కరోనావైరస్: తెలంగాణలో మరో కేసు నిర్ధరణ

తెలంగాణలో మరో వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యిందని, దాంతో రాష్ట్రంలో కోవిడ్- 19 పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజాగా కరోనా సోకినట్లు నిర్ధరణ అయిన వ్యక్తి స్కాట్‌లాండ్‌ నుంచి వచ్చారని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది.

ముంబయి: సిద్ధివినాయక ఆలయం మూసివేత

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సోమవారం సాయంత్రం నుంచి ముంబయిలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంలోకి భక్తులను అనుమతించబోమని ఆలయ అధికారులు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 114కు పెరిగింది. అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 32 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

దీంతో స్కూళ్లు, కళాశాలలను మూసివేస్తున్నట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రాజేశ్ తెలిపారు. కేవలం 10, 12 తరగతుల వారికి మాత్రమే షెడ్యూలు ప్రకారం పరీక్షలు కొనసాగుతాయని, మిగతా విద్యార్థుల పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

50 మందికి మించి గుమిగూడొద్దు: దిల్లీ ప్రభుత్వం

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు 50 మందికి మించి ప్రజలు గుమిగూడే అన్ని రకాల కార్యక్రమాలను (వివాహాలు మినహా) మార్చి 31 వరకు నిషేధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

దేశ రాజధాని పరిధిలో జిమ్‌లు, స్పాలు, నైట్ క్లబ్‌లు, థియేటర్లు, వారాంతపు సంతలను మూసివేయాలని నిర్ణయించినట్లు దిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

"అన్ని షాపింగ్ మాల్స్‌ను రోజూ శుభ్రం చేయాలి. మాల్స్ ప్రవేశ ద్వారాల వద్ద, అందులోని ప్రతి దుకాణం దగ్గర అవసరమైనన్ని హ్యాండ్ శానిటైజర్లను ఉంచాలి. చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే సందర్శకులను లోపలికి అనుమతించాలి" అని దిల్లీ ప్రభుత్వం సూచించింది.

కరోనావైరస్ కారణంగా కేరళలోని తిరువనంతపురంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పిల్లల ఇంటికే భోజన సామగ్రిని తీసుకెళ్లి అందిస్తున్నారు.

"కరోనావైరస్ కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో మధ్యాహ్న భోజనానికి అవసరమైన సామగ్రిని పిల్లల ఇళ్లకే సరఫరా చేయమని ప్రభుత్వం సూచించింది" అని అంగన్‌వాడీ టీచర్ బేబీ గిరిజ తెలిపారు.

వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 31 వరకూ అన్ని విద్యా కేంద్రాలను మూసి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఒడిశాలోని పూరి క్షేత్రానికి వస్తున్న యాత్రికులను వెనక్కి పంపించేస్తున్నామని ఒడిశా అధికారులు తెలిపారు.

"అన్ని విద్యాసంస్థలు, జిమ్స్, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసి ఉన్నాయి. అందువల్ల పర్యటకులంతా వెనక్కి వెళ్లిపోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదంతా కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగమే"అని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ ఎస్కే రాయ్ తెలిపారు.

విదేశీ, స్వదేశీ పర్యటకులను నగరంలోకి రావద్దని కోరుతూ వారికి నచ్చజెప్పి వెనక్కి పంపించేస్తున్నామని రాయ్ తెలిపారు.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్ అసెంబ్లీనీ మార్చి 25వరకూ వాయిదా వేశారు.

శ్రీనగర్‌లోని అన్ని పార్కులు, గార్డెన్లను తదుపరి ఆదేశాలిచ్చేవరకూ మూసి ఉంటుతున్నట్లు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ షాహిద్ చౌదరీ తెలిపారు.

కేరళలోని కొచ్చి విమానాశ్రయ ప్రాంగణంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు 79మందిపై కేసు నమోదు చేశారు.

రియాలిటీ షోలో పాల్గొన్న ఓ వ్యక్తికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి చేరుకున్న వీరిపై అధికారులు కేసు నమోదు చేశారు. విమానాశ్రయ పరిసరాల్లో కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎక్కువమంది గుమిగూడటంపై నిషేధం విధించారు.

