లాలూ ప్రసాద్ యాదవ్‌కు దాణా కేసులో అయిదేళ్ల జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానా

లాలూ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రవి ప్రకాశ్
    • హోదా, రాంచీ నుంచి

దాణా కుంభకోణం ఐదో కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్‌ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్షతోపాటూ రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది.

జార్ఖండ్‌కు సంబంధించిన దాణా కుంభకోణం కేసులో ఇది చివరి, ఐదో కేసు. ఫిబ్రవరి 15న లాలూ యాదవ్‌ను కోర్టు ఈ కేసులో దోషిగా ఖరారు చేసింది.

2017లో దాణా కుంభకోణం మిగతాకేసుల్లో శిక్ష పడిన తర్వాత లాలూ యాదవ్ మొత్తం 8 నెలలు జైల్లో, 31 నెలలు హాస్పిటల్లో ఉన్నారు. ఆయన 8 నెలలు రాంచీలోని హోట్వార్ బిర్సా ముండా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం లాలూ యాదవ్ బెయిలు మీద బయటున్నారు.

"లాలూ యాదవ్‌ను 2018 ఆగస్టు 30న రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే రిమ్స్‌కు షిఫ్ట్ చేశాం. 2021 ఫిబ్రవరి 13 వరకూ ఆయన అక్కడే ఉన్నారు. తర్వాత దిల్లీలో ఉన్న ఎయిమ్స్‌కు షిఫ్ట్ చేశాం" అని లాలూ యాదవ్ వకీల్ ప్రభాత్ కుమార్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.

లాలూ యాదవ్‌ను గత ఏడాది ఏప్రిల్లో ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేశారు. తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. ఫిబ్రవరి 15న దాణా కుంభకోణం చివరి కేసులో ఆయనను దోషిగా ఖరారు చేసినప్పుడు లాలూకు రిమ్స్‌లో అడ్మిట్ చేయడానికి జైలు అధికారుల అనుమతి లభించింది.

లాలూ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

90వ దశకంలో చర్చనీయాంశం అయిన కోట్ల రూపాయల దాణా కుంభకోణంలో సీబీఐ అప్పుడు మొత్తం 66 కేసులు నమోదు చేసింది.

వాటిలో ఆరు కేసుల్లో బిహార్ అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను కూడా నిందితుడుగా చేర్చారు. బిహార్ విభజన తర్వాత వీటిలో ఐదు కేసులను జార్ఖండ్‌కు బదిలీ చేశారు.

ఈ ఐదు కేసుల్లో నాలుగింటిలో లాలూ యాదవ్‌ను ఇప్పటికే దోషిగా ఖరారు చేశారు. అయితే, ఈ కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది.

ఆర్సీ 47-ఎ/96 ఇందులో చివరి కేసు, ఇందులో 1990-91, 1995-96 మధ్య నకిలీ బిల్లులతో అక్రమంగా నగదు డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి.

నగదు విత్‌డ్రా విషయంలో చూస్తే ఇది అతిపెద్ద నగదు డ్రా కేసు. ఇందులో లాలూ యాదవ్‌కు వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్-120బి, అవినీతి నిరోధక చట్టం-1988 సెక్షన్ 13(2), డబ్ల్యు 13(1)(సి), (డి) కింద అభియోగాలు నమోదయ్యాయి.

ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆయనపై ఆరోపణలున్నాయి. అసెంబ్లీలో, లోక్‌సభలో ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పశు సంవర్ధక శాఖలో అవినీతి జరుగుతోందని, నకిలీ బిల్లుల ద్వారా అక్రమ నగదు డ్రా చేశారనే అంశాలను లేవనెత్తారు.

1996లో ఈ కుంభకోణం బయటపడిన తర్వాత అప్పటి బిహార్ డోరండా పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 17న దీనిపై ఎఫ్ఐఆర్(నంబర్ 60/96) నమోదైంది. ఇందులో 55 మంది నిందితులు విచారణ సమయంలోనే మృతి చెందారు. మరో 8 మంది నిందితులు సీఆర్పీసీ(క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973) నిబంధనల ప్రకారం ప్రభుత్వ సాక్ష్యులు(అప్రూవర్స్)గా మారారు. ఇద్దరు నిందితులు ఇప్పటికే నేరాన్ని అంగీకరించారు.

లాలూ ప్రసాద్ యాదవ్‌

ఫొటో సోర్స్, Getty Images

'అన్యాయంపై పోరాడతా'

జార్ఖండ్ న్యాయస్థానం వెలువరించిన తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ తరఫు న్యాయవాది చెప్పారు.

ఈ తీర్పుపై లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ట్వీట్ ద్వారా స్పందించారు. ''అన్యాయం, అసమానతలు, నియంతృత్వ అణచివేత శక్తులకు వ్యతిరేకంగా నేను పోరాడతాను. పోరాడుతూనే ఉంటాను. కళ్లలోకి చూస్తూ అన్యాయాన్ని ప్రశ్నిస్తాను. ప్రజలంతా అండగా ఉన్న వ్యక్తిని ఊచలు ఏం చేయగలవు'' అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ తీర్పుపై లాలూ ప్రసాద్ కుమారుడు, బీహార్ అసెంబ్లీ ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ కూడా స్పందించారు. దాణా కుంభకోణం తప్ప దేశంలో అసలు ఏ కుంభకోణం జరిగినట్లే లేదు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ''బిహార్‌లో దాదాపు 80 కుంభకోణాలు జరిగాయి. కానీ ఎక్కడ కూడా సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ కనిపించలేదు. ఈ దేశంలో ఒకే స్కామ్ జరిగినట్లు... ఒకే నేత ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల గురించి సీబీఐ మరిచిపోయింది'' అని ఆయన ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అంతకుముందు లాలూ యాదవ్‌ను కోర్టు దోషిగా తేల్చిన తర్వాత కూడా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ... ''ఈ కేసులో లాలూజీ నిర్దోషిగా బయటపడతారు. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ కేసు గురించి హైకోర్టులో అప్పీలు చేస్తాం. కావాలంటే సుప్రీం కోర్టు కూడా వెళ్తామని'' వ్యాఖ్యానించారు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)