తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా

పదో తరగతి పరీక్షలు
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.

ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

కరోనా తీవ్రత కారణంగా సీబీఎస్‌ఈ బోర్డు కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది.

మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

పదో తరగతి పరీక్షలు
ఫొటో క్యాప్షన్, తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

పదో తరగతి విద్యార్థుల మార్కులను తెలంగాణ ఎస్‌.ఎస్‌.సి. బోర్డు రూపొందించిన విధి విధానాలను బట్టి నిర్ణయిస్తామని తెలిపింది.

ఈ మార్కుల విషయంలో ఏ విద్యార్ధికైనా అసంతృప్తి ఉంటే పరిస్థితులు చక్కబడిన తర్వాత వారికి పరీక్ష రాసే అవకాశం ఇస్తామని బోర్డు తన ప్రకటనలో పేర్కొంది.

ఇంటర్
ఫొటో క్యాప్షన్, తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా

ఇంటర్ పరీక్షలు వాయిదా

మే ఒకటి నుంచి 19 వరకు జరగాల్సిన ఇంటర్ సెకండియర్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ప్రకటించింది.

జూన్‌ మొదటివారంలో పరిస్థితిని సమీక్షించి, కొత్త పరీక్షల తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.

అయితే, పరీక్షలకు 15 రోజుల సమయం ఇస్తామని వివరించింది.

ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఎలాంటి పరీక్షలు రాయకుండానే సెకండియర్‌కు ప్రమోట్ చేస్తామని తెలిపింది.

అయితే, పరిస్థితులు మెరుగుపడిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.

ఈసారి ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ పరిగణనలోకి తీసుకోబోమని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ తెలిపింది.

పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు

పరీక్షల నిర్వహణకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

కేంద్రంతో పాటుగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని వివిధ పరీక్షల విషయంలో కొన్నింటిని రద్దు చేసి, మరికొన్ని వాయిదా వేసినప్పటికీ ఏపీలో మాత్రం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని అంటోంది.పరీక్షల వాయిదా ఆలోచన లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ బీబీసీకి తెలిపారు.

"ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉంది. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించాం. ఈసారి కూడా ఆశాభావంతో ఉన్నాము. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతాం. ముఖ్యమంత్రితో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి షెడ్యూల్‌లో మార్పులు లేవు" అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది.)