బడ్జెట్ 2020: ఆదాయ పన్ను భారం తగ్గుతుందా... కొనుగోళ్ళు పెరుగుతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిధి రాయ్
- హోదా, బీబీసీ కోసం
ఈ దశాబ్దంలోనే భారత్ అత్యంత దారుణమైన ఆర్థిక మందమనాన్ని ఎదుర్కొంటూ ఉండడంతో ఈ ఏడాది కేంద్ర బడ్జెట్పై ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి.
గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి :ఆర్థికవ్యవస్థ 11 ఏళ్లలో అత్యల్పంగా 5 శాతం రేటుతో వృద్ధి చెందుతోంది. ప్రైవేట్ వినియోగం 7 ఏళ్ల కనిష్టానికి చేరుకుంది. పెట్టుబడుల వేగం 17 ఏళ్లలో అత్యంత నెమ్మదిగా ఉంది. తయారీరంగం 15 ఏళ్లలో తక్కువ స్థాయికి చేరింది. వ్యవసాయ రంగంలో వృద్ధి నాలుగేళ్లలో అత్యంత నెమ్మదిగా ఉంది.


వీటితోపాటు అధిక ధరలు సామాన్యులకు మరింత భారంగా మారాయి. ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంకుల లక్ష్యాన్ని మించి, 7.35 శాతం పెరిగింది.

ఫొటో సోర్స్, Pti
అయితే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఏం చేయవచ్చు?
ఆర్థిక తిరోగమనాన్ని ఎదుర్కోడానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ఒక మార్గం అని నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉదాహరణకు, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల, అది చాలా అవసరమైన ఉద్యోగాలను సృష్టిస్తుంది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) థింక్-టాంక్ విడుదల చేసిన గణాంకాలను బట్టి భారత్లో నిరుద్యోగం రేటు 2019 సెప్టెంబర్- డిసెంబర్ త్రైమాసికంలో 7.5 శాతం పెరిగింది.
కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతల్లో మాత్రం ఇంకా సందిగ్ధత ఉంది.
ఆర్థికవ్యవస్థను ఉత్తేజపరిచేందుకు కార్పొరేట్ టాక్స్లో కోతలు విధిస్తున్నట్లు ఆమె ఇప్పటికే ప్రకటించారు.
కానీ జీఎస్టీ నుంచి వచ్చే ఆదాయంతోపాటూ పన్ను వసూళ్లు ఇప్పటికే తగ్గాయి. దాంతో వ్యయం పెంచేందుకు ప్రభుత్వం చేతుల్లో తక్కువ మొత్తం ఉంది.
ఈ బడ్జెట్లో ఆదాయ పన్ను తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, అది పనిచేస్తుందా?
"వ్యక్తిగత పన్నులో కోత విధిస్తే, దానివల్ల ప్రజల చేతుల్లోకి మరింత డబ్బు వస్తుంది. తద్వారా వారిలో ఖర్చుపెట్టే, పెట్టుబడులు పెట్టే ధోరణిని ప్రోత్సహించినట్లు అవుతుంది. అందుకే వ్యక్తిగత పన్నులో కోత మంచిదనే భావిస్తున్నారు.
దానికి తోడు కార్పొరేట్ పన్నుల్లో గణనీయమైన కోత తర్వాత వ్యక్తిగత పన్నుల్లో కూడా కోత విధిస్తే, అది పన్ను విధింపులో నిష్పాక్షికతను డిమాండ్ చేస్తుందని, ఆర్థిక, సామాజిక దృక్పథం నుంచి ఆశించిన ఉద్దేశం కూడా నెరవేరుతుందని చెబుతున్నారు.
"అతిపెద్ద, పెరుగుతున్న ఆర్థికవ్యవస్థలో ఆర్థిక పునరుద్ధరణ అనేది, రీటైల్ వినియోగం, కార్పొరేట్ మూలధన పెట్టుబడుల చర్య. దానికి ఆర్థికవ్యవస్థలోని వివిధ రంగాల్లో క్రెడిట్ ప్రవాహాలు అవసరం" అని ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ కె.జోసెఫ్ థామస్ బీబీసీకి చెప్పారు.
సమస్య ఏంటంటే, భారత్లో చాలా కొద్ది మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు
అంతే కాదు, ఆదాయ పన్నులో కోత విధిస్తే, చాలామంది సంతోషిస్తారు. అది ప్రభుత్వ ఆదాయంపై మరింత ప్రభావం చూపిస్తుంది".

