అయోధ్య కేసులో విచారణ పూర్తి, తీర్పు రిజర్వులో ఉంచిన సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images
అయోధ్య కేసులో విచారణను సుప్రీంకోర్టు ముగించింది. అయోధ్య కేసులో ఎలాంటి ఇంటర్వెన్షన్ దరఖాస్తులు అనుమతించేది లేదని, ఈరోజుతో దీనిపై విచారణ పూర్తైందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి అన్నారు.
"ఈరోజు 40వరోజు, ఇక 41వరోజు విచారణ ఉండదు, ఆరోజు మా తీర్పు ఉంటుంది. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే రాతపూర్వకంగా మూడురోజుల్లో తెలియచేయవచ్చు" అని కోర్టు సూచించింది.
40వ రోజు ఏం జరిగింది?
బాబర్ అయోధ్యకు వచ్చారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నిర్మోహి అఖాడా తరపు న్యాయవాది సుశీల్ కుమార్ జైన్ అన్నారు.
"వారు చూపించిన పత్రాలు ఓ రెవెన్యూ గ్రాంట్కు సంబంధించినవి. అవి బాబ్రీ మసీదుకు సంబంధించినవి కావు. మనల్ని కలిపి ఉంచేది, విశ్వాసం, నమ్మకాలే. బాబర్ ఏం చేశారనేదానితో సంబంధం లేదు, అక్కడున్నది మందిరమే. దాన్ని బాబర్ కూలగొట్టలేదు. గతంలోను, ఇప్పుడూ కూడా అది మందిరమే. మందిరాన్ని కూలగొట్టి మసీదును నిర్మించారనే వాదన అనవసరంగా సృష్టించారు. దీన్ని పొందాలంటే ముస్లింలు కూడా అసలు వారికి ఆ ప్రదేశం ఎలా వచ్చిందో నిరూపించుకోవాలి. మందిరాన్ని నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ నిర్వహించేవారు" అని జైన్ తెలిపారు.
అఖిల భారత హిందూ మహాసభ న్యాయవాది వికాస్ సింగ్ వాదనల పట్ల ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వాదనలు కొనసాగితే, మేం దీన్ని ముగించి ఇక్కడి నుంచి వెళ్లిపోతాం. దీంతో, న్యాయస్థానంపై తనకెంతో గౌరవం ఉందని, కోర్టు ఔన్నత్యానికి తాను భంగం కలిగించనని వికాస్ సింగ్ తెలిపారు.
ఈ కేసులో తన అపీలును వెనక్కి తీసుకుందనే వార్తలను సున్నీ వక్ఫ్ బోర్డు ఖండించిందని వార్త సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"వెనక్కి తీసుకోవాలంటే కోర్టులో దరఖాస్తులు చేయాలి, కానీ అలాంటిదేమీ జరగలేదు" అని సున్నీ వక్ఫ్ బోర్డు తరపు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ తెలిపారు.
134 ఏళ్ల నాటి ఈ వివాదం మీద జస్టిస్ గొగోయి తాను నవంబర్ 17వ తేదీన రిటైరయ్యేలోగా తీర్పు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మంగళవారం 39వ రోజు ఏం జరిగింది?
రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసు విచారణలో మంగళవారం 39వరోజు. హిందూ సంస్థలు తమ ప్రార్థనలను చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా కోర్టుకు ఈరోజు తమ వాదనలు వినిపించాయి.
రేపటితో ఈ కేసులో విచారణలు పూర్తి కావచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
"ఈరోజు 39వ రోజు. రేపు 40వ రోజు. విచారణలో అదే చివరి రోజు కావచ్చు" అని సీజేఐ వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే రేపటితో ఈ కేసులో విచారణ పూర్తి ముగియవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
నిర్మోహి అఖాడా తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సుశీల్ కుమార్ జైన్ తల్లి మరణించారని సీనియర్ న్యాయవాది డాక్టర్ రాజీవ్ ధావన్ ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి తెలిపారు.
