కరోనావైరస్: 140కి పైగా దేశాలకు వ్యాపించిన మహమ్మారి... ఎక్కడ ఎలాంటి ప్రభావం చూపిస్తోంది

    • రచయిత, విజువల్ జర్నలిజం టీమ్
    • హోదా, బీబీసీ

కరోనావైరస్ (కోవిడ్-19) 140కి పైగా దేశాలకు వ్యాపించింది. 5,700 మందికి పైగా ప్రాణాలను తీసింది.

చైనాలో ప్రారంభమైన ఈ మహమ్మారి... ఇప్పుడు దాని వెలుపల వేగంగా వ్యాప్తి చెందుతోంది. చైనా వెలుపల అత్యధికంగా ఇటలీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అంతర్జాతీయంగా అనేక దేశాల్లో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దీనిని ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది.

కరోనావైరస్: భారత్‌లో ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి?

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందే అంటువ్యాధులను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటిస్తుంది.

డిసెంబరులో చైనాలోని హుబే ప్రావిన్స్‌లో ఉన్న వుహాన్ నగరంలో సుమారు 81,000 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.

డబ్ల్యూహెచ్‌ఓ తాజా గణాంకాల ప్రకారం, ఇప్పుడు చైనా వెలుపల వివిధ దేశాల్లో 71,000 కేసులు నమోదయ్యాయి.

చైనా తరువాత, ఇటలీలో అత్యధికంగా 21,000 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌కు ఇప్పుడు యూరప్ "కేంద్రం"గా మారింది.

భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 107కి చేరినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం మధ్యాహ్నం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 31 కేసులు నమోదు కాగా కేరళలో 22, ఉత్తర్ ప్రదేశ్‌లో 11 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 90 మంది భారతీయులు కాగా, 17 మంది విదేశీయులు.

ఇరాన్, దక్షిణ కొరియాలో కూడా దీని వ్యాప్తి తీవ్రంగానే ఉంది.

ఈ వైరస్ వ్యాప్తి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలయ్యాయి.

వైరస్ ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపోకలను భారత్, అమెరికా సహా అనేక దేశాలు నిలిపివేశాయి. పట్టణాలను మూసివేశాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నాయి. ప్రధాన క్రీడా పోటీలు, జనాలు గుమికూడే కార్యక్రమాలను రద్దు చేస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. యూరప్ దేశాలకు రాకపోకలపై కూడా ఆయన ఆంక్షలు విధించారు.

అత్యవసర నిధి

కరోనావైరస్‌ కట్టడికి కలసికట్టుగా వ్యూహాలు రూపొందించేందుకు సార్క్‌ కూటమి దేశాధినేతలు ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సార్క్ దేశాల్లో కరోనావైరస్ పోరాటానికి గాను 'కోవిడ్-19 అత్యవసర నిధి' ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. భారత్ తరఫున దీని కోసం కోటి డాలర్లు ప్రకటించారు.

ఈ ప్రపంచ మహమ్మారిపై పోరాటానికి గాను సభ్య దేశాలు దీన్ని వాడుకోవచ్చన్నారు. తాము వినియోగిస్తున్న డిసీజ్ సర్వేలెన్స్ సాఫ్ట్‌వేర్‌ను సభ్య దేశాలకు అందివ్వడానికి సిద్ధమని చెప్పారు.

కరోనాపై ఉమ్మడి పోరాటం చేయాలని సార్క్‌ దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. దక్షిణాసియా ప్రాంతంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 150 కన్నా తక్కువే అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలన్నారు.

యూరప్ అంతటా పెరుగుతున్న కేసులు

ఇటలీ అధికారులు కఠినమైన ఆంక్షలు విధించారు. మార్చి 25 వరకు దాదాపు అన్ని దుకాణాలు, బార్లు, క్షౌరశాలలు, రెస్టారెంట్లు, కేఫేలు మూసివేశారు.

పాఠశాలలు, జిమ్‌లు, మ్యూజియంలు, నైట్‌క్లబ్‌ల్లాంటివాటిని కూడా పూర్తిగా మూసివేశారు. ప్రజలు ఇళ్ల వద్దే ఉండాలని ఆదేశించారు.

యూరప్ అంతటా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో వేలాది కేసులు నమోదయ్యాయి.

జర్మనీ జనాభాలో 70 శాతం మంది ప్రజలకు కరోనావైరస్ సంక్రమించవచ్చని ఆ దేశ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ హెచ్చరించారు.

స్పెయిన్‌లో శనివారం అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది.

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా విమానాలను రద్దు చేయడం, పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయడం, కొన్ని నగరాలను మూసివేయడం లాంటి నిర్ణయాలతో చైనా ప్రభుత్వం, ప్రాంతీయ అధికారులు కఠినమైన ఆంక్షలు విధించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)