You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: తెలంగాణలో పకడ్బందీ చర్యలు.. మార్చి 31 వరకే వివాహాలకు అనుమతి.. ఆ తరువాత తేదీలకు ఫంక్షన్ హాల్స్ బుకింగ్స్పై నిషేధం
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు ప్రకటించారు. ప్రజలు గుమిగూడడానికి అవకాశమిచ్చే కార్యక్రమాలపై ప్రభుత్వం నియంత్రణ విధించింది.
* మార్చి 31 వరకు కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులు, స్కూళ్లు, కాలేజీలు అన్నీ బంద్.
* బోర్డు పరీక్షలు యథాతథంగా జరుగుతాయి.
* సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు యథాతధంగా వసతి సదుపాయం కొనసాగుతుంది.
* మార్చి 31 వరకు ఇప్పటికే నిర్ణయమైన పెళ్లిళ్లు, ఇతర వేడుకలు నిర్వహించుకోవచ్చు. అయితే, 200 మందికి మించి అతిథులు ఉండకూడదని నిర్ణయించినట్లు కేసీఆర్ చెప్పారు.
* మార్చి 31 తరువాత తేదీలకు ఫంక్షన్ హాల్స్ బుకింగ్స్ తీసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇది అమల్లో ఉంటుంది.
* బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్ షాప్స్, ఉత్సవాలు, ర్యాలీలు, ఎగ్జిబిషన్లు, ట్రేడ్ ఫేర్స్, సాంస్కృతిక కార్యక్రమాలు వేటికీ ఎట్టిపరిస్థితుల్లో అనుమతులు ఇవ్వరు.
* వారం రోజుల వరకు తెలంగాణలో సినిమా హాళ్లు, బార్లు, పబ్లు, మెంబర్షిప్ క్లబ్ల మూసివేత.
* ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంలు.. స్విమింగ్ పూల్స్, జిమ్లు, జూ పార్కులు, మ్యూజియంలు, అమ్యూజ్మెంట్ పార్కులు అన్నీ మూసివేత.
* అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు.
* ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు ఎప్పటిలా తిరుగుతాయి.
* నిత్యవసరాలకు ఇబ్బంది లేకుండా సూపర్ మార్కెట్లు, మాల్స్ తెరిచి ఉంటాయి.
ఈ నిబంధనలను ఉల్లంఘించినా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముంబయిలో వెంకన్న ఆలయ భూమిపూజ రద్దు
ఏప్రిల్ 5న ముంబయిలో వెంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి తలపెట్టిన భూమిపూజ కార్యక్రమాన్ని రద్ధు చేసినట్లుటిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉన్నప్పుడు కరోనా వ్యాపించకుండా ఏర్పాట్లు
తిరుమలలో మార్చి 17 నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 , 2లలో భక్తులు వేచి ఉండకుండా.. టైంస్లాట్ టోకెన్లు పొందిన భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు ఈవో చెప్పారు.
భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
మహారాష్ట్రలోనూ విద్యాసంస్థలకు సెలవులు
మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలను మార్చి 31 వరకు మూసివేయాలని ఆదేశించింది.
మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం
కరోనా వైరస్ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద సహాయం అందించేందుకు వీలుగా కోవిడ్-19ను విపత్తుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
వారానికోసారి పరిస్థితులను సమీక్షించుని ఐపీఎల్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం: గంగూలి
కరోనావైరస్ తీవ్రతపై వారంవారం సమీక్షించుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎప్పుడు నిర్వహించాలన్నది నిర్ణయిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ తెలిపారు.
పద్మ పురస్కారాల ప్రదానం వాయిదా
ఏప్రిల్ 3న నిర్వహించాల్సిన పద్మ పురస్కారాల కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్ వాయిదా వేసింది.
తదుపరి ఎప్పుడు నిర్వహించేది ప్రకటించాల్సి ఉంది.
వదంతులు నమ్మి ఆందోళన చెందొద్దు - కరోనావైరస్పై ఏపీ సర్కార్ బులెటిన్
కరోనావైరస్ నిరోధక చర్యలపై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కోవిడ్ -19 పాజిటివ్ బాధితుడు కోలుకుంటున్నట్లు తెలిపారు. 14 రోజుల తర్వాత మళ్లీ శాంపిల్ పరీక్షించి నయమైతే డిశ్చార్జ్ చేస్తారని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు.
