబాద్, బల్లాభ్గఢ్ నగరాల్లో తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది.
ఓవైపు అగ్నిపథ్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతుండగా మరోవైపు ఈ పథకం యువకులకు మంచి అవకాశమని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
''అగ్నిపథ్ పథకం కింద త్వరలో రిక్రూట్మెంట్ ప్రారంభం అవుతుంది. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని నేను యువతను కోరుతున్నా'' అని మనోజ్ పాండే వ్యాఖ్యానించినట్లు పీటీఐ చెప్పింది.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ... అగ్నిపథ్ విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారును లక్ష్యంగా చేసుకున్నారు.
''దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రధాని మోదీకి అర్థం కాదు. ఆయనకు తన మిత్రుల మాటలు తప్పా ఇంకెవరి మాటలు వినిపించవు'' అని ట్వీట్ చేశారు.
అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు.
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నవారు నాలుగేళ్ల తాత్కాలిక నియామకం అనే అంశాన్ని అంగీకరించట్లేదు. ఈ పథకంలో పెన్షన్ విధానం లేదు. జీవితకాల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కూడా లేదు.
ఈ హింసాత్మక ఘటనలు జరుగుతుండగానే కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ పథకానికి గరిష్ట వయస్సును 21 నుంచి 23 ఏళ్లకు పెంచింది. దీని ప్రకారం పదిహేడున్నర ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న వారు అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
గరిష్ట వయస్సు పెంపు నిర్ణయాన్ని ట్వీట్ చేస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇలా అన్నారు. ''దేశ రక్షణ వ్యవస్థలో చేరడానికి, దేశానికి సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకం దేశ యువతకు ఒక సువర్ణావకాశం. గత రెండేళ్లుగా సైన్యంలో రిక్రూట్మెంట్ ప్రక్రియను చేపట్టని కారణంగా చాలామంది యువకులకు సైన్యంలో చేరే అవకాశం రాలేదు'' అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
యువకుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని వయో పరిమితిని పెంచినట్లు తెలిపారు. ''యువత భవిష్యత్ గురించి ఆలోచించి ప్రధానమంత్రి సూచనల మేరకు ఈసారి అగ్నివీర్ల గరిష్ట వయస్సును 21 నుంచి 23 ఏళ్లకు పెంచాం. ఈ సడలింపు ఈఏడాదికి మాత్రమే పరిమితం. దీని కారణంగా చాలా మంది యువకులకు అగ్నివీర్ అయ్యే అర్హత లభిస్తుంది. యువత భవిష్యత్ పట్ల శ్రద్ధ చూపినందుకు, వారిపట్ల సున్నితంగా వ్యవహరించినందుకు ప్రధానమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. త్వరలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాబట్టి సన్నద్ధం కావాలని యువతను కోరుతున్నా'' అని ట్వీట్లో పేర్కొన్నారు.
వయో పరిమితి పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు.
''గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ఆర్మీ భర్తీ ప్రక్రియ ప్రభావితం అయింది. యువత గురించి ఆందోళన చెందిన ప్రధాని మోదీ... అగ్నిపథ్ పథకంలో వయో పరిమితిని 21 నుంచి 23 పెంచాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదికి మాత్రమే ఈ సడలింపు ఇచ్చారు. దీనివల్ల చాలామంది యువకులకు లబ్ధి కలుగుతుంది. అగ్నిపథ్ పథకం ద్వారా ఉజ్వల భవిష్యత్ లభించడంతో పాటు దేశసేవ చేసే అవకాశం వారికి లభిస్తుంది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ప్రదర్శనలు
బిహార్లోని చాలా నగరాల్లోని రైల్వే స్టేషన్లలో రైల్వే బోగీలను తగులబెట్టారు. బిహార్లోని నితీశ్ కుమార్ ప్రభుత్వంలో రేణు దేవి (బీజేపీ పార్టీ) ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. బెతియాలోని ఆమె నివాసంపై ఆందోళనకారులు దాడి చేశారు. అయితే, ఆ సమయంలో రేణు దేవి, పాట్నాలో ఉన్నారు.
ఆమె ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఇలాంటి హింస సమాజానికి చాలా ప్రమాదకరమని అన్నారు. ఇలాంటి ఘటనల వల్ల సమాజానికి నష్టం కలుగుతుందని ప్రదర్శనకారులు గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.
దీనికంటే ముందు బీజేపీ ఎమ్మెల్యే వాహనంపై కూడా దాడి జరిగింది. బెగూసరాయ్ స్టేషన్పై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. సమస్థీపూర్ జిల్లాలో జమ్మూ-తావీ ఎక్స్ప్రెస్ రెండు కోచ్లకు నిప్పు అంటించారు. లఖీసరాయ్లోని బీజేపీ కార్యాలయంపై నిరసనకారులు దాడి చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు రైల్వే స్టేషన్లోకి చొచ్చుకు వచ్చారు. సీసీటీవీ కెమెరాలకు నష్టం కలిగించారు. ఒక రైలులోని రెండు బోగీలకు నిప్పు పెట్టారు. దీంతో తెలంగాణలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆందోళనల దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షణ మధ్య రైల్వే ప్రకటించింది. 40కి పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
హరియాణాలో పెద్ద సంఖ్యలో యువకులు నర్వానా, జింద్ జిల్లాల్లోని రైల్వే ట్రాక్లపై నిరసనలు తెలిపారు. గూడ్స్ రైళ్లు, ప్యాసింజర్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. హరియాణాలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
బిహార్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఆరు జిల్లాల్లో రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందులాగే ఆర్మీ రిక్రూట్మెంట్ నిర్వహించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త విధానం ద్వారా 24 ఏళ్లకే యువకులు ఆర్మీకి రిటైర్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్డీయే మిత్రపక్షమైన జనతా దళ్ యునైటెడ్ అధ్యక్షుడు లలన్ సింగ్ ఈ అంశంపై ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''అగ్నిపథ్ పథకం... బిహార్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లోని విద్యార్థులు, యువతలో అసంతృప్తికి కారణమైంది. అన్ని చోట్లా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై పునరాలోచన చేయాలి. అగ్నిపథ్ పథకం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవని యువతకు వారు భరోసా ఇవ్వాలి'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'అగ్నిపథ్' పథకంతో ప్రయోజనం ఎవరికి? ఇండియన్ ఆర్మీకి మేలు ఎంత? అగ్నివీర్లకు మేలు ఎంత?
- సాద్ అన్సారీ ఎవరు? నూపుర్ శర్మ వ్యాఖ్యల వివాదంలో ఈ ముస్లిం యువకుడిని ఎందుకు అరెస్టు చేశారు?
- బిట్ కాయిన్ ఎందుకు ఇంత వేగంగా కుప్పకూలుతోంది?
- అచ్చం మీలాగే ఉండే, మీలాగే ఆలోచించే డిజిటల్ ట్విన్ రూపొందిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
- 68 అడుగుల లోతులో 5 రోజులు నరకయాతన.. పదేళ్ల మూగ బాలుడిని ఎలా రక్షించారంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












