కరోనావైరస్: సార్క్ దేశాల్లో కరోనా కట్టడికి ‘కోవిడ్-19 అత్యవసర నిధి’.. కోటి డాలర్లు ప్రకటించిన మోదీ

కరోనావైరస్‌ కట్టడికి కలసికట్టుగా వ్యూహాలు రూపొందించేందుకు సార్క్‌ కూటమి దేశాధినేతలు ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

భారత్‌ తరఫున ప్రధాని నరేంద్రమోదీ చొరవతో నిర్వహించిన సమావేశంలో కరోనా నియంత్రణ చర్యలపై సభ్య దేశాల ప్రతినిధులు చర్చించారు.

సార్క్ దేశాల్లో కరోనావైరస్ పోరాటానికి గాను కోవిడ్-19 అత్యవసర నిధి ఏర్పాటు చేయాలని మోదీ ప్రతిపాదించారు. భారత్ తరఫున దీని కోసం కోటి డాలర్లు ప్రకటించారు. ఈ ప్రపంచ మహమ్మారిపై పోరాటానికి గాను సభ్య దేశాలు దీన్ని వాడుకోవచ్చన్నారు. తాము వినియోగిస్తున్న డిసీజ్ సర్వేలెన్స్ సాఫ్ట్‌వేర్‌ను సభ్య దేశాలకు అందివ్వడానికి సిద్ధమని చెప్పారు.

కరోనాపై ఉమ్మడి పోరాటం చేయాలని సార్క్‌ దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. దక్షిణాసియా ప్రాంతంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 150 కన్నా తక్కువే అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలన్నారు.

కరోనా వ్యాప్తిపై ఎవరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నియంత్రణ చర్యలతో దీన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

'గత జనవరి నుంచి విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిని స్క్రీనింగ్‌ చేయడం ప్రారంభించాం. ఆ తర్వాత క్రమంగా ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తూ వచ్చాం. పలు దేశాల్లో ఉంటున్న సుమారు 1400 మంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చాం. కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న సరిహద్దు దేశాల పౌరులను కూడా తీసుకొచ్చాం. కరోనా వైరస్‌ నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలే ముఖ్యమని' మోదీ చెప్పారు.

107 కేసులు

భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 107కి చేరినట్లు ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 31 కేసులు నమోదు కాగా కేరళలో 22, ఉత్తర ప్రదేశ్‌లో 11 కేసులు నమోదయ్యాయి.

మొత్తం కేసుల్లో 90 మంది భారతీయులు కాగా 17 మంది విదేశీయులు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా

కరోనావైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఈ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించారు.

రాష్ట్రంలో పంచాయితీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండగా.. ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడుతుండటం వల్ల ఓటు వేయడానికి ఎక్కువ సమయం పడుతుందని, పైగా బ్యాలెట్ పేపర్ ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని, కాబట్టి విధిలేని పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ప్రజల క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఆరు వారాలపాటు ఎన్నికలను నిలిపివేస్తున్నామని, ఇది ఎన్నికల నిలిపివేత మాత్రమే తప్ప రద్దు కాదని చెప్పారు.

అయితే, ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు జరిగిన ప్రక్రియ మాత్రం రద్దు కాదని, ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కూడా కొనసాగుతారని రమేశ్ కుమార్ ప్రకటించారు.

ఆరు వారాల తర్వాత మరొకసారి సమీక్ష జరిపి ఈ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు.

పంచాయితీ ఎన్నికలకు షెడ్యూల్ కూడా ఆరు వారాల తర్వాతే ప్రకటిస్తామన్నారు.

కాగా, ఈ ఆరు వారాల పాటూ ఎన్నికల నియమావళి అమలవుతుందని స్పష్టం చేశారు.

అధికార యంత్రాంగం హింసాత్మక సంఘటనల్ని అడ్డుకోలేదు

రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని రమేశ్ కుమార్ ప్రకటించారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. హింసాత్మక సంఘటనలు, బెదిరింపులు చోటు చేసుకోవడం సరికాదన్నారు.

అధికార యంత్రాంగం పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, హింసాత్మక ఘటనల్ని అడ్డుకోలేదని, ఉదాసీనంగా వ్యవహరించిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని, మరోసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయని ఆశిస్తున్నామన్నారు.

అత్యంత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆ విధుల నుంచి వెంటనే తప్పించి, ప్రత్యామ్నాయ అధికారులను సూచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రమేశ్ కుమార్ సూచించారు.

మాచర్ల సీఐపై బదిలీకి సిఫార్సు

మాచర్లలో జరిగిన హింసాత్మక సంఘటన నేపథ్యంలో ఉదాసీన వైఖరితో కేసు నమోదు చేసి, నిందితులకు వెనువెంటనే స్టేషన్ బెయిల్ ఇవ్వటం గర్హనీయమని, దీనికి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ బాధ్యత వహించాలని చెప్పారు. ఈ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను తక్షణం సస్పెండ్ చేసి, ఆమోదయోగ్యుడైన మరొక అధికారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించారు.