కోవిడ్-19 విషయంలో వదంతులు, నిరాధార ప్రచారాలన నమ్మి ఎవరూ అనవసరంగా ఆందోళనకు గురికావొద్దని ఆయన ప్రజలను కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా మాస్కులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎవరికైనా కోవిడ్-19 సోకినట్లు అనుమానం ఉంటే కంట్రోల్ రూం నంబరు 0866-2410978కు సమాచారం ఇవ్వాలన్నారు.
అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కరోనావైరస్ వ్యాప్తి అరికట్టడానికి రూ. 5 వేల కోట్లయినా ఖర్చు చేస్తాం: కేసీఆర్
వైరస్ పుట్టి ప్రజలకు సోకడం, భారీ సంఖ్యలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కాదని, ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒకరకమైన వైరస్ ప్రపంచాన్ని ప్రబలుతోందని కేసీఆర్ అన్నారు. స్పానిష్ ఫ్లూ వల్ల కూడా కోట్లాది మంది చనిపోయారని చెప్పారు.
కరోనావైరస్ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలనూ తీసుకుంటోందని తెలిపారు.
ఇటలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి వైరస్ సోకిందని, ఆ వ్యక్తిని గాంధీ ఆసుపత్రిలో పెట్టి చికిత్స అందిస్తున్నామన్నారు. మరో ఇద్దరికి వైరస్ సోకినట్లు అనుమానం ఉందని, వారి రక్త నమూనాలు సేకరించి పరీక్ష కోసం పూణే పంపించామన్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారివల్లనే ఈ వైరస్ సోకుతోందని చెప్పారు.
ప్రపంచమంతా ఉత్పాతం సంభవించినప్పుడు బాధ్యతగల రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించబోదని, ఒకవేళ అలా ఏమీ చేయకుండా ఉంటే అదొక నేరం అవుతుందన్నారు.
దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో విమాన, మెట్రో ప్రయాణికులు అంచనాలను మించి పెరిగారని, ఇప్పుడు శంషాబాద్కు రోజుకు 500 విమానాలు ప్రయాణిస్తున్నాయని, 57 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారని వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ప్రయాణీకులు హైదరాబాద్కు వస్తున్నారని చెప్పారు. అయితే, విదేశీయులు భారత్ రాకుండా కేంద్ర ప్రభుత్వం వీసాలు రద్దు చేసిందని, భారతీయులు ఎవరైనా వస్తే 14 రోజుల పాటు ఇతరులతో కలవకుండా నిర్బంధిస్తున్నారని తెలిపారు.
200 మంది ఆరోగ్య శాఖ అధికారులను విమానాశ్రయంలో నియమించామని, వారితో పాటు పలువురు ఉన్నతాధికారులను కూడా పెట్టామని, వారంతా తగిన చర్యలు తీసుకుంటున్నారన్నారు.
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఏ ఆపదా సంభవించకపోయినప్పటికీ.. వెర్రిబాగులవాళ్లలాగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అది నేరం అవుతుందన్నారు.
అందుకే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు, సమావేశాలు మొదలైనవాటిపై ఉన్నతాధికారులతో కూడిన హైలెవల్ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. దీనికితోడు సాయంత్రం 6 గంటల సమయంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నామని, అందులో కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడం, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చిస్తామన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తక్కువగానే ఉందని, అయినప్పటికీ ఒకవేళ ప్రబలితే తీసుకోవాల్సిన అన్ని చర్యలకూ సంసిద్ధంగా ఉన్నామన్నారు.
కరోనావైరస్ వల్ల ప్రజలకు ఇబ్బంది రాకుండా చూస్తామని, అవసరమైతే రూ.5 వేల కోట్లు అయినా ఖర్చు చేస్తామన్నారు. ఉత్పాతం లేకపోయినా, ఎటువంటి రిస్క్ తీసుకోదల్చుకోలేదని, ఇతర రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలను కూడా సమీక్షించి క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు
నాగ్పూర్ ఆసుపత్రి నుంచి ఐదుగురు కోవిడ్-19 అనుమానితులు పరార్
కరోనావైరస్ సోకిందేమోనన్న అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులు ఆసుపత్రి నుంచి పారిపోయిన సంఘటన నాగ్పూర్లో చోటుచేసుకుంది.
