కరోనావైరస్:'మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు' -రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

"లాక్‌డౌన్ అనేది మహమ్మారిని అరికట్టేందుకు పరిష్కారం కాదు. దీంతో కేవలం వైరస్ వ్యాప్తి తాత్కాలికంగా ఆగింది అంతే" అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు.

రాహుల్ ఇంకా ఏమన్నారంటే...

లాక్ డౌన్ ముగిసిన వెంటనే వైరస్ వ్యాప్తి మొదలవుతుంది, మళ్లీ తన ప్రతాపం చూపిస్తుంది.

మన దగ్గర ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల దేశ ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించండి. రేషన్ కార్డులు లేనివాళ్లెందరో ఉన్నారు. వారందరికీ ఆహారం అందించండి. వారి ఆకలిని తీర్చండి.

మన దగ్గర గోడౌన్లన్నీ నిండుగా ఉన్నాయి. వాటిని ప్రజలకు సరఫరా చేస్తే, ఇప్పుడు చేతికొచ్చిన పంటలతో మళ్లో గోడౌన్లను నింపుకోవచ్చు. పేద ప్రజల చేతికి వీలైనంత ఎక్కువ నగదు అందించాలి.

హాట్‌స్పాట్లను గుర్తించేందుకు డైనమిక్ టెస్టింగ్ ప్రారంభించాలి. అలా చేయడం ద్వారా వైరస్‌ను అరికట్టగలం. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రాబోతోంది. అది మనందరం చూడబోతున్నాం. నిరుద్యోగం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోతుంది. కొన్ని నెలల్లోనే అసలు సమస్య మొదలవుతుంది. దీనికోసం వ్యూహాత్మకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ప్రజల ప్రాణాలను వైరస్ నుంచి కాపాడటం ఎంత ముఖ్యమో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోకుండా చూడ్డం కూడా అంతే ముఖ్యం.

రాష్ట్రాలు, ప్రధాని మధ్య ఈ ప్రణాళిక, వ్యూహాలపై లోతైన చర్చలు జరగాలి.

కోవిడ్-19ను సమర్థంగా అడ్డుకోవాలి. కానీ దాన్ని నిరోధించడం సాధ్యం కాదు.

లాక్ డౌన్ వల్ల వలస కార్మికులకు సంబంధించి చాలా పెద్ద సమస్య ఎదురైంది. వారి విషయంలో ప్రధాని, కేంద్ర ప్రభుత్వాలు సరైన దిశలో ఆలోచన చేయాలి.

"కాంగ్రెస్ ప్రభుత్వాలు సైతం లాక్ డౌన్ పొడిగించాలని కోరాయి. మీరేమో భిన్నంగా మాట్లాడుతున్నారు" అని ప్రశ్నించగా... "ఇంత భారీ స్థాయిలో వలస కార్మికులు ఉన్న సందర్భంలో లాక్ డౌన్ విధించిన ఏకైక దేశం భారత్ మాత్రమే అనుకుంటున్నా. నేను నా అభిప్రాయాన్ని చెబుతున్నా. వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. టెస్టింగ్‌ను పెంచాల్సిన ఆవశ్యకత ఉంది" అని చెప్పారు.

భారత్ సరైన స్థితిలో ఉంది అని ప్రధాని చెబుతున్నారు కదా, దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించగా... ఇంత పెద్ద దేశానికి ఆర్థిక సంక్షోభం ఎదురుకాబోతోంది, దాన్ని ఎలా ఎదుర్కొంటారు? పేదల ఆకలిని ఎలా తీరుస్తారు అని ఆయన ప్రశ్నించారు.

అమెరికా, యూరోపియన్ దేశాల్లో టెస్టింగ్ కిట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడ ఎక్కువ పరీక్షలు జరిగాయి. మన దగ్గర కూడా అదే జరగాలి. అందుకే నేను పదేపదే టెస్టింగ్ అవసరం గురించి చెబుతున్నా. భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించకపోతే ఓ ప్రాంతం హాట్‌స్పాట్‌గా మారుతున్న విషయాన్ని ఎలా గుర్తించగలం?

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)