దీంతో, సున్నీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి మహంత్ సురేశ్ దాస్ తరపున సీనియర్ అడ్వొకేట్ కె.పరాశరన్ వాదనలు వినిపించారు.
అయోధ్యలోని వేరే ఇతర మసీదుల్లో ఎక్కడైనా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని పరాశరన్ కోర్టుకు తెలిపారు. అయోధ్యలో ఇంకా చాలా మసీదులున్నాయని, వాటిని ప్రార్థనకోసం ఉపయోగించుకోవచ్చని ఆయనన్నారు.
"అయోధ్యలోనే దాదాపు 50-60 మసీదులున్నాయి. కానీ హిందువులకు మాత్రం ఇది వారి దైవం రాముడి జన్మభూమి. జన్మభూమిని మార్చలేం కదా" అని పరాశరన్ కోర్టుకు తెలిపారు.
రామజన్మభూమిగా భావిస్తున్న (గుర్తించిన) ఈ ప్రదేశం కోసం శతాబ్దాలుగా హిందువులు పోరాడుతున్నారని పరాశరన్ అన్నారు.
"హిందువులకు ఇది రామ జన్మభూమి. ముస్లింలకు ఇదో చారిత్రక మసీదు. ముస్లింలకు మసీదులన్నీ ఒక్కటే. హిందువుల దైవం రాముడి జన్మభూమిని మార్చలేం" అని పరాశరన్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
పరాశరన్ వాదనలను సున్నీ వక్ఫ్ బోర్డు తరపు న్యాయవాది డాక్టర్ రాజీవ్ ధావన్ తిరస్కరించారు. అయోధ్యలో ఎన్ని ఆలయాలున్నాయో చెబుతారా అని ఆయనను ప్రశ్నించారు.
దీనికి సమాధానమిచ్చిన పరాశరన్... రామజన్మభూమి ప్రాముఖ్యాన్ని వివరించేందుకే తాను మందిరం, మసీదుల గురించి మాట్లాడానని చెప్పారు.
వారు ఎప్పటినుంచో నమ్ముతున్నట్లుగా వివాదాస్పద ప్రాంతం తమదేనని ముస్లింలు ఇప్పుడు ఎలా బలంగా చెప్పగలరని పరాశరన్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకప్పుడు మసీదు ఉంది అంటే అది ఎప్పటికీ మసీదే అంటున్న ధావన్ వాదనలను మీరు అంగీకరిస్తారా అని పరాశరన్ను జస్టిస్ గొగోయ్ ప్రశ్నించారు.
"లేదు, అది ఒకప్పుడు మందిరం, ఎప్పటికీ మందిరమే అని మేమంటున్నాం. వారి వాదనలపై నేనెలాంటి వ్యాఖ్య చేయను" అని పరాశరన్ సమాధానమిచ్చారు.
హిందూ మహాసభ తరపున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలను వినిపించారు.
ఈ ప్రదేశం ముస్లింల అధీనంలో ఉండేదనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ఆయనన్నారు. ఒక దేవుడికి చెందిన ప్రదేశాన్ని వేరే వారు కలిగి ఉండటం సాధ్యం కాదు అన్నారు.
ఇవి కూడా చదవండి.
- అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...
- సౌరవ్ గంగూలీ: 'దాదాగిరీ' సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందా?
- వెంటనే చర్చలు ప్రారంభించండి - ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
- పశ్చిమ బెంగాల్: ముగ్గురు కుటుంబ సభ్యుల హత్య కేసులో ఆర్ఎస్ఎస్ కోణం
- ‘కడుపు కాలే రోడ్ల మీదకు వచ్చాం... తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి ఆర్టీసీ సమ్మె నాంది కావాలి’
- టాకింగ్ బాక్స్: కెన్యాలో బాలికలపై వేధింపులకు ఇవి ఎలా పరిష్కారం చూపిస్తున్నాయి...
- అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