ఒడిశాతో ఓ కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదైందని రాష్ట్ర వైద్య, విద్యా శిక్షణ విభాగం డైరక్టర్ డాక్టర్ సీబీకే మొహంతి వెల్లడించారు.

"బాధితుడు ఇటలీ నుంచి దిల్లీకి వచ్చారు. ఆ తర్వాత దిల్లీ నుంచి భువనేశ్వర్‌కు రైలులో ప్రయాణించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి భువనేశ్వర్‌లో ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు" అని మొహంతి తెలిపారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొందరు మంత్రుల బృందంతో ఈరోజు సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రధాన కరోనావైరస్ పైనే చర్చించనుంది.

ఇరాన్‌ నుంచి వచ్చిన 53 మంది

52 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు సహా 53మంది ఇరాన్‌లోని టెహ్రాన్, షిరాజ్‌ల నుంచి భారత్ తిరిగి వచ్చారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. దీంతో మొత్తంగా నాలుగు విడతల్లో 389 మంది భారతీయులు ఇరాన్ నుంచి భారత్ చేరుకున్నారు.

53మందితో కూడిన విమానం రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ప్రాథమిక పరీక్షల అనంతరం వారందరినీ ఆర్మీ వెల్‌నెస్ సెంటర్‌కు తరలించారు.

వీరంతా భారత్‌కు తిరిగిరావడానికి ఇరాన్‌లో భారత రాయబార కార్యాలయం అధికారులు, ఇరాన్ అధికారులు ఎంతో కృషి చేశారని జైశంకర్ అన్నారు.

కరోనావైరస్: భారత్‌లో ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి?

ఇప్పటివరకూ 13మంది కరోనావైరస్ చికిత్స తీసుకుని ఆరోగ్యవంతులయ్యారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ తెలిపింది. రాజస్థాన్‌లో ముగ్గురికి చికిత్స పూర్తి కావడంతో ఈ సంఖ్య 13కి చేరింది.

ఉత్తరాఖండ్‌‌లో డెహ్రాడూన్‌లో ఉన్న ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మార్చి 31 వరకూ అన్ని రకాల పర్యటనలనూ నిలిపివేసింది.

రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓ విదేశీ విద్యార్థిని, 8మంది భారతీయ విద్యార్థులను కోవిడ్-19 అనుమానంతో 14రోజుల పాటు ఐసోలేషన్‌కు పంపించింది.

కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా పట్నా హైకోర్టు తన కార్యకలాపాలను అత్యవసర అంశాలకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది.

బిహార్‌లోని దర్భంగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి ఆదివారం ఓ అనుమానిత కోవిడ్-19 రోగి తప్పించుకున్నాడని సూపరింటెండెంట్ రాజీవ్ రంజన్ తెలిపారు. ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్తుండగా అతడు తప్పించుకున్నాడని ఆయన చెప్పారు. పోలీసులకు, జిల్లా అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేశామని ఆయన అన్నారు.

భారత్‌లో ప్రస్తుతం 110 కరోనా కేసులు నిర్థరణ జరిగింది. వీరిలో 17మంది విదేశీయులు కూడా ఉన్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 32 కేసులు నమోదయ్యాయి.

కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపేయో, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌తో ఫోన్ ద్వారా చర్చించుకున్నారు.

కరోనావైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంయుక్తంగా అనుసరించాల్సిన వ్యూహాలపై మా ఇద్దరి మధ్య చర్చ జరిగింది అని పాంపేయో ట్వీట్ చేశారు.

ప్రపంచ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఎలాంటి సహాయసహకారాలు కావాలనేదానిపై ఇద్దరు నేతలూ చర్చించుకున్నారని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి మోర్గాన్ ఒర్టాగస్ తెలిపారు.

సీఎన్ఎన్ అందించిన వివరాల ప్రకారం అమెరికాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఆదివారం 3000 దాటాయి.

యూరప్‌లో కరోనావైరస్ మరణాల సంఖ్య 2000 దాటింది. ఒక్క ఇటలీలోనే ఆదివారం ఒక్కరోజే 368 మంది మరణించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)