నాగ్పూర్లోని మాయో ఆసుపత్రిలో కరోనావైరస్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డు నుంచి ఐదుగురు కోవిడ్-19 అనుమానితులు పారిపోయారని నాగ్పూర్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ సూర్యవంశీ చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
‘‘ఈ ఐదుగురికీ వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి కరోనావైరస్ సోకలేదని నిర్థరణ అయ్యింది. మిగతా నలుగురి రిపోర్టులు రావాల్సి ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు.
ఆసుపత్రి నుంచి పారిపోయిన ఐదుగురినీ గుర్తించామని, వారిని పట్టుకుని తిరిగి ఆసుపత్రికి తీసుకువస్తామని సూర్యవంశీ వెల్లడించారు.
ఆఫీసు భవనం ఖాళీ చేయిస్తున్న ఇన్ఫోసిస్
బెంగళూరులోని తమ శాటిలైట్ బిల్డింగుల్లో ఒకదానిని ఖాళీ చేయించాలని నిర్ణయించినట్లు ప్రముఖ ఐటీసేవల సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించింది.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ భవనాన్ని ఖాళీ చేయిస్తున్నామని వెల్లడించింది.
తమ ఉద్యోగుల్లో ఒకరు కోవిడ్-19 సోకినట్లుగా అనుమానిస్తున్న ఒక పేషెంట్ను కలిశారని, ఈ నేపథ్యంలోనే బిల్డింగ్ ఖాళీ చేయించాల్సి వస్తోందని ఇన్ఫోసిస్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
కరోనావైరస్ను జయించిన వారు భారత్లో 10 మంది, కోవిడ్-19 సోకినవారు 83 మంది - కేంద్ర ఆరోగ్య శాఖ
భారతదేశంలో మొత్తం 11,71,061 మంది ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు జరిపామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
మార్చి 13వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాధి సోకిన 10 మంది చికిత్స తీసుకుని, ఆ వ్యాధిబారి నుంచి బయటపడ్డారని ప్రకటించింది. ఇలా కరోనావైరస్ సోకి, చికిత్స పొంది, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినవారిలో అత్యధికంగా ఐదుగురు ఉత్తరప్రదేశ్కు చెందినవారు కాగా, ముగ్గురు కేరళకు చెందినవారు. మిగతా ఇద్దరు దిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల వారు అని కేంద్రం ప్రకటించింది.
భారత్లో శుక్రవారం నాటికి ఇద్దరు వ్యక్తులు కోవిడ్-19 కారణంగా మరణించారు. వీరిలో ఒకరు దిల్లీకి చెందిన 69 ఏళ్ల మహిళ కాగా, కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు మరొకరు.
దేశవ్యాప్తంగా మొత్తం 83 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్థరణ అయ్యింది. వీరిలో 65 మంది భారతీయులు కాగా, 17 మంది విదేశీయులు.
భారతీయుల్లో అత్యధికంగా కేరళలో 19 మంది ఉండగా, మహారాష్ట్రలో 14 మంది, ఉత్తరప్రదేశ్లో 12 మంది, దిల్లీలో ఏడుగురు, కర్ణాటకలో ఆరుగురు, లద్దాఖ్లో ముగ్గురు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్, జమ్మూ కశ్మీర్ల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
17 మంది విదేశీయుల్లో హర్యానా రాష్ట్రంలో 14 మంది, రాజస్థాన్లో ఇద్దరు, ఉత్తరప్రదేశ్లో ఒకరు చికిత్స పొందుతున్నారు.
కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 104
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ‘నాకూ కోవిడ్-19 పరీక్ష జరగొచ్చు’ - డోనల్డ్ ట్రంప్.. అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ
- కరోనావైరస్: దిల్లీలో ఓ మహిళ మృతి.. భారత్లో రెండుకు చేరిన మరణాల సంఖ్య; కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, థియేటర్లు బంద్
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి? - ప్రజలు అడిగిన పది కీలక ప్రశ్నలు... నిపుణుల సమాధానాలు
- ఫరూక్ అబ్దుల్లా: ఏడు నెలల నిర్బంధం నుంచి కశ్మీర్ నాయకుడి విడుదల
- కరోనావైరస్ భయాన్ని సైబర్ నేరగాళ్లు ఎలా సొమ్ము చేసుకుంటున్నారు ?
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా.. బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు
- భారత్లో తొలి కరోనా మరణం.. కర్నాటక వృద్ధుడి మృతి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)