అలాగే, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను, తిరుపతి, పలమనేరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను, మరికొందరు పోలీసు అధికారులను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నామన్నారు.

హింసాత్మక సంఘటనలు, నామినేషన్లు వేయకుండా బెదిరించడం, పత్రాలను చించివేయడం పెద్దఎత్తున జరిగినట్లు ప్రాథమికంగా నిర్థరణకు వచ్చామని, ఈ నేపథ్యంలో తిరుపతి, మాచర్ల, పుంగనూరుల్లో అవసరమైతే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.

ఇటలీ నుంచి స్వదేశానికి బయలుదేరిన 211 మంది భారతీయ విద్యార్థులు

కరోనావైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఇటలీలో చిక్కుకుపోయిన 211 మంది భారతీయ విద్యార్థులను, మరో ఏడుగురు భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువస్తోంది.

వీరందరినీ ఎక్కించుకుని మిలాన్ నగరం నుంచి ఎయిర్ ఇండియా విమానం భారత్ బయలుదేరిందని ఇటలీలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

కాగా, రోమ్ నగరంలో చిక్కుకుపోయిన మిగతా విద్యార్థులను భారతదేశానికి తరలించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని రాయబార కార్యాలయం వెల్లడించింది.

వీరందరికీ సోమవారం వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ఆ పరీక్షలకు తప్పకుండా హాజరు కావాలని ప్రకటించింది. కోవిడ్-19 సోకలేదని వైద్య సర్టిఫికెట్ లభించిన వారంతా స్వదేశానికి రావొచ్చు.

ఈ పరీక్షలు నిర్వహించిన తర్వాత సర్టిఫికెట్ రావడానికి వారం రోజులు పడుతుందని రాయబార కార్యాలయం చెప్పింది.

రోమ్‌లో ఉన్న విద్యార్థులంతా మెడికల్ టెస్ట్ చేయించుకునేందుకు +393316142085 లేదా +393248390031 నంబర్లలో సంప్రదించాలని ఇండియన్ ఎంబసీ కోరింది.

భారత్‌లో 93 మందికి కరోనా

భారతదేశంలో మొత్తం 12,29,363 మంది ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు జరిపామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

మార్చి 15వ తేదీ ఉదయం 8.55 గంటల సమయానికి దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాధి సోకిన 9 మంది చికిత్స తీసుకుని, ఆ వ్యాధిబారి నుంచి బయటపడ్డారని ప్రకటించింది. ఇలా కరోనావైరస్‌ సోకి, చికిత్స పొంది, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినవారిలో ముగ్గురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కాగా, ముగ్గురు కేరళకు చెందినవారు. మిగతా ఇద్దరు దిల్లీ వారు అని కేంద్రం ప్రకటించింది.

భారత్‌లో ఇప్పటికి ఇద్దరు వ్యక్తులు కోవిడ్-19 కారణంగా మరణించారు. వీరిలో ఒకరు దిల్లీకి చెందిన 69 ఏళ్ల మహిళ కాగా, కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు మరొకరు.

దేశవ్యాప్తంగా మొత్తం 93 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్థరణ అయ్యింది. వీరిలో 76 మంది భారతీయులు కాగా, 17 మంది విదేశీయులు.

భారతీయుల్లో అత్యధికంగా కేరళలో 22 మంది ఉండగా, మహారాష్ట్రలో 19 మంది, ఉత్తరప్రదేశ్‌లో 11 మంది, దిల్లీలో ఏడుగురు, కర్ణాటకలో ఆరుగురు, లద్దాఖ్‌లో ముగ్గురు, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లో ఇద్దరు చొప్పున, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్‌ల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

17 మంది విదేశీయుల్లో హర్యానా రాష్ట్రంలో 14 మంది, రాజస్థాన్‌లో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పర్యవేక్షణలో 512 మంది

కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో మార్చి 15వ తేదీ ఉదయం 8 గంటల సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో 512 మందిని పర్యవేక్షణలో పెట్టినట్లు రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ప్రకటించారు.

అలాగే మరో 21 మందిని ఆస్పత్రుల్లో పర్యవేక్సిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు 70 రక్త నమూనాలను పరీక్షించగా, వారిలో ఒకరికి కరోనావైరస్ వ్యాధి కోవిడ్-19 సోకినట్లు నిర్థరణ అయ్యిందని, మరో 57 మందికి ఈ వ్యాధి సోకలేదని, ఇంకొక 12 మంది రిపోర్టులు రావాల్సి ఉందని వెల్లడించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)