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఆదాయ పన్ను శ్లాబ్స్ను ప్రభుత్వం ఎలా మార్చాలి?
దీనిపై లోకల్ సర్కిల్ అనే గణాంకాలు సేకరించే సంస్థ ఒక భారీ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 80 వేల మంది స్పందనలు సేకరించింది.
ఈ సర్వే ప్రకారం 69 శాతం మంది వార్షిక ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని కోరుకున్నారు.
దాదాపు 30 శాతం మంది బోర్డు అంతటా పన్ను కోతలు ఉండాలని, రాయితీని ఏడాదిలోపు ఖర్చు చేయడానికి మరిన్ని ప్రోత్సాహకాలు అందంచాలని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దీనిపై, నిపుణులు ఏం చెబుతున్నారు?
"జీవన వ్యయం, ధరలు పెరగడంతో... వినియోగం పెంచడానికి, భవిష్యత్తులో పొదుపు, పెట్టుబడుల కోసం ప్రణాళికలు వేసుకోడానికి, ఖర్చు చేసే తమ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు".
"ఆదాయ శ్లాబులను విస్తరించి, వ్యక్తిగత పన్నును తగ్గించడం అనేది ప్రజల్లో దీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న అత్యంత పాపులర్ డిమాండ్. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంచడానికి వ్యక్తుల కొనుగోలు శక్తి, వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం కోరుకుంటూ ఉండడంతో దానికి చాలా అవకాశాలు ఉన్నాయి" అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ దివ్యా బవేజా బీబీసీకి చెప్పారు.
అయితే దీనిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు టాక్స్ శ్లాబుల్లో మార్పులు రావడం ప్రయోజనకరమే అంటుంటే, కొంతమంది మాత్రం ప్రభుత్వం తీసుకునే చర్యలను అది తీవ్రంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు.
ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం ఆదాయ పన్ను రశీదులు(దాదాపు 30 శాతం వాటా). మిగతా ఆదాయ వనరుల నుంచి, అంటే కార్పొరేట్ పన్నులు(కోత), జీఎస్టీ(ఆర్థిక మందగమనం వల్ల వసూళ్లు తగ్గడం) వసూళ్లు తగ్గడంతో.. వ్యయం కోసం నిధులు సమకూర్చుకునేందుకు, ఆదాయం కోసం ప్రభుత్వం ఆదాయపన్ను రశీదులపై ఆధారపడాలి. పరిమిత ఆర్థిక స్థితిని చూస్తే రాబోయే బడ్జెట్లో శ్లాబ్ రేట్లలో కోతను ఆశించలేం. మరోవైపు తక్కువ పన్ను రేట్లు వినియోగానికి సహకరిస్తాయి" అని కేర్ రేటింగ్స్ సీనియర్ ఎకానమిస్ట్ కవితా చాకో చెప్పారు.
దేశ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను, నష్టాల్లో ఉన్న మిగతా ప్రభుత్వ సంస్థలను విక్రయించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
దిగుమతి సుంకాలను, దేశీయ తయారీని పెంచే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం 50కి పైగా వస్తువుల దిగుమతి సుంకాలు పెంచాలని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
తన బాలెన్స్ షీట్ను ఆరోగ్యకరంగా ఉంచడానికి, దేశంలో సామాన్యులను సంతోషపెట్టడానికి ఈ బడ్జెట్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు కత్తిమీద సాము కాబోతోంది.

ఇవి కూడా చదవండి:
- ఇది భారత ఆర్థికవ్యవస్థ మందగమనమా లేక మాంద్యమా?
- ఆర్థిక వృద్ధి అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి
- లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









