కశ్మీర్: 48 గంటలలో 3 ఎన్‌కౌంటర్లు.. 10 మంది మిలిటెంట్ల హతం

భద్రతా బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మాజిద్ జహంగీర్
    • హోదా, బీబీసీ హిందీ, శ్రీనగర్

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ శివారుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా బలగాలు ముగ్గరు మిలిటెంట్లను మట్టుపెట్టాయి.

ఈ కాల్పుల్లో జమ్ముకశ్మీర్ పోలీస్ శాఖకు చెందిన ఒక ఏఎస్ఐ కూడా మరణించారు.

శుక్రవారం నుంచి ఇప్పటివరకు జమ్ముకశ్మీర్‌లో ఇది మూడో ఎన్‌కౌంటర్. ఈ మూడు ఎన్‌కౌంటర్లలో మొత్తం 10 మంది మిలిటెంట్లు హతమయ్యారు.

ఈ ఎన్‌కౌంటర్లలో ఒక ఏఎస్ఐ, ఒక సైనికుడు మరణించారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు.

మొదటి రెండు ఎన్‌కౌంటర్లు సోఫియాన్, పుల్వామా జిల్లాల్లో జరగ్గా మూడోది శ్రీనగర్‌లో జరిగింది.

శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో జమ్ముకశ్మీర్ పోలీస్, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ ఉన్న సంయుక్త భద్రతా బలగాలు ఏడుగురు మిలిటెంట్లను మట్టుపెట్టాయి.

భద్రతా బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

పాంథా చౌక్ వద్ద బైక్‌పై వచ్చిన ముగ్గురు మిలిటెంట్లు తనిఖీలు నిర్వహిస్తున్న జమ్ముకశ్మీర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపి పారిపోవడంతో ఆ ప్రాంతమంతా కార్డన్ సెర్చ్ జరిపినట్లు పోలీసులు చెప్పారు.

కార్డన్ సెర్చ్ సమయంలో మిలిటెంట్లు మళ్లీ కాల్పులు జరపడంతో ప్రతిగా వారిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని.. చాలాసేపు సాగిన ఈ కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు, బాబూరామ్ అనే ఒక పోలీస్ అధికారి మరణించారని.. మరో మిలిటెంట్ లొంగిపోయాడని పోలీసులు తెలిపారు.

జమ్ముకశ్మీర్ పోలీస్ శాఖలో స్పెషల్ ఆపరేషన్ గ్రూపులో బాబూరామ్ పనిచేస్తున్నారని.. ఆయన సుదీర్ఘ కాలంగా యాంటీ మిలిటెన్సీ ఆపరేషన్స్‌లో కీలకంగా పాల్గొంటున్నారని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ చెప్పారు.

తాము ఒక పోలీస్ అధికారిని కోల్పోయినప్పటికీ మిలిటెంట్లలో ఒకరికి లొంగిపోయే అవకాశం కల్పించామని డీజీపీ అన్నారు.

కాగా సోఫియాన్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఆర్మీ ఆఫీసర్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రశాంత్‌గా గుర్తించారు.

కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

కాగా మిలెటంట్లను లొంగిపోవాలని కోరుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జుబేర్ అహ్మద్ అనే మిలిటెంట్ తల్లి పోలీస్ వాహనంలాంటి ఒక వాహనంలో కూర్చుని లొంగిపోవాలంటూ తన కుమారుడిని లౌడ్ స్పీకరులో విజ్ఞప్తి చేస్తున్న ఆ వీడియో వైరల్ అయింది.

కశ్మీరులో మిలిటెంట్లను పట్టుకుంటున్న పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ మూడు ఎన్‌కౌంటర్లలో మరణించిన మిలిటెంట్లు 2020లోనే రిక్రూటైనట్లు పోలీసులు చెప్పారు. పాకిస్తానీ గ్రూపులు, కశ్మీర్‌లోని కొందరు దేశవిద్రోహుల మాటలు నమ్మి ఈ యువకులు తప్పుదారి పడుతున్నారని జమ్ముకశ్మీర్ జీవోసీ సేన్ గుప్తా అన్నారు.

ఈ ఒక్క ఏడాదిలోనే దక్షిణ కశ్మీర్‌కు చెందిన 80 మంది యువత మిలిటెంట్ గ్రూపుల్లో చేరారని పోలీసులు చెప్పారు.

మరోవైపు ఉత్తర కశ్మీర్‌లోనూ మిలిటెంట్ల దాడులు ఎక్కువయ్యాయి. 12 మందికిపైగా పోలీసులను మిలిటెంట్లు చంపేశారు.

అయితే, కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు కొత్తేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)